వనపర్తి, సెప్టెంబర్ 25 : దేశంలో, రాష్ట్రంలో ఏదో ఒక మూలన మహిళలపై మానసికంగా లేదా శారీరకంగా ఇబ్బందులు పెడుతున్నారు. ఇలాంటి సంఘటనలను ఎదుర్కొంటున్న మహిళలకు సఖి కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టోల్ఫ్రీ నంబర్ 181 అండగా నిలుస్తుంది. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, ఇంటి నుంచి తప్పిపోయిన వారు, ఇంటి నుంచి వెళ్లగొట్టిన వారు.. ఇలా ఎవరైనా సమస్యలను నేరుగా 181కు సమాచారం అందించొచ్చు. నిమిషాల వ్యవధిలో సఖి కేంద్రం సిబ్బంది అక్కడికి చేరుకొని.. ఐదు రోజుల పాటు వసతి కల్పించి, కిట్ను అందించడంతోపాటు వారికి కావాల్సిన అన్ని సౌకర్యాలను చూసుకుంటారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమష్టిగా స్త్రీలు, బాలికలను పలు రకాల హింసల నుంచి రక్షణ కల్పించడానికి అనేక సహాయ సంస్థలను ఏర్పాటు చేశారు. సఖి కేంద్రాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే నిర్వహిస్తుండగా.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం భిన్నమైన ఆచరణకు శ్రీకారం చుడుతూ స్త్రీ ఆధ్వర్యంలో పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థలను టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ ప్రోత్సాహంతో ఎంపిక చేసి బాధ్యతను అప్పజెప్పడంతోపాటు చైర్మన్గా జిల్లా కలెక్టర్ వ్యవహరిస్తున్నారు. దీనికి అనుగుణంగా జిల్లాలో మహిళా శిశు అభివృద్ధి శాఖ, రూరల్ డెవలప్మెంట్ సంస్థ (ఆర్డీఎస్) భాగస్వామ్యంతో సఖి కేంద్రాలను నిర్వహిస్తున్నారు. వనపర్తి జిల్లాలో 2019 జూన్ 2న వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి, కలెక్టర్ శ్వేతామొహంతి, ఎస్పీ అపూర్వరావులతో కలిసి వల్లభ్నగర్లో సఖి కేంద్రాన్ని ప్రారంభించారు. ఆనాటి నుంచి నేటి వరకు 874 కేసులు రాగా.. 715 కేసులను పరిష్కరించారు. 159 కేసులు ఆయా దశల్లో ఉన్నాయి. 266 అవగాహన కార్యక్రమాలతో 32,730 మందికి సేవలపై అవగాహన కల్పించినట్లు సఖి కేంద్రం కార్యనిర్వాహణ అధికారిణి శిరీన్ తెలిపారు.
181 ముఖ్య ఉద్దేశం..
ఫోన్ ద్వారా మహిళలు ఫిర్యాదు చేసేలా హెల్ప్లైన్ నంబర్ 181ను ప్రవేశపెట్టారు. గృహహింస, వరకట్నం, ఎన్ఆర్ఐ వివాహ బాధితులు, భర్త, అత్త, మామ, ఆడపడుచు వేధింపులు, ఆస్తి వివాదాలు, బెదిరింపులు తదితర సమస్యలపై ఫిర్యాదు చేయొచ్చు. 24 గంటలపాటు ఈ టోల్ఫ్రీ నంబర్ అందుబాటులో ఉంటుంది. బాధితులు ఫోన్ చేయగానే.. హైదరాబాద్లోని మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రధాన కార్యాలయ సిబ్బంది స్పందించి, సమస్యను, స్థలాన్ని నమోదు చేసుకుంటారు. సమాచారాన్ని జిల్లా అధికారులకు తెలియజేస్తారు. వివరాల ప్రకారం పోలీసులు, అధికారులు, సిబ్బంది అక్కడికి చేరుకొని కౌన్సెలింగ్ ద్వారా సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తారు. టోల్ఫ్రీ సిబ్బంది మళ్లీ బాధితుడికకి ఫోన్ చేసి సమస్య పరిష్కారమైందా..? లేదా..? అని తెలుసుకుంటారు. ఫిర్యాదుదారురాలి విషయాలు గోప్యంగా ఉంచుతారు. ఫోన్ చేసినప్పుడు మొత్తం రికార్డు అవుతుంది. పబ్లిక్ కేసులు, విద్యాసంస్థల్లో లైంగిక వేధింపుల సమాచారాన్ని పోలీసులు, షీ టీంకు అందజేస్తారు. మానసిక ఆందోళనకు గురువుతున్న వారికి అవసరం అనుకుంటే చట్టపరమైన సాయం కూడా అందిస్తారు. నిరాధరణకు గురై నీడలేని మహిళలను స్టే హోమ్స్, సదరం హోమ్స్కు పంపిస్తారు. ఎవరైనా వసతి కావాలంటే తాత్కాలిక సాయం చేయడంతోపాటు విడిది ఏర్పాటు చేస్తారు.
సఖి కేంద్రం అందించిన సేవల్లో కొన్ని..
ముంబై పన్వేల్కు చెందిన కృషిద్షేక్ (52) పని నిమిత్తం మహారాష్ట్రకు వెళ్లేందుకు బ దులు సికింద్రాబాద్కు చేరుకున్నది. అక్కడి వారి కి బాష అర్థకం కాక పన్వేల్ బస్సు బదులు పాన్గల్ వెళ్లేందుకు వనపర్తి బస్సు ఎక్కించారు. కరో నా సమయం కావడంతో పాన్గల్లో ఆదరించే వారు లేక అవస్థలు పడుతుండగా ఎస్సై గుర్తించి సఖి కేంద్రానికి సమాచారాన్ని అందించారు. 85 రోజుల పాటు ఆమెకు వసతి కల్పించి.. కుటుంబ సభ్యులతో మాట్లాడగా వారు ఆమెను ఆశ్రయించేందుకు నిరాకరించారు. దీంతో అక్కడి డీడబ్ల్యూవో గైఖ్వాడ్ సమక్షంలో ముంబైలోని కృప మహిళా వసతి గృహంలో చేర్పించారు.
మహబూబ్నగర్ జిల్లా పొన్నకల్ గ్రామానికి చెందిన బాలమ్మ (85) ఖిల్లాఘణపురం గ్రామంలో మతిస్థిమితం లేకుండా ఉన్న విషయంపై పలు పత్రికల్లో కథనాలు వచ్చాయి. దీంతో జిల్లా డీడబ్ల్యూవో ఆదేశాల మేరకు సఖి కేంద్రానికి తీసుకొచచ్చి రెండు రోజుల పాటు వసతి కల్పించి.. కుటుంబసభ్యుల వివరాలు తెలుసుకుని ఇంటికి పంపించారు.
తలకు గాయాలై రోడ్ల వెంట తిరుగుతున్న లక్ష్మీ అనే గుర్తు తెలియని మహిళను గమనించిన వనపర్తి రూరల్ ఎస్సై సఖి కేంద్రానికి సమాచారాన్ని అందించారు. ఆమెను వెంటనే మహబూబ్నగర్ దవాఖానకు తరలించి చికిత్స అందించారు. మతిస్థిమితం లేకపోవడంతో హైదరాబాద్లోని ఎర్రగడ్డ దవాఖానలో వైద్యాన్ని అందిస్తున్నారు. ప్రస్తుతం కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు.
వినియోగించుకోవాలి..
మహిళల రక్షణ కోసం మహిళావృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన 181 టోల్ఫ్రీ నంబర్ సేవలను మహిళలు సద్వినియోగం చేసుకోవాలి. ఉద్యోగినులు, విద్యార్థులు, గృహిణులు ఎదుర్కొంటున్న సమస్యలను ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. వారికి ప్రభుత్వం తరపున మహిళా, శిశు సంక్షేమ శాఖ అండగా ఉంటుంది.
పుష్పలత, మహిళా, శిశు సంక్షేమ జిల్లా అధికారిణి, వనపర్తి