తాండూరు రూరల్, అక్టోబర్ 13 : 500 జనాభా ఉన్న గ్రామాలను పంచాయతీలుగా మారుస్తామని ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు చిట్టిఘనాపూర్ను నూతన పంచాయతీగా ఏర్పాటు చేసింది. పంచాయతీ ఏర్పాటైన తర్వాత సర్పంచ్గా మంజురాణిగౌడ్ బాధ్యతలు చేపట్టారు. జనాభా 1100 ఉంటుంది. గ్రామం చిన్నదైనా.. అభివృద్ధి వేగంగా జరుగుతున్నది. పనులు ఉత్సాహంగా చేపడుతున్నారు. దశాబ్దాలపాటు కాని అభివృద్ధి రెండేండ్లలో జరిగింది. ప్రతి ఇంటికి నల్లా కనెక్షన్ ఇచ్చి మంచినీటి దాహార్తిని తీర్చారు. విచిత్రమేమిటంటే పక్కనే కాగ్నా వాగు ఉన్నా గత ప్రభుత్వాలు తాగునీటి గురించి పట్టించుకోలేదు. ఐసీఎల్, సీసీఐ సిమెంట్ ఫ్యాక్టరీలకు మాత్రం నీరు అందేది. మిషన్ భగీరథతో నేడు ఇంటింటికీ తాగునీరు సరఫరా, 24 గంటలు కరెంట్ సరఫరా అవుతున్నది. వార్డుల్లో పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించి ట్రాక్టర్తో తడి, పొడి చెత్తను ఎప్పటికప్పుడు సేకరిస్తున్నారు. హరితహారంలో భాగంగా కరణ్కోట ఆర్అండ్బీ రోడ్డు నుంచి చిట్టిఘనాపూర్ వరకు రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటి, వాటి సంరక్షణకు కంచె ఏర్పాటు చేయడంతో పాటు ట్రాక్టర్ ద్వారా నీరు పోస్తున్నారు. నర్సరీలో పండ్లు, పూలు, నీడనిచ్చే చెట్లతోపాటు పలు రకాల మొక్కలను పెంచుతున్నారు. చెరువులో పూడికతీత పనులు చేపట్టారు. రూ.20 లక్షలతో పంచాయతీ భవనం పూర్తి గ్రామాభివృద్ధిలో భాగంగా రూ.20 లక్షలతో నూతన పంచాయతీ భవన నిర్మాణాన్ని కూడా పూర్తి చేశారు. డంపింగ్యార్డు, శ్మశానవాటిక పనులను చేపట్టారు. ఇవేగాకుండా బస్షెల్టర్ నిర్మించారు. డీఎంఎఫ్ నిధులతో మురుగు కాలువల నిర్మాణాలు చేపట్టనున్నారు.
ఐదు ఎకరాల్లో బృహత్ పల్లె ప్రకృతి వనం
మంజురాణిగౌడ్, సర్పంచ్
గ్రామంలో బృహత్ పల్లె ప్రకృతి వనాన్ని నిర్మించేందుకు కృషి చేస్తున్నాం. స్థల సేకరణ పూర్తయింది. గ్రామంలో పచ్చదనం, పరిశుభ్రతలో భాగంగా ఇంటింటికీ చెత్త బుట్టలను పంపిణీ చేశాం. ప్రభుత్వం ఏ కార్యక్రమం తీసుకున్నా చేస్తున్నాం. భవిష్యత్తులో సీసీ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణాలు చేపడుతాం. మరిన్ని అభివృద్ధి పనులు చేస్తాం. సంక్షేమ పథకాలు పేదలకు అందేలా చూస్తున్నాం. స్థానికుల సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి వైపు తీసుకెళుతున్నాం.