రంగారెడ్డి జిల్లాలో ప్రైవేటు హాస్పిటళ్లలో నో స్టాక్
వికారాబాద్ జిల్లాలో ప్రభుత్వ దవాఖానల్లోనూ అరకొరగా..
కేంద్రాల ఎదుట భారీ క్యూలు
రంగారెడ్డి, ఏప్రిల్ 12, (నమస్తే తెలంగాణ) : కరోనా వైరస్ విజృంభిస్తుండడంతో రోజురోజుకు వ్యాక్సిన్కు డిమాండ్ పెరుగుతున్నది. మొన్నటి వరకు టీకా వేసుకునేందుకు భయపడిన జనం ప్రస్తుతం దవాఖానలకు పరుగులు పెడుతున్నారు. దీంతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా వ్యాక్సిన్ల కొరత ఏర్పడింది. రంగారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో సరిపడా టీకాలు ఉన్నా.. ప్రైవేటు హాస్పిటళ్లలో నిల్వలు లేవు. ఇక వికారాబాద్ జిల్లాలో ప్రభుత్వాసుపత్రుల్లోనూ టీకాలు సరిపడా అందుబాటులో లేవు. మరోవైపు ఒక్కో ప్రభుత్వ దవాఖానలో రోజుకు 100 మందికి టీకా వేస్తున్నారు. ప్రజలతో టీకా కేంద్రాలు కిటకిటలాడాయి. కొన్ని కేంద్రాల్లో గంటల తరబడి బారులు దీరారు.
వ్యాక్సిన్పై అవగాహనతో అపోహలు తొలగిపోవడంతో టీకా వేసుకునేందుకు జనం పెద్ద ఎత్తున దవాఖానలకు వస్తున్నారు. దీంతో జిల్లాలోని ప్రైవేట్ దవాఖానల్లో వ్యాక్సిన్ నిల్వలు అయిపోవడంతో ‘నో వ్యాక్సిన్’ బోర్డులు పెట్టారు. ఇక ప్రభుత్వ దవాఖానల్లో మాత్రం ఒక్కొ ఆస్పత్రిలో రోజుకు వందమందికి చొప్పున వ్యాక్సిన్ వేస్తుండగా.. సరిపడా జిల్లాలో అందుబాటులో ఉన్నా యి. టీకాల కొరతపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ప్రైవేట్లో వ్యాక్సిన్లు లేక అందరూ ప్రభుత్వ దవాఖానల వైపు పరుగులు పెడుతుండడంతో తాకిడి పెరిగింది.
రోజుకు 5 వేలకుపైనే…
వారం రోజులుగా ప్రభుత్వ హాస్పిటల్స్లో వ్యాక్సినేషన్కు బాగా డిమాండ్ పెరిగింది. ఇదివరకు టీకా అంటే భయపడినవారంతా కరోనా కేసులు పెరుగుతుండడంతో ఒక్కసారిగా వ్యాక్సిన్ వేసుకునేందుకు ముందుకువస్తున్నారు. మొదట్లో కేవలం 40 శాతం మాత్రమే ఫ్రంట్లైన్ వారియర్స్ వ్యాక్సిన్ వేయించుకోగా.. ప్రభుత్వ ఆదేశాలతో ప్రస్తుతం వ్యాక్సిన్ వేయించుకోని పోలీసులు, వైద్యసిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులంతా దవాఖానల్లో క్యూ కడుతున్నారు. అంతేకాకుండా నిత్యం జనాల్లో ఉండే గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగులు, సిబ్బంది, సర్పంచ్లు, జడ్పీటీసీలు అందరూ టీకా వేయించుకుంటున్నారు. రెవెన్యూ శాఖ, పంచాయతీశాఖకు సంబంధించి క్షేత్రస్థాయి ఉద్యోగులు, సిబ్బందికి కూడా సోమవారం నుంచి జిల్లాలో టీకా వేస్తున్నారు. వీరితోపాటు 45 ఏండ్లు పైబడినవారికి టీకా పంపిణీ జరుగుతుండడతో ప్రభుత్వ దవాఖానల్లో రద్దీ పెరిగింది. జిల్లాలో 40 కేంద్రాల్లో ఆదివారం, సోమవారం సుమారు 5300 మందికి వ్యాక్సినేషన్ పూర్తి చేశారు. ఒక్కో ప్రభుత్వాసుపత్రిలో వందమంది చొప్పున వ్యాక్సిన్ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించగా.. తీసుకునేవారి సంఖ్య పెరగడంతో లక్ష్యానికి మించి ఇస్తున్నారు. ప్రభుత్వ వైద్య సిబ్బంది ఓవైపు వ్యాక్సిన్ వేస్తూనే, మరోవైపు కరోనా పరీక్షలు నిర్విరామంగా చేస్తున్నారు.
పెరుగుతున్న పాజిటివ్ కేసులు..
జిల్లాలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు నియంత్రణ చర్యలు చేపట్టారు. వారం రోజులుగా జిల్లాలో 200పైగా కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. లక్షణాలున్న ప్రతి ఒక్కరికీ పరీక్షలు చేస్తున్నారు. అంతేకాకుండా పాజిటివ్ వచ్చినవారి కాంటాక్ట్స్ను గుర్తించి పరీక్షలు చేయడంపై ప్రత్యేక దృష్టిపెట్టారు. 45 ఏండ్లు పైబడిన వారి వివరాలను సేకరిస్తుండడంతోపాటు వ్యాక్సిన్ వేసుకోవాలని సూచిస్తున్నారు. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 38 వేల మంది వివరాలను సేకరించారు. జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 1.95 లక్షల మందికి వ్యాక్సినేషన్ పూర్తయ్యింది.
ఇవి కూడా చదవండి
ఉగాది పచ్చడి తింటే లాభమేంటి?
రోజూ తినే ఆహారంలో ఇవి ఉంటే ఆరోగ్యం మీ వెంటే
IPL 2021:రాహుల్ అర్ధశతకం.. హుడా సిక్సర్ల వర్షం