రోడ్డు ప్రయాణం ఆహ్లాదమయం చేసే దిశగా రాష్ట్ర సర్కార్ అడుగులు వేస్తున్నది. రహదారులకు ఇరువైపులా పెద్ద ఎత్తున మొక్కలు నాటించి సంరక్షణ చర్యలు చేపడుతున్నది. ఇందులో భాగంగా వికారాబాద్ జిల్లా పరిధిలో 254 కిలోమీటర్ల (జాతీయ, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్) రోడ్ల పక్కన మొక్కలు నాటే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇరువైపులా రెండు వరుసల్లో మొత్తం 1,26,290 మొక్కలు నాటడమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటున్నది. కలెక్టర్ నిఖిల ఆదేశాల మేరకు 15 రోజుల్లో లక్ష్యాన్ని పూర్తి చేసే దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించే బాధ్యత గ్రామ పంచాయతీలకు అప్పగించారు.
పరిగి, సెప్టెంబర్ 16 : రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచేందుకు అమలు చేస్తున్న హరితహారం కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తున్నది. సీఎం కేసీఆర్ మానసపుత్రిక హరితహారం ద్వారా వందల కోట్ల మొక్కలు నాటడంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4 శాతం పచ్చదనం పెరిగిందని ఇటీవల ఓ అధ్యయనంలో తేలింది. అన్ని రోడ్లకు ఇరువైపులా పెద్దఎత్తున మొక్కలు నాటడంతోపాటు సంరక్షణ ద్వారా రోడ్లు పచ్చందాలతో
నిండిపోయేలా చూడాలన్నది సర్కారు సంకల్పం.
ఇందులో భాగంగా వికారాబాద్ జిల్లా పరిధిలోని 18 మండలాల్లో గల రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమం కొనసాగుతున్నది. జిల్లావ్యాప్తంగా 254 కిలోమీటర్ల రోడ్లకు ఇరువైపులా రెండు నుంచి మూడు వరుసల్లో 1,26,290 మొక్కలు నాటుతారు. జాతీయ రహదారులు 65 కిలోమీటర్లలో 31,393 మొక్కలు, ఆర్అండ్బీ రహదారుల్లో 146 కిలోమీటర్లు 77,930 మొక్కలు, పంచాయతీరాజ్ రహదారుల్లో 43 కిలోమీటర్లు 16,967 మొక్కలు నాటుతారు. దీంతో రెండు మూడు సంవత్సరాల్లో రోడ్లన్నీ పచ్చదనంతో నిండిపోనున్నాయి. నాటిన ప్రతి మొక్క సంరక్షించబడేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. రోడ్లు గల ప్రాంతంలోని మొక్కల సంరక్షణ బాధ్యతను ఆయా గ్రామపంచాయతీలకే అప్పగించనుండడంతో నాటిన మొక్కలన్నీ బతికించాలనే సత్సంకల్పం నెరవేరనుంది.
గ్రామపంచాయతీలకు సంరక్షణ బాధ్యత
మల్టీ లేయర్ ఎవెన్యూ ప్లాంటేషన్లో భాగంగా ఎంపిక చేసిన రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఒక వరుసలో చిన్న, పూల మొక్కలు, రెండో వరుసలో మద్ది, కదంబ తదితర పెద్ద మొక్కలు నాటుతున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రోడ్ల పక్కన మొక్కలు నాటేందుకు గుంతలు తవ్వుతున్నారు. అధికంగా స్థలం ఉంటే మూడు వరుసల్లో కూడా నాటుతున్నారు. మొక్కలను మేకలు మేయకుండా ఎత్తుగా ఉండే పెద్ద మొక్కలు నాటుతున్నారు. జిల్లాలోని అటవీ శాఖ వారి నర్సరీల్లో ఉన్న పెద్ద మొక్కలు ఈ కార్యక్రమంలో ఉపయోగిస్తున్నారు. సరిపోకపోతే ఆయా గ్రామపంచాయతీలకు సంబంధించిన గ్రీన్ బడ్జెట్లో నుంచి నిధులు వెచ్చించి పెద్ద మొక్కలు తెప్పిస్తారు. మొక్కల సంరక్షణ బాధ్యత ఆయా గ్రామపంచాయతీలకే అప్పగించారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించడానికి అవసరమైన అన్ని చర్యలను సర్కారు తీసుకుంటున్నది. మొక్కలకు ఆయా గ్రామపంచాయతీల్లో ఉన్న ట్యాంకర్ల ద్వారా నీటిని పోస్తారు. ఈ సంవత్సరం నిర్దేశించిన లక్ష్యం మేరకు 15 రోజుల్లో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. దీంతో జిల్లావ్యాప్తంగా ఈ పనులు మరింత వేగంగా కొనసాగుతున్నాయి.
కొనసాగుతున్న మల్టీ లేయర్ ఎవెన్యూ ప్లాంటేషన్
వికారాబాద్ జిల్లా పరిధిలో ఈసారి 254 కిలోమీటర్ల రోడ్లకు ఇరువైపులా మల్టీ లేయర్ ఎవెన్యూ ప్లాంటేషన్ కొనసాగుతున్నది. ఈ మేరకు జిల్లావ్యాప్తంగా ఈ కార్యక్రమంలో 1,26,290 మొక్కలు నాటుతారు. జాతీయ రహదారులు, ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ రోడ్లకు ఇరువైపులా కనీసం రెండు వరుసల్లో మొక్కలు నాటుతున్నారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. ఈ కార్యక్రమం 15 రోజుల్లో పూర్తయ్యేలా పనులు కొనసాగుతున్నాయి. రోడ్ల పక్కన పెద్దమొక్కలు నాటేలా చూస్తున్నాం.