పల్లె ప్రగతితో ఒక పక్క సమస్యలు తీరుతుండగా, మరో పక్క ఊరూ వాడా పచ్చందాలు సంతరించుకుంటున్నాయి. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో గత ఏడేండ్లలో పల్లెపల్లెన హరితహారం కార్యక్రమంలో భాగంగా విస్తృతంగా మొక్కలు నాటించారు. అంతేకాకుండా ప్రతి మండలానికి ఒకటి చొప్పున బృహత్ పల్లె ప్రకృతివనాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా వికారాబాద్ జిల్లా పరిధిలో 19 మండలాలు ఉండగా, అందులో 15 మండలాల్లో వీటి కోసం స్థలాలు లభించగా, 4 మండలాల్లో అటవీ శాఖ భూములను కేటాయించారు. దీంతో పనులు చురుకుగా సాగుతున్నాయి. బృహత్ పల్లె ప్రకృతివనాల్లో 5లక్షల మొక్కలు నాటాలనే లక్ష్యాన్ని నిర్దేశించారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 60,715 గుంతలు తవ్వించి, 52వేల మొక్కలు నాటగా మిగతావి 15 రోజుల్లో పూర్తి చేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా 76 మినీ బృహత్ ప్రకృతి వనాల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు.
పరిగి, సెప్టెంబర్ 22 : పచ్చదనం పెంపుతో మానవ జీవన విధానంలోనూ మార్పులు తప్పనిసరిగా వస్తాయి. పల్లెలు మొదలుకొని పట్టణాల వరకు మొక్కలు నాటే కార్యక్రమాన్ని విస్తృతంగా చేపడుతున్నారు. పల్లెల్లో ప్రకృతి వనాలు, పట్టణాల్లో పట్టణ ప్రకృతివనాలు ఏర్పాటు చేసి మొక్కల పెంపకం చేపడుతున్న సర్కారు ప్రతి మండలానికి ఒకటి చొప్పున బృహత్ పల్లె ప్రకృతివనాల ఏర్పాటుకు నిర్ణయించింది. ప్రతి మండలంలో ఒకేచోట 10 ఎకరాల్లో బృహత్ పల్లె ప్రకృతివనాలు ఏర్పాటు చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా పరిధిలోని 19 మండలాల్లో పనులు కొనసాగుతున్నాయి. 15 మండలాల్లో స్థలాలు సేకరించగా, 4 మండలాల్లో అటవీ శాఖ భూములు కేటాయించారు. పరిగి మండలంలోని ఇబ్రహీంపూర్, దోమ మండలానికి రంగంపల్లి అటవీ ప్రాంతం, కులకచర్ల మండలంలోని ముజాహిద్పూర్, చౌడాపూర్ మండలంలోని మక్తవెంకటాపూర్లో అటవీ ప్రాంతంలో స్థలాలు కేటాయించారు. స్థలాలు గుర్తించి చదును చేయడంతోపాటు మొక్కలు నాటేందుకు గుంతలు తవ్వే పనులు జరుగుతున్నాయి. పలుచోట్ల మొక్కలు నాటే కార్యక్రమం కొనసాగుతున్నది.
వేగంగా పనులు
19 మండలాల్లో ఏర్పాటుచేస్తున్న బృహత్ పల్లె ప్రకృతివనాల్లో 5లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వీటి కోసం కేటాయించిన స్థలాలన్నీ చదును చేయించి, మార్కింగ్ చేసి ఉపాధిహామీ పథకం ద్వారా కూలీలతో గుంతలు తవ్విస్తున్నారు. ఒక ఎకరాకు 3,100 మొక్కలు చొప్పున 19 బృహత్ పల్లె ప్రకృతివనాల్లో 5లక్షల మొక్కలు నాటాలన్నది లక్ష్యంగా నిర్దేశించారు. ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా 60,715 గుంతలు తవ్వించి, 52వేల మొక్కలు నాటారు. మిగతా గుంతలు తవ్వించడం, మొక్కలు నాటించే పనులు 15 రోజుల్లో పూర్తి చేసేలా వేగిరం చేశారు. మండలాల్లోని ఎంపీవోలు, ఉపాధిహామీ సిబ్బంది, గ్రామపంచాయతీల కార్యదర్శులు వేగంగా పనులు జరిగేలా చూడాలని ఆదేశించారు. మధ్యలో ముప్పావు ఎకరా స్థలం ఖాళీగా ఉంచుతారు. చుట్టూ నడిచేందుకు, మధ్యలో నుంచి నాలుగు వైపులా నడిచి వెళ్లేలా దారులు ఏర్పాటు చేయనున్నారు. పిల్లలు ఆడుకునేందుకు ప్రత్యేకంగా ఆట వస్తువులు ఏర్పాటు చేయనున్నారు.
ప్రతి మండలానికి 4 చొప్పున మినీ ప్రకృతివనాలు
జిల్లాలోని 19 మండలాల పరిధిలో 76 మినీ బృహత్ పల్లె ప్రకృతివనాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రతి మండలానికి 4 చొప్పున మినీ బృహత్ పల్లె ప్రకృతివనాలు ఏర్పాటు చేస్తారు. ఒక్కోటి 5 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటుచేసి నిర్దేశించిన మేరకు మొక్కలు నాటుతారు. ఒక ఎకరాకు 3,100 మొక్కలను పెంచనున్నారు. ఈ లెక్కన ఒక్కో మినీ బృహత్ పల్లె ప్రకృతివనంలో 15వేల మొక్కల చొప్పున నాటాలని నిర్దేశించారు. పిల్లలకు ఆడుకునేందుకు ఆటస్థలం ఏర్పాటు చేయనున్నారు. మినీ వనాల ఏర్పాటుకు ఆయా మండలాల్లో స్థలాలు గుర్తించే పనులు కొనసాగుతున్నాయి. జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా గ్రామపంచాయతీ కార్యదర్శులు, ఉపాధిహామీ సిబ్బంది సమన్వయంతో మినీ బృహత్ పల్లె ప్రకృతివనాల ఏర్పాటుకు కృషి చేస్తున్నారు. ముందుగా స్థలాలు గుర్తించి, ఆయా స్థలాలను చదును చేయిస్తున్నారు. అనంతరం మార్కింగ్ చేసి ఉపాధిహామీ కూలీలతో గుంతలు తవ్వించి మొక్కలు నాటడం చేపట్టనున్నారు. వీటిలో సుమారు 11లక్షలకుపైగా మొక్కలు నాటనున్నారు. బృహత్ పల్లె ప్రకృతివనాలు, మినీ బృహత్ పల్లె ప్రకృతివనాల్లో జిల్లా వ్యాప్తంగా సుమారు 16లక్షల మొక్కలను పెంచనున్నారు.