తాండూరు రూరల్, సెప్టెంబర్ 29: వారం రోజుల పాటు కురిసిన వర్షాలకు తాండూరు మండలంలోని పలు పంటలు దెబ్బతిన్నాయి. ఎడతెరపి లేకుం డా కురిసిన వర్షాలతో పంట పొలాలన్నీ నీట మునిగాయి. ప్రధానంగా కంది, పత్తి, వరి పంటలకు నష్టం వాటిల్లింది. మండల పరిధిలో కంది పంట 17,099 ఎకరాల్లో సాగవుతున్నది. అదేవిధంగా వరి 2,863 ఎకరాలు, పత్తి 5,301 ఎకరాల్లో సాగు చేస్తున్నారు.ప్రధానంగా చెరువుల కింద సాగవుతున్న వరి పంటకు ఎక్కువ నష్టం జరిగింది. అదేవిధంగా లోతట్టు ప్రాంతాల్లో సాగవుతున్న పత్తి పంటకు కూడా ఎక్కువ నష్టం జరిగింది. పత్తి పొలాల్లో నీరు నిల్వ ఉండడం వల్ల పత్తిపంట ఎర్రబడింది. కంది పంట పొలాల్లో నీరు నిలవ్వడం వల్ల ఎండుతెగులు సోకే అవకాశాలు ఉన్నాయి. నది పరివాహక ప్రాంతాలైన వీర్శెట్టిపల్లి, గోనూర్, నారాయణపూర్ గ్రామాల్లో కంది, పత్తి, వరి వరద ఉధృతికి కొట్టుకుపోయాయి. బెల్కటూర్, అల్లాపూర్,చెంగోల్ తదితర గ్రామాల్లో కూడా పంటనష్టం జరిగినట్లు రైతులు వాపోతున్నారు. అకాల వర్షాలకు పంట నష్ట వివరాలపై వ్యవసా యాధి కారులు ఆరా తీస్తున్నారు. మండలంలో ఏయే పంటలు ఎంత మేరకు నష్టపోయిందనే విషయాలపై క్షేత్ర స్థాయిలో అధికారులు పరిశీలన చేసి, సర్వే వివరాలు నమోదు చేస్తున్నారు. పంట నష్టం వివరాలు గ్రామాల వారీగా సేకరిస్తున్నట్టు ఏఈవో శ్రీనివాస్ తెలిపారు.