పరిగి, సెప్టెంబర్ 17: వికారాబాద్ సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి సంబంధిత అధికారులకు ఆదేశించారు. శుక్రవారం నగరంలోని తన కార్యాలయంలో వికారాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధిపై మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, మున్సిపల్ చైర్పర్సన్ సీహెచ్ మంజుల, మున్సిపల్ కమిషనర్ శరత్, ప్రజారోగ్య ఇంజినీరింగ్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ప్రభాకర్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ టీయూఎఫ్ఐడీసీ పథకంలో భాగంగా వికారాబాద్ మున్సిపాలిటీలో రూ.6 కోట్లతో చేపట్టిన 9 పనులను సమీక్షించారు. పూర్తి కాని పనులన్నీ సత్వరమే పూర్తి చేయించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. వికారాబాద్ జిల్లా కేంద్రంగా రూపుదిద్దుకున్నందున అదే స్థాయిలో అభివృద్ధి చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అందుకు సంబంధించి ప్రణాళికలు రూపొందించాలని మంత్రి సూచించారు. వైకుంఠధామాలకు రూ.2కోట్లు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్కు రూ.4కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి పనులు త్వరగా చేపట్టాలని మంత్రి సూచించారు. ట్రాఫిక్ క్రమబద్దీకరణలో భాగంగా చిన్నచిన్న వీధి వ్యాపారులు తమ కార్యకలాపాలను నిర్దేశించిన చోట నిర్వహించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. వికారాబాద్లో ప్రస్తుతం ఉన్న డంపింగ్యార్డుకు అదనంగా మరో డంపింగ్యార్డు ఏర్పాటు చేసేందుకు అనువైన స్థలం గుర్తించాల్సిందిగా మంత్రి పేర్కొన్నారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా వీటిని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పట్టణ సుందరీకరణలో భాగంగా ప్రస్తుతమున్న సెంట్రల్ లైటింగ్ పోల్స్కు రోప్ లైటింగ్ ఏర్పాటు చేయడంతోపాటు శివసాగర్ చెరువు వద్ద బతుకమ్మ ఘాట్ను నిర్మించాలని మంత్రి ఆదేశించారు.