ఆమనగల్లు, సెప్టెంబర్16: ఏ దారి గుండ వెళ్లినా హరితహారంలో నాటిన మొక్కలు పచ్చందాలతో స్వాగతం పలుకుతుంటాయి. ఏ కాలనీకి వెళ్తున్నామో ఆ సూచిక బోర్డులు తెలుపుతాయి. పచ్చదనం, పారిశుధ్యం ఆ గ్రామాన్ని స్వచ్ఛతలో ముందుంచాయి. రాత్రి వేళల్లో విద్యుత్ కాంతులతో ఆ పల్లె జిగేల్మంటోంది. ప్రభుత్వ పథకాలను అందమైన బొమ్మలతో సూచిస్తూ, అక్కడ ఏయే పనులు జరుగుతున్నాయో ఆ గోడ తెలుపుతున్నది. ఇలా ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ అభివృద్ధిలో సూడసక్కని పల్లెగా సుద్దపల్లి ఆదర్శంగా నిలుస్తున్నది.
రెండు జిల్లాల సరిహద్దులో..
రంగారెడ్డి- నల్గొండ జిల్లాల సరిహద్దు గ్రామాల మధ్య, హైదరాబాద్- నాగార్జున సాగర్ హైవేకు కూతవేటు దూరంలో మాడ్గుల మండలంలోని సుద్దపల్లి గ్రామం ఉన్నది. గ్రామం మూడుదిక్కులా దేవరకొండ, చింతపల్లి మండలాల సరిహద్దులు ఉండడం విశేషం. గ్రామ సమీపంలో వాగు, పచ్చని పంటపొలాలు ఉండడంతో ప్రకృతి ఒడిలో సేదతీరినట్లు ఉంటుంది. ప్రజలు, అధికారుల సహకారంతో సర్పంచ్ వెంకటేశ్వర్లుగౌడ్ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధికి కృషి చేస్తున్నారు. ప్రభుత్వ నిధులతోపాటు సొంతంగా గ్రామంలో స్వచ్ఛంద కార్యక్రమాలు చేపడుతూ అందరి మన్ననలు పొందుతున్నారు. గ్రామంలో 1352 జనాభా ఉంది.
చేపట్టిన అభివృద్ధి పనులు..
2019-21 ఏడాదికిగాను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పంచాయతీకి రూ.3.65 కోట్ల నిధులు మంజురయ్యాయి. గ్రామసభ తీర్మానాల ప్రకారం రూ.9 లక్షలతో ట్రాక్టర్ కొన్నారు. 30 రోజుల ప్రణాళికలో భాగంగా రూ.2.70 లక్షలతో పాత బావుల పూడ్చివేత, రూ.15 లక్షలతో సీసీరోడ్లు, రూ.3.5 లక్షలతో అంతర్గత మురుగు కాల్వల నిర్మాణం, రూ.2 లక్షలతో ప్రకృతి వనం, రూ.7.5 లక్షలతో వైకుంఠధామం, రూ.35 లక్షలతో మిషన్ భగీరథ ట్యాంకు నిర్మించారు. ప్రస్తుతం అంతర్గత మురుగు కాల్వల నిర్మాణం కొనసాగుతున్నది. ఇంటింటికీ మిషన్ భగీరథతో తాగునీటి సరఫరా, అంతర్గత మురు గు కాల్వల నిర్మాణాలు, కాలనీలో సీసీ రోడ్లు, వివిధ రకాల మొక్కలతో ప్రకృతి వనం, వైకుంఠధామం, డం పిగ్ యార్డు, గ్రామాన్ని కలుపుతూ వెళ్లే బీటీ రోడ్డు నిర్మాణం తదితర పనులపై గ్రామాభివృద్ధిపై ప్రతీ నెలా ప్రత్యేక గ్రామ సభ నిర్వహిస్తున్నారు.
ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దుతా
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుని సుద్దపల్లిని ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దుతాం. పల్లెప్రగతితో మా ఊరు మారింది. గ్రామస్తుల సహకారం మరువలేనిది. వారి సూచనల మేరకు పంచాయతీలో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నా. అధికారుల సూచనల ప్రకారం రానున్న రోజుల్లో గ్రామాన్ని మరింతగా అభివృద్ధి చేస్తా. గ్రామ సమీపంలో ఉన్న వాగుపై బ్రిడ్జి నిర్మాణం కోసం ప్రభుత్వం నిధులు విడుదల చేయాలి. సమస్యపై కలెక్టర్, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలకు వినతి పత్రాలను అందజేశా.
సక్రమంగా నిధులు ఖర్చుచేస్తున్నా..
పంచాయతీ పాలకమండలి సూచనల మేరకు అభివృద్ధి పనులకు నిధులు సక్రమంగా వినియోగిస్తు న్నా. గ్రామంలో ప్రజలకు ఇబ్బందులు లేకుండా మౌలిక వసతుల కల్పనపై దృష్టిపెట్టాను. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అర్హులందరికీ దరిచేరేలా చర్యలు తీసుకుంటున్నా. – రవికుమార్రెడ్డి, పంచాయతీ కార్యదర్శి, సుద్దపల్లి