యాచారం, సెప్టెంబర్25: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంలో అభివృద్ధి, పచ్చదనం, పరిశుభ్రతతో యాచారం గ్రామ రూపురేఖలు మారిపోయా యి. ప్రగతి పథంలో కొనసాగుతూ మిగతా గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. ఇప్పటికే గ్రామంలో వందశాతం అభివృద్ధి పనులు పూర్తయ్యాయి. పల్లె ప్రకృతి వనం, కంపోస్టు షెడ్డు, వైకుంఠధామం నిర్మాణం పూర్తిచేశారు. రోజూ పంచాయతీ ట్రాక్టర్తో చెత్త సేకరించి, డంపింగ్ యార్డుకు తరలించి, సేంద్రియ ఎరువులు తయారు చేస్తున్నారు. ఇంటింటికీ మరుగుదొడ్డి, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మించడంతో పరిశుభ్రతతోపాటు స్వచ్ఛతకు మారు పేరుగా నిలిచింది. నర్సరీలో భారీగా మొక్కలు పెంచుతున్నారు. హరితహారం మొక్కలను సంరక్షించడంతో గ్రామంలో పచ్చదనం పెంపొందుతున్నది. మండల కేంద్రంలో సాగర్ రహదారి నాలుగులేన్ల సీసీ రోడ్డుతో ఉంది. రోడ్డు డివైడర్ మధ్య సెంట్రల్ లైటింగ్, ఆహ్లాదాన్ని పంచే పచ్చని చెట్లతో అందం ఉట్టిపడుతున్నది. గ్రామస్తులు, పాలక మండలితో కలిసి సర్పంచ్ ముదిరెడ్డి శ్రీధర్రెడ్డి పంచాయతీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారు.
గ్రామంలో అభివృద్ధి పనులు
పల్లె ప్రగతి ద్వారా గ్రామంలో పాత ఇండ్లు కూల్చేశారు. పాడుబడిన బావులు పూడ్చేశారు. రూ.6 లక్షలతో పంచాయతీ అవసరాలకు కొత్త ట్రాక్టర్, రూ.3.20 లక్షలతో ట్రాలీ, ట్యాంకర్ కొన్నారు. రూ.6 లక్షలతో బతుకమ్మ ఘాట్ నిర్మాణం, రూ.80 లక్షలతో భూగర్భ డ్రైనేజీ పనులు పూర్తి చేశారు. యాచారం, మొగుళ్లవంపు, గాండ్లగూడ గ్రామాల్లో 100 శాతం మరుగుదొడ్లు, భూగర్భ డ్రైనేజీ, మిషన్ భగీరథ నల్లాల బిగింపు పనులు పూర్తి చేశారు. రూ.12.50 లక్షలతో వైకుంఠధామం, రూ.2.50 లక్షలతో కంపోస్టు షెడ్డు, రూ.22 లక్షలతో రైతు వేదిక నిర్మించారు.
పల్లె ప్రకృతి వనంలో..
గ్రామంలోని తిరుమలేశుడి గుట్టకింద పల్లె ప్రకృతి వనం ఏర్పాటుచేశారు. ఇందులో పండ్లు, పూలు, వివిధ రకాల మొక్కలు పెంచుతున్నారు. నిత్యం ట్యాంకర్తో నీరుపోసి సంరక్షిస్తున్నా రు. చుట్టూ ప్రహరీ నిర్మించారు. ఇందులో 2600 మొక్కలు, పంచాయతీకి అనుబంధంగా ఉన్న మొగుళ్లవంపులో 800 మొక్కలు, గాండ్లగూడలో 120 మొక్కలు పెంచుతున్నారు. బృహత్ ప్రకృతి వనంలో 15 వేల మొక్కలు సంరక్షిస్తున్నారు.
ప్రగతి పనుల్లో ఆదర్శంగా..
యాచారంలోని సాగర్ రహదారికి ఇరువైపులా, మండల కేంద్రంలో డివైడర్ మధ్యలో హరితహారం మొక్కలు నాటి, వాటిని సంరక్షిస్తున్నారు. ఇవి ఏపుగా పెరిగి రోడ్లకు అందాన్ని తీసుకొచ్చాయి. సాగర్ రహదారిపై డివైడర్ మధ్యలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి చొరవతో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుచేశారు. విద్యుత్తు వెలుగులతో రోడ్లు జిగేల్ మంటున్నాయి. వైకుంఠధామంలో శ్మశాన వాటికలు, స్నానాల గదులు, మరుగుదొడ్లు నిర్మించారు. యాచారం, మొగుళ్లవంపు, గాండ్లగూడ గ్రామాల్లోని ప్రతి ఇంటికి మిషన్ భగీరథ తాగునీటిని నల్లాల ద్వారా సరిపడా నీరందిస్తున్నారు.
ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా..
గ్రామస్తులు, పాలకవర్గం సహకారంతో గ్రామాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తున్నాం. విద్యుత్, వైద్యం, సీసీరోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, తాగునీరు, వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం, కంపోస్టు షెడ్డు, డంపింగ్ యార్డు, వాటర్ ట్యాంకుల నిర్మాణ పనులు పూర్తి చేశాం. గ్రామాన్ని మండలంలోనే ఆదర్శం అభివృద్ధి చేస్తాం. – శ్రీధర్రెడ్డి సర్పంచ్, యాచారం
గ్రామాభివృద్ధే ధ్యేయం
గ్రామంలోని సమస్యలను పరిష్కరించి, అభివృద్ధి చేయడమే ధ్యేయం. గ్రామాభివృద్ధికి ప్రతిఒక్కరూ సహకరించాలి. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజల సమన్వయంతో గ్రామంలో ప్రగతి పనులు చేస్తున్నాం. మండలంలోని అన్ని గ్రామాలకు యాచారం ఆదర్శంగా నిలిచేలా కృషి చేస్తాం.
సుకన్య, ఎంపీపీ, యాచారం
అభివృద్ధి చేసేందుకు కృషి
మండల కేంద్రంలోని సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించి, అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నాం. గ్రామంలో రోజూ పారిశుధ్య పనులు నిర్వహిస్తున్నాం. గ్రామాభివృద్ధికి అంద రూ సహకరించాలి. సమస్య వచ్చినప్పుడు మా దృష్టికి తీసుకొస్తే వెంటనే పరిష్కరిస్తాం.
– అనిల్రెడ్డి, ఇన్చార్జి పంచాయతీ కార్యదర్శి