వరికి బదులుగా రైతులు అధిక మొత్తంలో ఆరుతడి పంటలు సాగు చేసేలా రాష్ట్ర సర్కార్ ప్రణాళికలు రూపొందిస్తున్నది. ఇకనుంచి దొడ్డు బియ్యం కొనేదిలేదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పడంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించింది. ఈ మేరకు వికారాబాద్ జిల్లా వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా గత యాసంగిలో లక్షా 20వేల ఎకరాలకు పైగా పంటలు సాగుకాగా.. ఇందులో అత్యధికంగా 71వేల ఎకరాల్లో వరి సాగైంది. దీనిలో ఈసారి కనీసం 20 నుంచి 30శాతం తగ్గించడమే లక్ష్యంగా అధికారులు ముందుకెళ్తున్నారు. వరిని వదిలి మంచి లాభాలు వచ్చే పప్పు దినుసులు, వేరుశనగ, మొక్కజొన్న, నువ్వులు, కుసుమలు, కూరగాయలు, పండ్ల తోటల సాగు చేపట్టాలని సూచిస్తున్నారు. భూసారానికి అనుగుణంగా పంటల సాగు ప్రణాళిక తయారు చేయనున్నారు. జిల్లా రాష్ట్ర రాజధానికి అతి చేరువలో ఉండడంతో కూరగాయల సాగుతో రైతులకు మేలు జరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం 27వేల ఎకరాల్లో వివిధ రకాల కూరగాయలు సాగవుతుండగా.. అదనంగా మరో 10వేల ఎకరాలకు, అలాగే పండ్లతోటలను 5వేల ఎకరాలకు పెంచాలని అధికారులు నిర్ణయించారు.
ప్రత్యామ్నాయంగా ఇతర పంటల సాగు
పరిగి, సెప్టెంబర్ 23 : దొడ్డు బియ్యం కొనబోమని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పడంతో రైతులు వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టి కేంద్రీకరించాలని సర్కారు సూచిస్తున్నది. వికారాబాద్ జిల్లా పరిధిలో గత యాసంగిలో జిల్లావ్యాప్తంగా లక్షా20వేల ఎకరాలకుగాను అధికంగా 71వేల ఎకరాల్లో వరి, శనగలు 20వేల ఎకరాలు, జొన్న 10వేల ఎకరాల్లో సాగు చేపట్టారు. ఈసారి యాసంగిలో వరి సాగును కనీసం 20 నుంచి 30 శాతం తగ్గించి, ప్రత్యామ్నాయ పంటలను రైతులు సాగు చేసేలా వ్యవసాయ, ఉద్యానవన శాఖల అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
వరికి ప్రత్యామ్నాయంగా…
పుష్కలంగా వర్షాలు కురువడంతో ఈసారి కూడా వరి సాగు చేపట్టే అవకాశాలున్నాయి. జిల్లా పరిధిలో 1,179 చెరువులు, ఒక మధ్య తరహా ప్రాజెక్టు ఉండగా వాటి కింద 88,497 ఎకరాల ఆయకట్టు ఉంటుంది. బుధవారం నాటికి జిల్లాలో సుమారు 700 చెరువులు నీటితో నిండి అలుగు పారాయి. మిగతా వాటిలో 50 నుంచి 75 శాతం నీరు వచ్చి చేరింది. మరో పెద్ద వర్షం కురిస్తే మిగతా చెరువులన్నీ నిండిపోతాయి. జిల్లా పరిధిలో 55వేల పైచిలుకు వ్యవసాయ బోర్లున్నాయి. చెరువుల కింద నీరు ఎప్పుడూ పారుతుండడంతో వరికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటలు వేయడం కొంత ఇబ్బంది అని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు. దీంతో బోర్ల కింద వరికి బదులు ప్రత్యామ్నాయంగా ఇతర పప్పుదినుసులు, ఆరుతడి పంటలు సాగు చేయించేలా రైతులకు అవగాహన కల్పించనున్నారు. ఈమేరకు జిల్లా వ్యవసాయాధికారి వ్యవసాయ శాఖ అధికారులతో ఇదే అంశంపై ప్రత్యేకంగా సమావేశం కూడా నిర్వహించారు. ఏ ప్రాంతంలో ఏ ఆరుతడి పంటలు సాగు చేస్తే బాగుంటుందని వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. వేరుశనగ, మొక్కజొన్న, నువ్వులు, పెసర, తెల్లకుసుమ పంటల సాగు బాగుంటుందని ఆలోచిస్తున్నారు. వ్యవసాయాధికారుల సూచనలు స్వీకరించిన తర్వాత వ్యవసాయ విశ్వవిద్యాలయానికి సంబంధించి వ్యవసాయ శాస్త్రవేత్తలతో మరో సమావేశం ఏర్పాటు చేయనున్నారు. వారి అభిప్రాయాలు కూడా తెలుసుకొని అందుకనుగుణంగా పంటల సాగు ప్రణాళిక తయారు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఉద్యానవన శాఖ కూడా ఉద్యానవన పంటలు, కూరగాయల సాగు విస్తీర్ణం పెంచేలా రైతులకు అవగాహన కల్పించనుంది.
కూరగాయలు, పండ్ల తోటలు
వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలుగా ఆరుతడి పంటలతోపాటు ఉద్యానవన శాఖ ద్వారా కూరగాయలు, పండ్లతోటల సాగు పెంచాలని నిర్ణయించారు. హైదరాబాద్ మహానగరానికి దగ్గరగా ఉన్నటువంటి వికారాబాద్ జిల్లాలో కూరగాయల సాగు విస్తీర్ణం పెంచడం ద్వారా రవాణాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతులు తమ కూరగాయలను హైదరాబాద్లో విక్రయించవచ్చు. హైదరాబాద్ మహానగరానికి సుదూర ప్రాంతాల నుంచి కూరగాయలు దిగుమతి అవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో వికారాబాద్ జిల్లాలో ప్రస్తుతం 27వేల ఎకరాల్లో కూరగాయలు సాగు చేస్తుండగా, అదనంగా 10వేల ఎకరాల్లో కూరగాయల సాగుకు ప్రోత్సహించాలని నిర్ణయించారు. 1800 ఎకరాల్లో అరటి, బొప్పాయి తోటలుండగా అదనంగా 3వేల ఎకరాల్లో సాగుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దీంతో జిల్లాలో పండ్ల తోటల సాగు 5వేల ఎకరాలకు పెంచాలన్నది లక్ష్యంగా నిర్దేశించుకున్నారు.
రైతులకు అవగాహన
యాసంగిలో వరి సాగుకు ప్రత్యామ్నాయంగా ఇతర పంటల సాగుపై వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించేందుకు ఏర్పాట్లు చేపడుతున్నారు. జిల్లావ్యాప్తంగా 97 క్లస్టర్లు ఉన్నాయి. ఆయా క్లస్టర్లలో ఏఏ పంటలు సాగు చేస్తే తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి వస్తుందో రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించనున్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన కార్యాచరణ రూపొందించనున్నట్లు వ్యవసాయాధికారులు తెలిపారు.