పెద్దేముల్, సెప్టెంబర్ 17: పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా పెద్దేముల్ పంచాయతీలో మౌలిక వసతులన్నీ సమకూరాయి. మిషన్ భగీరథతో గ్రామంలోని అన్ని కాలనీల్లో తాగునీటి సౌకర్యం, వ్యక్తిగత మరుగుదొడ్లు, సీసీ రోడ్లు, మురుగు కాల్వలు, డంపింగ్యార్డు, వన నర్సరీ నిర్మాణం పనులు చేపట్టారు. సర్పంచ్ ద్యావరి విజయమ్మ ఆధ్వర్యంలో గ్రామాభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి, పనులు పూర్తి చేశారు.
రూ.1.15కోటితో గ్రామాభివృద్ధి
పెద్దేముల్ మేజర్ గ్రామ పంచాయతీ. మొత్తం జనాభా 4,705 మంది, 1313 కుటుంబాలు ఉన్నాయి. గ్రామ పంచాయతీ నిధులు రూ.17.50 లక్షలతో మురుగు కాల్వలు, రూ.14 లక్షలతో సీసీ రోడ్లు, జడ్పీ నిధులు రూ.24 లక్షలతో సీసీ రోడ్లు, రూ.5 లక్షలతో మురుగు కాల్వలు నిర్మించారు. రూ.17 లక్షలతో కందకం పూడిక, రూ.4.80 లక్షలతో కాలనీల్లో 7 మినీ వాటర్ ట్యాంకుల నిర్మాణం, తాండూరు- సంగారెడ్డి ప్రధాన రోడ్డుకు ఇరువైపులా రూ.48 వేలతో 370 మొక్కలు నాటి, వాటికి ట్రీగార్డుల ఏర్పాటు, ప్రధాన రోడ్లకు ఇరువైపులా రూ.6 లక్షలతో మొరం పోయించారు. జడ్పీ నిధులు రూ.4 లక్షలతో బస్ షెల్టర్ నిర్మించారు. రూ.లక్షతో గ్రామ సభ వేదిక నిర్మాణం, ఎన్ఆర్ఈజీఎస్, వ్యవసాయ శాఖ నిధులు రూ.22 లక్షలతో రైతు వేదికను నిర్మించారు. రూ.2 లక్షలతో కంపోస్టు షెడ్డు, రూ.12 లక్షలతో వైకుంఠధామం, రూ.2 లక్షలతో ప్రకృతి వనం, రూ.12 లక్షలతో పంచాయతీకి ట్రాక్టర్, ట్రాలీ, వాటర్ ట్యాంకర్ను కొనుగోలు చేశారు. అనుబంధంగా ఉన్న పెద్దేముల్ తండాలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా మౌలిక వసతులు కల్పించారు. గ్రామ ప్రధాన రహదారి తాండూరు-సంగారెడ్డి రోడ్డులో హరితహారంలో నాటిన మొక్కలు ప్రయాణికులు, వాహనదారులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. గ్రామంలోని అన్ని కాలనీల్లో తాగునీరు, సీసీరోడ్లు, మురుగు కాల్వలు, వీధి దీపాలు ఏర్పాటు చేశారు. గ్రామంలో ఎప్పటికప్పుడు పారిశుధ్య పనులు చేపడుతూ ప్రజల కు ఇబ్బందులు తలెత్తకుండా చూసుకుంటున్నారు.
గ్రామాభివృద్ధికి అన్ని విధాలుగా కృషి
గ్రామస్తులు, పాలకవర్గం సహకారాలతో గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నా. రాబోయే కాలంలో మరిన్ని నిధులు తీసుకొచ్చి మరిన్ని అభివృద్ధి పనులు చేపడుతాం. పంచాయతీ పరిధిలో ఎలాంటి సమస్య లేకుండా చూడడమే నా లక్ష్యం.