ఆదర్శంగా నిలుస్తున్న గ్రామం
నిత్యం చెత్త సేకరణతో పల్లెంతా పరిశుభ్రం
ప్రతి వీధిలో సీసీ రోడ్డు, మురుగుకాల్వల నిర్మాణం
ఆకట్టుకుంటున్న పల్లె ప్రకృతి వనం
గ్రామ నర్సరీలో హరితహారం మొక్కలు సిద్ధం
అందుబాటులోకి రైతువేదిక, వైకుంఠధామం, డంపింగ్యార్డు
‘మిషన్ భగీరథ’తో సరిపడా తాగునీరు
ఇంటింటికీ ఇంకుడుగుంతలు
‘పల్లె ప్రగతి’తో మారిన గ్రామ రూపురేఖలు
ధారూరు, మార్చి 28: పల్లెలు ఆదర్శంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి పకడ్బందీగా అమలు చేస్తున్నది. దీంతో వికారాబాద్ జిల్లా ధారూరు మండలం మోమిన్కలాన్ రూపురేఖలు మారాయి. పల్లెప్రగతితో పాటు ప్రభుత్వ పథకాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటూ అభివృద్ధిలో గ్రామం దూసుకెళ్తున్నది. ప్రభుత్వం సూచించిన ప్రత్యేక కార్యాచరణతో ప్రజాప్రతినిధులు, గ్రామ కమిటీ సభ్యులు, గ్రామస్తులతో పాటు అధికారులు ఉత్సాహంగా పనిచేస్తున్నారు. దీంతో గ్రామంలో పరిశుభ్రత, పచ్చదనం కార్యక్రమాలు చేపట్టడంతో మోమిన్కలాన్ అభివృద్ధి దిశలో పయనిస్తున్నది. గ్రామంలో రోడ్డుకిరువైపులా హరితహారం మొక్కలు పచ్చదనంతో స్వాగతం పలుకుతున్నాయి. సీసీ రోడ్లు, కాంతులు విరాజిల్లుతున్న లైట్లు, ఆహ్లాదకరమైన పల్లె ప్రకృతి వనం, నర్సరీ, పంచాయతీ భవనం అభివృద్ధికి నిదర్శనంగా కనిపిస్తున్నాయి.
పల్లె ప్రకృతి వనం, నర్సరీ..
గ్రామంలో పల్లె ప్రకృతి వనంలో 1,650 మొక్కలు నాటి వాటి చుట్టూ కంచె ఏర్పాటు చేసి, వాకింగ్ ట్రాక్, గేటు ఏర్పాటు చేశారు. వేసవికాలంలో ప్రతి రోజూ మొక్కలకు నీరు అందిస్తూ రక్షిస్తున్నారు. నర్సరీలో టేకు, తులసి, జామ, టైకోమా, జీడి, నిమ్మ ఖర్జూర, ఉసిరి తదితర 5వేల మొక్కలు పెంచుతున్నారు.
పల్లె ప్రగతి కార్యక్రమంలో అభివృద్ధి
పల్లె ప్రగతిలో భాగంగా గ్రామంలో రూ.11.86 లక్షలతో వైకుంఠధామం, రూ.2.5 లక్షలతో కంపోస్టు యార్డు, రూ.5.88 లక్షలతో పల్లె ప్రకృతి వనం, రూ.1.26 లక్షలతో నర్సరీ, రూ.22 లక్షలతో రైతువేదిక, రూ.2.75 లక్షలతో పశువుల షెడ్లు, రూ.22.95 లక్షలతో కల్లాలు, రూ.9.75 లక్షలతో ఇంకుడు గుంతల నిర్మాణాలు చేపడుతున్నారు.
ఇంటింటికీ మిషన్ భగీరథ
మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికీ తాగు నీరు అందిస్తున్నారు. గతంలో తాగునీరు కావాలంటే పొలాల నుంచి తెచ్చుకునేవారు. మూడేండ్లుగా మిషన్ భగీరథ పథకం ద్వారా మంచి నీటికి ఇబ్బందులు లేవు. గ్రామంలోనే ట్యాంక్ ఏర్పాటు చేసి ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీటిని సరఫరా చేస్తున్నారు.
గ్రామస్తుల సహకారంతోనే అభివృద్ధి..
గ్రామస్తుల సహకారంతో పల్లె ప్రగతి విజయవంతమైంది. సర్పంచ్తో పాటు ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, టెక్నికల్ అసిస్టెంట్ శ్రీనివాస్ సహకారంతో అభివృద్ధి చేశాం. ప్రతి ఒక్కరూ అభివృద్ధికి పాటుపడ్డారు. పార్టీలకతీతంగా పంచాయతీ అభివృద్ధికి ముందుకొచ్చారు. గ్రామంలో పచ్చదనం, పరిశుభ్రతకు ఆధిక ప్రాధానత్యనిస్తున్నాం.
-పూర్ణిమ, కార్యదర్శి, మోమిన్కలాన్
గ్రామ అభివృద్ధే లక్ష్యం
గ్రామాభివృద్ధే ప్రధాన లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. రాజకీయాలకతీతంగా పల్లె ప్రగతి కార్యక్రమాన్ని విజయవంతం చేశాం. మున్ముందు మరిన్ని కార్యక్రమాలు చేపట్టి ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దుతాం. గ్రామాభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో మౌలిక సదుపాయాలు సమకూర్చుకున్నాం.
-శ్రీనివాస్ రెడ్డి, సర్పంచ్, మోమిన్కలాన్
ఇవి కూడా చదవండి
అభిమానులు గర్వపడేలా కష్టపడతాను!
త్వరలో Mi స్మార్ట్ బ్యాండ్ 6 లాంచ్!