గ్రామాల్లో ర్యాలీలు, గ్రామ సభలు.. పలు అభివృద్ధి పనులు ప్రారంభం
వికారాబాద్, కొడంగల్ నియోజకవర్గాలో ఈ నెల 1 నుంచి నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమాలు శనివారంతో ముగిశాయి. పల్లెల్లో ర్యాలీలు, గ్రామ సభలు నిర్వహించారు. వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు. పరిసరాలు, మురుగునీటి కాల్వలను శుభ్రం చేశారు. ఇంటింటికీ మొక్కలను అందజేశారు. ట్రీ గార్డులు ఏర్పాటు చేశారు. మొక్కలు నాటి నీళ్లు పోశారు. శ్రమ దానాలు చేశారు. చెత్త, మరుగుదొడ్ల వాడకంపై అవగాహన కల్పించారు. రైతు వేదికలు, ప్రకృతివనాలను ప్రారంభించారు. చేయాల్సిన పనులపై సూచనలిచ్చారు. సంక్షేమ పథకాలపై ఆరా తీశారు. పలు గ్రామాల్లో పారిశుధ్య కార్మికులను సన్మానించారు. వారి సేవలు మరువలేనివని కొనియాడారు. కార్యక్రమాల్లో ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ర్టాన్ని ఆకుపచ్చ తెలంగాణగా మార్చడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని పేర్కొన్నారు. ఇంటింటికీ, రోడ్ల వెంట, ప్రకృతి వనాల్లో మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. మొక్కలు నాటే కార్యక్రమాలను భారంగా కాకుండా బాధ్యతగా తీసుకోవాలన్నారు. పలు అభివృద్ధి పనులు జరిగాయన్నారు. ఇంకా చేపట్టాల్సిన పనులకు ప్రజల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు.