ధారూరు, సెప్టెంబర్ 25 : వ్యవసాయశాఖ అధికారుల సలహాలు సూచనలు తప్పక పాటించాలని వికారాబాద్ డివిజినల్ వ్యవసాయ శాఖ అధికారి వినోద్కుమార్ అన్నారు. శనివారం ధారూరు మండల కేంద్రంలోని రైతు వేదికలో మండల పరిధిలోని అవుసుపల్లి గ్రామ రైతులకు ఆరుతడి పంటలపై అవగాహన కల్పించారు. అనంతరం వరుస నారువేసే విధానాన్ని మండల వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి క్షేత్ర పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఏడీఏ వినోద్కుమార్ మాట్లాడుతూ రైతులు ఆరుతడి పంటలను సాగు చేసుకోవాలన్నారు. వేరుశనగ, కుసుమ, జొన్న, ఆముదం, కూరగాయలను పండించాలని సూచించారు. రైతుబీమా తప్పనిసరి చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి జ్యోతి, ఏఈవో సంజీవ్రాథోడ్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు వెంకటయ్య, ఉప సర్పంచ్ సుదర్శన్, రైతులు ఆంజనేయులు, చెన్నయ్య, అంజయ్య, నర్సింహులు పాల్గొన్నారు.
లాభసాటి పంటలను సాగు చేయాలి
కొడంగల్, సెప్టెంబర్ 25: లాభసాటి పంటలను సాగు చేయాలని ఏడీఏ వినయ్కుమార్ రైతులకు సూచించారు. శనివారం మండలంలోని పర్సాపూర్ గ్రామంలో సర్పంచ్ సయ్యద్ అంజద్ అధ్యక్షతన రైతు వేదికలో రైతులకు అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంట మార్పిడి పద్ధతులను రైతులు అవలంబించాలని, అధిక దిగుబడిని సాధించేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో రైతుబంధు కోఆర్డినేటర్ బస్వరాజ్, ఎంపీటీసీ గోవిందమ్మబుగ్గప్ప, ఉప సర్పంచ్ మొగులయ్య, ఏఈవో ఢాక్యానాయక్ పాల్గొన్నారు.
బొంరాస్పేట మండలంలో..
బొంరాస్పేట, సెప్టెంబరు 25 : యాసంగిలో వేరుశనగ, పెసర, జొన్న, మినుములు, రాగులు వంటి పంటలను పండించాలని ఏఈవోలు రేణుక, మొహియొద్దీన్ పేర్కొన్నారు. శనివారం మండలంలోని నాగిరెడ్డిపల్లి, దుద్యాల గ్రామాల రైతు వేదికల్లో నిర్వహించిన సమావేశాల్లో వారు రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించారు. యాసంగిలో వరి పంటను సాగు చేయరాదని సూచించారు. పంట మార్పిడి చేస్తే మంచి దిగుబడులు వస్తాయని వారు వివరించారు. వానకాలం పంటల వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని సూచించారు. రైతుబీమా పథకానికి దరఖాస్తు చేసిన రైతు భార్య నామినీగా ఉంటే, ఆమె ఆధార్ కార్డులో తండ్రి పేరుకు బదులుగా భర్త పేరే ఉండాలని, ఈ విధంగా మార్పు చేసుకోవాలని ఏఈవోలు సూచించారు. రాయితీపై వేప నూనె అందుబాటులో ఉందని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.