మొయినాబాద్, సెప్టెంబర్24: పచ్చని చెట్లు.. పక్షుల కిలకిలరావా లు.. జింకల పరుగులు.. నెమళ్ల నాట్యాలు.. ఉడుతల ఉరుకులాటలు, ఔషధ మొక్కల నుంచి వెదజల్లే సువాసనలు సందర్శకులను ఆహ్లాదపరుస్తున్నాయి. బిజీ లైఫ్లో కాసేపు సేద తీరాలనుకునే వారికి, ప్రకృతి అందాలను వీక్షిస్తూ సరదాగా గడపాలనుకునే వారికి కేరాఫ్ అడ్రస్ మృగవని పార్కు. రాష్ట్ర ప్రభుత్వం పర్యాటకులకు మానసిక ఉల్లాసాన్ని, ఆహ్లాదకర వాతావరణాన్ని అందించడానికి పార్కులు అభివృద్ధి చేస్తున్నది. సందర్శకుల సందడితో చిలుకూరు మృగవని జాతీయ వనం నిత్యం కళకళలాడుతున్నది. పక్షులు, జంతువులు, సర్పా లు పార్కులో సందర్శకులకు కనువిందుచేస్తు న్నాయి. వీటిని చూడటానికి దూర ప్రాంతాల నుంచి కూడా సందర్శకులు తరలివస్తున్నారు.
వనంలో జీవ వైవిధ్యం
మృగవని పార్కులో జీవవైవిధ్యం కనిపిస్తున్నది. ఇందులో వివిధ రకాల పక్షులు, జంతువులు, వృక్షజాతులు, ఔషధ మొక్కలు ఉన్నాయి. అందులో 5 వందల జింకలు, 40 వరకు దుప్పిలు, 2 వందలకుపైగా నెమళ్లు, 100 జాతులకు పైగా వివిధ రకాల పక్షులు, జంతువులు, రకరకాల సరీసృపాలు ఉన్నాయి. ఉడుములు, కుందేళ్లు, అడవి పందులు ఉన్నాయి. ఈ జాతీయ వనం లో 6 వందల జాతులకు పైగా వివిధ రకాల చెట్లు, 100 జాతుల కు పైగా ఔషధ మొక్కలు ఉన్నాయి. జంతువులు నీళ్లు తాగడానికి పార్కులో అక్కడక్కడ నీటి తొట్టీలు ఏర్పాటుచేశారు. కొన్ని చెట్లు, ఔషధ మొక్కలకు వాటి శాస్త్రీయ నామాలతో బోర్డులు ఏర్పాటుచేశారు.
జంట జలాశయాల మధ్య మృగవని పార్కు
హైదరాబాద్- బీజాపూర్ జాతీయ రహదారి పక్కన, ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకుని ఉంది. జంట జలాశయాలైన గండిపేట (ఉస్మాన్సాగర్), హిమాయత్సాగర్ మధ్య ఈ పార్కు ఉంది. తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన చిలుకూరు బాలాజీ దేవాలయానికి వెళ్లే దారిలోనే ఈ పార్కు ఉంటుంది.
ప్రకృతిపై అవగాహన శిబిరాలు
పార్కును సందర్శించడానికి వచ్చిన విద్యార్థులు, పెద్దలకు వారానికి ఒకసారి శిబిరాలు ఏర్పాటు చేసి ప్రకృతిపై అవగాహన కల్పిస్తారు. విద్యార్థులకు పర్యావరణం, వన్యప్రాణుల గురించి వివిధ అంశాలపై బోధిస్తారు. ప్రజలకు పాములపై ఉన్న మూఢ విశ్వాసాలను పటాపంచలు చేయడానికి సర్ప ప్రదర్శన ఏర్పాటు చేస్తారు. పార్కులో పర్యావరణ విజ్ఞాన కేంద్రం ఉంది. అందులో 40 మంది కూర్చునే సామర్థ్యం గల ఆడిటోరియం ఉంది. వీడియో ప్రదర్శనల ద్వారా రాష్ట్రంలోని జాతీయ వనాలు, అభయారణ్యాలు, వన్యప్రాణులు, పర్యావరణంపై అవగాహన కల్పిస్తారు. పర్యావరణ విజ్ఞాన కేంద్రంలో జంతువుల నమూనాలతో మ్యూజియం నిర్మించారు. వన్యప్రాణులు, పర్యావరణంపై విద్యార్థులు విజ్ఞానం పొందడానికి గ్రంథాలయాన్ని ఏర్పాటుచేశారు. అందులో రకరకాల పుస్తకాలు ఉంటాయి.
సందర్శకులకు సఫారీ రైడ్
పార్కులో వివిధ రకాలు పక్షులు, జంతువులు, చెట్లు, ఔషధ మొక్కలు చూపించడానికి సఫారీ రైడ్స్ (బస్సు) ఏర్పాటు చేశారు. పార్కులో సందర్శకులను బస్సులో 5 కిలోమీటర్ల విస్తీర్ణంలో తిప్పడానికి రూ.20లు తీసుకుంటారు. సఫారీలో వెళ్లిన సందర్శకులు జింకల గంతులు, పక్షుల కిలకిలరావాలు, పాముల సయ్యాటలు, నెమళ్ల నాట్యాలు తిలకిస్తూ, ప్రకృతి అందాలు ఆస్వాదిస్తూ, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేస్తారు. వనం మధ్యలో ఏర్పాటు చేసిన ఎత్తైన వాచ్ టవర్ను ఎక్కి అడవి అందాలు చూస్తారు.
పార్కులో ప్రవేశానికి..
మొయినాబాద్ మండలంలోని చిలుకూరు రెవెన్యూలో 12 వందల ఎకరాల్లో రిజర్వు ఫారెస్టు పరిధిలో ఈ పార్కు ఉంది. సందర్శకులు లోపలికి ప్రవేశించాక అధికారులు తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేస్తారు. విద్యార్థులకు జీవవైవిధ్యం, పర్యావరణం, వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన కల్పిస్తారు. 1000 ఎకరాల్లో ఉన్న వనంలోని జంతువులు, పక్షులను తిలకించడానికి ప్రత్యేకంగా రెండు వాహనాలు ఏర్పాటు చేస్తారు. సుమారు 5 కిలోమీటర్ల మేర అడవిలో తిప్పుతూ వారికి అవగాహన కల్పిస్తారు. పార్కును సందర్శించడానికి వచ్చే పెద్దవారికి రూ.10లు, చిన్న పిల్లలకు రూ.5లు ప్రవేశ రుసుం తీసుకుంటారు. వారు పచ్చని పచ్చిక బయళ్లలో కూర్చొని ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆస్వాదించడానికి బెంచీలు కూడా ఏర్పాటుచేశారు.
అన్ని సౌకర్యాలు కల్పించాం..
పార్కును సందర్శించడానికి వచ్చిన వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. వనంలోని జంతువులు, పక్షులు చూడటానికి సందర్శకులను సఫారీ రైడ్లో తీసుకెళ్తున్నాం. పర్యావరణ విద్యా కేంద్రంలో వీడియోల ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. స్నేక్ షోలు కూడా నిర్వహిస్తున్నాం.
జానకీరాం, డీఎఫ్వో, రంగారెడ్డి