పరిగి, అక్టోబర్ 9 : ఆలుగడ్డ సాగుకు వికారాబాద్ జిల్లా అనుకూలమైందని ఉద్యాన వన శాఖ రాష్ట్ర డైరెక్టర్ ఎల్.వెంకట్రాంరెడ్డి తెలిపారు. మద్గుల్ చిట్టెంపల్లిలోని డీపీఆర్సీలో శనివారం నూతన పద్ధతుల్లో ఆలుగడ్డ సాగుపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉద్యానవన శాఖ డైరెక్టర్ వెంకట్రాంరెడ్డి హాజరై మాట్లాడారు. వికారాబాద్ జిల్లా పరిధిలో 50వేల ఎకరాల్లో ఆలుగడ్డ సాగుకు అనుకూలంగా ఉందని శాస్త్రవేత్తలు సైతం గుర్తించినట్లు తెలిపారు. జిల్లాలో విత్తన ఆలుగడ్డతోపాటు ఆలుగడ్డ సాగు చేపట్టవచ్చన్నారు. దీనికి సంబంధించి రైతులు 50శాతం సబ్సిడీపై విత్తనాలు అందజేయాలని కోరుతున్నారని అన్నారు. రైతులు ఒక సంఘంగా ఏర్పడి కోల్డ్ స్టోరేజీలు సైతం ఏర్పాటు చేసుకోవచ్చని తెలిపారు. ఆలుగడ్డను 125 దేశాల్లో తింటారని చెప్పారు. ఆలుగడ్డను తినడానికి ఉపయోగించడంతోపాటు వివిధ రకాల పరిశ్రమల్లో, పౌల్ట్రీ ఫీడ్లో సైతం ఉపయోగిస్తారని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా 5.50కోట్ల ఎకరాల్లో ఆలుగడ్డ సాగు చేస్తున్నట్లు తెలిపారు. దేశంలో 55లక్షల ఎకరాల్లో ఆలుగడ్డ సాగవుతుందన్నారు. ఉత్తర భారతదేశంలో ఒక వ్యక్తి సంవత్సరానికి సగటున 20 కిలోల ఆలుగడ్డలు తింటారన్నారు. తెలంగాణలో 5వేల ఎకరాల్లో ఆలుగడ్డ సాగు అవుతుందని, సంగారెడ్డి జిల్లాలో 3,500 ఎకరాలు, వికారాబాద్లో వెయ్యి ఎకరాలు, సిద్దిపేట్లో 500 ఎకరాల్లో సాగవుతుందని చెప్పారు. రూ.300కోట్లు విలువ చేసే 1.50లక్షల మెట్రిక్ టన్నుల ఆలుగడ్డ ఉత్తరప్రదేశ్, బిహార్, ఇతర రాష్ర్టాల నుంచి తెలంగాణకు దిగుమతి చేసుకుంటున్నట్లు పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లాలో రెండు కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉందన్నారు. ఒకటి విత్తనం, మరోటి ఆలుగడ్డ పంటకు సంబంధించి ఏర్పాటు చేస్తే మంచి ధర ఉన్నప్పుడు రైతులు విక్రయించుకునేందుకు అవకాశం కలుగుతుందన్నారు. ఇందుకుగాను రూ.20కోట్లు ఖర్చవుతాయని ఆయన చెప్పారు. 10 నుంచి 12 డిగ్రీల ఉష్ణోగ్రత, 90 నుంచి 95శాతం తేమలో ఆలుగడ్డను 8 నుంచి 10 నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చని డైరెక్టర్ తెలిపారు. వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ మాట్లాడుతూ ఉద్యానవన పంటల సాగుకు సహకారం అందించేందుకు సిద్ధంగా ఉంటానని చెప్పారు. కూరగాయల నారు సరఫరాకు ప్రభుత్వ నర్సరీని ఏర్పాటు చేసే అంశంపై సానుకూలంగా స్పందించాలని డైరెక్టర్కు సూచించారు. సబ్సిడీపై స్ప్రింక్లర్లు, డ్రిప్లు అందజేయాలని రైతులు కోరినందున ఈ అంశాన్ని పరిశీలించాలన్నారు. నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై పీడీ చట్టం పెడుతామని ఎమ్మెల్యే హెచ్చరించారు. కలెక్టర్ నిఖిల మాట్లాడుతూ ఆలుగడ్డ సాగును మరింత ప్రోత్సహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఎకరాకు 50వేల వరకు ఖర్చు రాగా, లక్షకు పైగా ఆదాయం వస్తుందన్నారు.
హిమాచల్ప్రదేశ్లోని సిమ్లా సెంట్రల్ పొటాటో రీసర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ ఎన్.కె.పాండే మాట్లాడుతూ అధిక దిగుబడులు ఇచ్చే, చీడపీడలను తట్టుకునే ఆలుగడ్డ రకాలను సాగు చేయాలన్నారు. ప్రిన్సిపల్ సైంటిస్ట్ వినయ్సాగర్, డాక్టర్ సంజయ్ రావల్, డాక్టర్ దేవేందర్కుమార్, డాక్టర్ ఈ.పి.వెంకటాచలం ఆలుగడ్డ సాగులో అధునాతన పద్ధతులపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ విజయకుమార్, స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ రాజ్కుమార్, శాస్త్రవేత్తలు అనిత, హరికాంత్, సురేష్, డిప్యూటీ డైరెక్టర్లు బాబు, వేణుగోపాల్, విజయప్రసాద్, అసిస్టెంట్ డైరెక్టర్లు కిషన్రావు, యాదగిరి, జిల్లా ఉద్యానవన అధికారి చక్రపాణి, అధికారులు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.