పెద్దేముల్, సెప్టెంబర్ 16: విద్యార్థులకు విషయాల వారీగా పాఠాలు బోధించడం సర్వ సాధారణం.. అవి సులభంగా అర్థమయ్యేరీతిలో కండ్లకు కట్టినట్లుగా చెప్పడం వినూత్నం. కానీ మండలంలోని గోపాల్పూర్ ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులు తీరు వేరు. తమ విద్యార్థుల కోసం ఏదో ఒకటి చెయ్యాలనే తపనతో పాఠశాలలోని తరగతుల వారీగా గోడలకు రంగురంగుల బొమ్మలు, పదాలు, అంకెలు, సూత్రాలు, స్వాతంత్య్ర సమరయోధుల బొమ్మలు, వివిధ అధికారుల విధులు తెలుపుతూ గోడలకు పెయింటింగ్ వేశారు. పాఠశాలను రంగుల ప్రపంచంగా తీర్చిదిద్దారు.
నాలుగు నెలల కష్టం..
మండలంలోని గోపాల్పూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో హెచ్ఎం శ్రీకాంత్, తోటి ఉపాధ్యాయులుగా నర్సింహులు, బందెప్ప, సురేశ్ విధులు నిర్వహిస్తున్నారు. కరోనా నేపథ్యంలో విద్యార్థులు పాఠశాలలకు రాలేదు. ఉపాధ్యాయులే రోజు విడిచి రోజు హాజరయ్యేవారు. దీంతో ఈ పాఠశాల ఉపాధ్యాయులు ఖాళీగా ఉండకుండా విద్యాభివృద్ధికి ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో పాఠశాలలోని తరగతి గదుల గోడలపై రంగురంగుల బొమ్మలు, పదాలు, అంకెలు ఇలా అన్ని రకాలుగా విషయ సూచికలను విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో వాల్ పెయింటింగ్ వేశారు. పాఠశాలలోని నాలుగు గదుల లోపల, బయట, ప్రహారీ లోపల వివిధ రకాల ఇంగ్లిష్ పదాలు, చిత్ర పటాలు, రైలు, బస్సు తదితర చిత్రాలు వేశారు. పాఠశాల మొత్తాన్ని రంగుల ప్రపంచంగా తీర్చిదిద్దారు. ఇందుకు అయ్యే ఖర్చును సొంతంగా తలా కొన్ని వేసుకున్నారు. 4 నెలలు కష్టపడిన నలుగురు ఉపాధ్యాయులు విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం కార్పొరేట్ స్థాయిలో పాఠశాలను ముస్తాబు చేశారు.
కొత్తదనం కోసమే పెయింటింగ్..
ఒక టీచర్గా విద్యార్థులకు పనికొచ్చే పని చేయడానికి నేనెప్పుడూ సిద్ధం. విద్యార్థులకు కొత్తదనంతో విద్యాబోధన ఉండాలని ఆలోచించి తరగతి గదులను రంగులతో ముస్తాబుచేశాం. స్కూల్ గ్రాంట్తోపాటు మిగతా ఉపాధ్యాయుల సహకారంతో సొంత డబ్బు ఖర్చు చేసి, పెయింటింగ్ వేశాం.
అందరం టీం వర్క్ చేశాం
పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులందరం కలిసి సమన్వయంతో టీం వర్క్ చేశాం. పాఠశాలలోని అన్ని తరగతి గదుల్లో పెయింటింగ్ చేశాం. ఒక్కొక్క ఉపాధ్యాయుడి ఆలోచనతో పిల్లలకు అర్థమయ్యే రీతిలో, వారి పుస్తకాల్లోని విషయాన్ని జోడించిన పెయింటింగ్ వేశాం. విద్యార్థుల కోసం మరిన్ని కొత్త ఆవిష్కరణలు చేయడానికి ్తకృషి చేస్తా.