పల్లె ప్రగతితో మోమిన్పేటకు మహర్దశ
కోటి రూపాయలతో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం
పూర్తయిన వైకుంఠధామం,కంపోస్టుషెడ్డు పనులు
అన్ని హంగులతో రైతువేదిక..
పచ్చదనంతో కళకళలాడుతున్న ప్రకృతి వనం
మోమిన్పేట, ఏప్రిల్ 12 :ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో మోమిన్పేట గ్రామం అభివృద్ధివైపు పరుగులు పెడుతున్నది. సకల సౌకర్యాల కల్పనతో సమస్యలు పరిష్కారమయ్యాయి. వానకాలంలో బురదగా మారే వీధులు.. నేడు సీసీరోడ్లతో అద్దంలా మెరుస్తున్నాయి. నిత్యం పారిశుధ్య నిర్వహణతో గ్రామం పరిశుభ్రంగా మారిం ది. డ్రైనేజీలతో రోడ్లపై మురుగు పరుగుకు అడ్డుకట్ట పడింది. హరితహారం మొక్కలు ప్రజలకు ఆహ్లాదం పంచుతున్నాయి.
మారిన రూపురేఖలు..
గ్రామంలో 2,379 ఇండ్లు ఉండగా.. 7,108 జనాభా ఉన్నది. పల్లె ప్రగతిలో భాగంగా రూ.1.5కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, రైతువేదిక, వైకుంఠధామం, డంపింగ్యార్డు, ప్రకృతి వనం వంటి మౌలిక వసతులు కల్పించారు. అంతేకాకుండా మొక్కల పెంపకం, పాడుబడ్డ ఇండ్ల కూల్చివేత, బావులు పూడ్చివేత వంటి పనులు చేపట్టారు. గ్రామ పంచాయతీకి ట్రాక్టర్తో ప్రతి రోజు ఇంటింటికీ తిరిగి చెత్త సేకరించి డంపింగ్యార్డుకు తరలిస్తున్నారు. విద్యుత్ సమస్యలను పరిష్కరించారు.
ప్రకృతి వనంతో ఆహ్లాదం..
గ్రామానికి దగ్గరలోనే వికారాబాద్ సదాశివపేట వేళ్లే మార్గంలో ఎకరం స్థలంలో ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేశారు. పండ్లు, పూలు, నీడనిచ్చే మొక్కలు నాటడంతో అవి ఏపుగా పెరిగి ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తున్నాయి.
రైతువేదిక..
రూ.25 లక్షలతో రైతువేదిక నిర్మించారు. ఒకేసారి 200 మంది కూర్చొనే విధంగా విశాలమైన సమావేశ మందిరం, వ్యవసాయ అధికారులకు ప్రత్యేక గదులతోపాటు మరుగుదొడ్లు తదితర వసతులు కల్పించారు. ప్రస్తుతం అందుబాటులోకి రావడంతో సమావేశాలు నిర్వహించేందుకు అన్నదాతలకు కష్టాలు తప్పాయి.
గ్రామాభివృద్ధే ధ్యేయం..
గ్రామాభివృద్ధే ధ్యేయంగా ముందుకెళ్తున్నాం. పల్లెప్రగతితో చాలావరకు సమస్యలు తీరాయి. ప్రతిరోజు పారిశుధ్య పనులు చేపడుతున్నాం. మిషన్ భగీరథతో తాగునీటి సమస్య తీరింది. స్థానికుల సహకారంతో గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుకుంటున్నాం.
–అంగెరి శ్రీనివాస్రెడ్డి, సర్పంచ్
రెండేండ్లలో రూ.1.5 కోట్లు..
రెండేడ్లలో సుమారు.రూ.1.5 కోట్లతో గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టాం. రూ.కోటితో సీసీ రోడ్లు, డ్రైనేజీ, రూ.25 లక్షలతో రైతువేదిక, రూ.12.5 లక్షలతో వైకుంఠధామం, రూ.2.5 లక్షలతో కంపోస్టు షెడ్డు, రూ.50 వేలతో డంపింగ్యార్డు, లక్ష రూపాయలతో పల్లె ప్రకృతి వనం ఏర్పాటు చేశాం. -నర్సింహులు, పంచాయతీ కార్యదర్శి
ఇవి కూడా చదవండి
అభివృద్ధి కి 35 ఏండ్లు చాలదా : జానారెడ్డికి మంత్రి జగదీశ్ రెడ్డి సూటి ప్రశ్న
జాతీయ రహదారికి నెంబర్ కేటాయింపు.. మంత్రి హర్షం