దౌల్తాబాద్, సెప్టెంబర్ 19 : దౌల్తాబాద్ మండలవ్యాప్తంగా పలు గ్రామాల్లో వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతున్నదని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు డా.రతన్లాల్ అన్నారు. ఆదివారం దేవర్ఫసల్వాద్, తిమ్మారెడ్డిపల్లి, బాలంపేట, ఈర్లపల్లి, కుదురుమళ్ల, దౌల్తాబాద్, కుప్పగరి, నీటూర్, గుముడాల గ్రామాల్లోని ప్రజలకు టీకాలను వేయించే కార్యక్రమం విజయవంతమైందని తెలిపారు. ఇన్చార్జి ఎంపీడీవో రవీందర్ మండలంలో నిర్వహిస్తున్న కొవిడ్ టీకాల పంపిణీ కేంద్రాలను సందర్శించారు. అనంతరం డాక్టర్ రతన్లాల్.. మాట్లాడుతూ కొవిడ్ టీకాపై ప్రజలు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.
నాలుగు రోజుల్లో 2184 మందికి టీకా
బొంరాస్పేట, సెప్టెంబర్ 19 : మండలంలో నాలుగు రోజుల్లో 2184 మందికి మొదటి డోసు టీకా వేసినట్లు హెల్త్ ఎడ్యుకేటర్ భాస్కరాచారి తెలిపారు. ఆదివారం కూడా వైద్య సిబ్బంది గ్రామాల్లో పర్యటించి కొవిడ్ వ్యాక్సినేషన్ చేపట్టారు.
ఇంటింటికీ వ్యాక్సినేషన్
బషీరాబాద్, సెప్టెంబర్ 19 : మండలంలో ఇంటింటికీ వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతున్నది. ఆదివారం ఎంపీడీవో రమేశ్ బషీరాబాద్, నవల్గా, ఇందర్చేడ్ గ్రామాల్లో పర్యటించి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు ఉన్నారు.
కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్యం
తాండూరు, సెప్టెంబర్ 19 : తాండూరు మున్సిపల్ పరిధిలోని సాయిపూర్లో ఆదివారం మున్సిపల్ వైస్ చైర్పర్సన్ దీప వ్యాక్సిన్ టీకాను తీసుకున్నారు. ప్రజా ఆరోగ్యమే సర్కార్ ధ్యేయంగా భావించి సామాన్యులకు నాణ్యమైన వైద్యం అందించడం అభినందనీయమన్నారు.
వ్యాక్సినేషన్ డ్రైవ్ను సద్వినియోగం చేసుకోవాలి
ధారూరు, సెప్టెంబర్ 19 : మండల పరిధిలోని 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కొవిడ్ వ్యాక్సిన్ వేసుకోవాలని ధారూరు, నాగసముందర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్లు రాజు, రమేశ్బాబు తెలిపారు. ఆదివారం ఇంటింటికి వ్యాక్సినేషన్ కార్యక్రమంలో భాగంగా నాలుగో రోజు ధారూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో నాగారం, దోర్నాల్, మోమిన్కలాన్, ధారూరు, ధారూరు పీహెచ్సీ, నాగసముందర్ పరిధిలో కెరెళ్లి, తరిగోపుల, కుక్కంద, నాగసముందర్ గ్రామాల్లో వ్యాక్సినేషన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ధారూరు ప్రాథమిక ఆరోగ్య పరిధిలో 400 మందికి, నాగసముందర్ పరిధిలో 222 మందికి వ్యాక్సిన్ వేశామని తెలిపారు.
ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి
మోమిన్పేట, సెప్టెంబర్ 19 : 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని ఉప తహసీల్దార్ రవీందర్ దత్తు పేర్కొన్నారు. ఆదివారం మండల పరిధిలోని ఆమ్రాదికలాన్, మోమిన్పేట, ఎన్కతల, టేకులపల్లి గ్రామాల్లో వ్యాక్సినేషన్ కేంద్రాలను సందర్శించి వ్యాక్సినేషన్ ప్రక్రియను పరిశీలించారు. ప్రతి రోజు గ్రామంలో వంద మందికి వ్యాక్సిన్ అందించేలా లక్ష్యం పెట్టుకొని పనిచేయాలన్నారు. కార్యక్రమంలో వీఆర్ఏ ప్రవీణ్ ఉన్నారు.
కరోనా టీకాను సద్వినియోగం చేసుకోండి
కోట్పల్లి, సెప్టెంబర్ 19 : ప్రపంచాన్నే గడగడలాడించిన కరోనా మహమ్మారిని అంతం చేసేందుకు ప్రజలందరూ బాధ్యతగా టీకాను తీసుకోవాలని ఎంపీడీవో లక్ష్మీనారాయణ తెలిపారు. మూడు రోజులుగా ఆయా గ్రామాల్లో పెద్దఎత్తున సెంటర్లను ఏర్పాటు చేసి వైద్య బృందం వ్యాక్సిన్లు వేస్తున్నారు. ఆదివారం మండలంలోని అన్నాసాగర్ గ్రామంలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పరిశీలించారు. ప్రజల స్పందన ఎలా ఉందని వైద్య బృందాన్ని అడిగి తెలుసుకున్నారు.
మేడికొండలో వ్యాక్సిన్ పంపిణీ
పూడూరు, సెప్టెంబర్ 19 : ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ టీకా వేయించుకోవాలని సర్పంచ్ అనంతరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం పూడూరు మండలం చన్గోముల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధి మేడికొండలో 150 మందికి వ్యాక్సిన్ టీకా వేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామంలో ఇప్పటివరకు వ్యాక్సిన్ తీసుకోని వారి కోసం ప్రత్యేక క్యాంప్ నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీవో ఉష, వార్డు సభ్యులు, నర్సులు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.