కాలమేదైనా పుష్కలంగా తాగునీరు
మిషన్ భగీరథతో మారిన పరిస్థితులు
యాక్షన్ప్లాన్ లేకుండానే వేసవిలో ఇంటింటికీ నీటి సరఫరా
ప్రభుత్వానికి రూ.10 కోట్ల నిధులు మిగులు
వికారాబాద్, మార్చి 19, (నమస్తే తెలంగాణ):మిషన్ భగీరథ పథకంతో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది. కాలమేదైనా స్వచ్ఛమైన నీరు ఇంటింటికీ చేరుతున్నది. ఒకప్పుడు ఎండాకాలం వచ్చిందంటే ‘గుక్కెడు నీళ్ల కోసం బిందెడు కష్టాలు’ అన్న చందంగా పరిస్థితి ఉండేది. దీంతో వేసవి రాకముందే అధికారులు సమ్మర్ యాక్షన్ ప్లాన్తో ప్రభుత్వానికి నివేదికలు పంపేవారు. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో సుదూర బోరుబావుల నుంచి ట్యాంకరతో నీటిని పల్లెలకు తరలించేవారు. ట్యాంకర్ ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితిలో పొద్దంతా పని మానుకొని వేచి ఉన్న దాఖలాలు ఉన్నాయి. మిషన్ భగీరథతో వేసవిలోనూ ఇంటింటికీ సరిపడా నీరు సరఫరా అవుతున్నది. దీంతో వేసవి యాక్షన్ ప్లాన్ అవసరం లేకపోవడంతో ప్రభుత్వానికి రూ.10 కోట్ల నిధులు మిగిలాయి.
వికారాబాద్ జిల్లాలోని 566 గ్రామపంచాయతీల్లో రూ.1060 కోట్లతో 2015 నవంబర్ 12న ‘మిషన్ భగీరథ’ పనులను ప్రారంభించారు. 956 ఆవాసాలు, 2 మున్సిపాలిటీల పరిధిలో తాగునీటిని సరఫరా చేస్తున్నారు. పరిగి 442, వికారాబాద్ 189, తాండూరు 192, నవాబ్పేట మండలం 36 ఆవాసాలకు తాగునీరు సరఫరా అవుతున్నది. 2011 జనాభా లెక్కల ప్రకారం 9.20 లక్షలు ఉండగా, 2033 వరకు నిర్దేశించిన జనాభా 10,60,538 ఉంటుందని అధికారుల అంచనా. 2019 ముడి నీటి డిమాండ్ 1.431 లెక్క కట్టగా వచ్చే రెండేండ్లకి(2033) 1.725 నీటి డిమాండ్ టీఎంసీలలో ఉంటుందని అంచనా వేశారు. డబ్ల్యూటీపీ కింద 43 బీపీటీలు, 6 సంపులు, 3 పంపు హౌస్లు, డబ్ల్యూటీపీ కింద పైప్ నెట్ వర్క్ 403.72 కి.మీ, ప్రైమరీ పైప్లైన్ 1684.32 కి.మీ ఏర్పాటు చేశారు. 135 ఎంఎల్డీ నీటి శుద్ధి కేంద్రం రాఘవాపూర్-జాఫర్పల్లిలో నిర్మించారు. అక్కడి నుంచే జిల్లాకు తాగునీరు సరఫరా అవుతున్నది. ప్రతి పంచాయతీలో ప్రభుత్వ నిబంధనలు పాటించాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇంటింటికీ నల్లా ఉందని, ఎట్టి పరిస్థితుల్లో ఫ్లో కంట్రోల్ వాల్వ్ను ఓపెన్ చేయవద్దని, ఓపెన్ చేసిన ఇంటి యజమానిపై రూ.5వేల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. వాటర్ ట్యాంకుల్లో బ్లీచింగ్ పౌడర్ వేసి క్లోరినేషన్ చేయాల్సిన బాధ్యత సర్పంచ్లపై ఉందని అధికారులు సూచించారు.
శ్రీశైలంలో సమృద్ధిగా నీళ్లు..
శ్రీశైలంలో సమృద్ధిగా నీరు ఉండడంతో వికారాబాద్ జిల్లాకు తాగునీటికి కొదువే లేదు. లీకేజీలు, విద్యుత్ సమస్యలు ఉంటే తప్ప నీటి సరఫరాలో అంతరాయం ఉండదని అధికారులు పేర్కొంటున్నారు. ఇబ్బంది ఉంటే మండల అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. ప్రతి ఇంటికి 300-400 లీటర్ల నీటి సరఫరా చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
ఈ ఎండాకాలం యాక్షన్ ప్లాన్ లేకుండానే..
‘మిషన్ భగీరథ’ రాకముందు ఎండా కాలం వచ్చిందంటే అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెట్టేవి. తాగునీటికి నానా ఇబ్బందులు ఎదుర్కొనేవారు. ‘మిషన్ భగీరథ’తో పల్లెల్లో నీటి కష్టాలకు తెర పడింది. ఈ ఏడాది వేసవి యాక్షన్ ప్లాన్ లేకుండానే బయటపడేలా మిషన్ భగీరథ విభాగం అధికారులు ప్రణాళికలు రూపొందించారు. నూతనంగా బోర్లు వేయడం, పాత బోర్లకు మరమ్మతులు చేయడం, కొత్త పైపు లైన్లు వేయడం, ఉన్న పైపులైన్లకు మరమ్మతులు చేయడం వంటి పనులను పూర్తి చేశారు. దీంతో ఇదివరకు గ్రామీణ నీటి సరఫరా విభాగం, జిల్లా పరిషత్, 11, 12, 13వ ఆర్థిక సంఘం నిధులతో పాటుగా మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల నిధులు, మండల సాధారణ నిధులను ఖర్చు చేసేవారు. ‘మిషన్ భగీరథ’తో ప్రస్తుత ఎండాకాలం దాదాపుగా రూ.10కోట్లకుపైగా ప్రభుత్వానికి మిగులనున్నది.
ట్యాంకులకు జియో ట్యాగింగ్..
జిల్లాలోని తాగునీటి ట్యాంకులకు జియోట్యాగింగ్ను పూర్తి చేశారు. దీంతో ఏ ట్యాంకు వద్ద నీటి సరఫరా ఇబ్బందులు ఉన్నాయో తెలుసుకుని ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. తాగునీటి సమస్య ఉన్న గ్రామానికి ఎన్ని ట్యాంకర్ల నీటిని పంపించాలని తెలుసుకునేందుకు జియోట్యాగింగ్ చేశారు. ఇప్పటికే అన్ని పంచాయతీలకు ట్యాంకర్, ట్రాక్టర్, ట్రాలీలను ప్రభుత్వం అందజేసింది.
మిషన్ భగీరథ నీళ్లు పుష్కలం..
వేసవి కాలం తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలని అధికారులను ఆదేశించాం. మిషన్ భగీరథ నీళ్లు పుష్కలంగా ఉన్నందున జిల్లాలోని అన్ని నివాసాలతో పాటుగా పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు నీరందించాలి. వేసవిలో నీటి సరఫరా వాటర్ ట్యాంకులను శుభ్రం చేసి, క్లోరినేషన్ చేయాలి.