బన్సీలాల్పేట్ :కేంద్ర పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి జీ.కిషన్రెడ్డి సోమవారం గాంధీ దవాఖానను సందదర్శించారు. పలు వార్డులలోకి వెళ్ళి రోగులను పలకరించారు. సూపరింటెండెంట్ డాక్టర్ ఎం.రాజారావుతో కలిసి ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ల పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన నుదుటిపై అయిన గాయానికి గాంధీ డెర్మటాలజీ విభాగం హెచ్ఓడి డాక్టర్ జీ.నర్సింహారావు చికిత్స చేశారు. ఆనంతరం మీడియాతో మాట్లాడిన కిషన్రెడ్డి కరోనా మహమ్మారి రెండు దశలలోనూ అనేక ఇబ్బందులను ఎదుర్కొని గాంధీ వైద్యులు, సిబ్బంది అందించిన సేవలు అభినందనీయమని అన్నారు.
ఇప్పటివరకు 58 కోట్ల మందికి వ్యాక్సిన్ వేయడం జరిగిందన్నారు. అందరికీ ఉచితంగా టీకాలను అందిస్తామని, ప్రతి ఒక్కరూ విధిగా మాస్క్లు ధరించాలని కోరారు. తాను ఇప్పటికే తొమ్మిది సార్లు గాంధీ దవాఖానను సందర్శించాన న్నారు. ఆక్సిజన్ కొరత నివారించేందుకు పీఎం కేర్ నిధుల ద్వారా ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లను ఏర్పాటు చేశామని అన్నారు. కేంద్ర ప్రభుత్వ దేశవ్యాప్తంగా కరోనా నియంత్రణ కోసం చేపట్టిన కార్యక్రమాలను వివరించారు.
అనాథలకు ఆధార్ కార్డులివ్వాలని కోరిన స్కై ఫౌండేషన్
రోడ్ల పక్కన ఉండే అనాథలు, నిరాశ్రయులకు, దిక్కులేనివారికి కూడా ఆధార్ గుర్తింపు కార్డులివ్వాలని పద్మారావునగర్కు చెందిన స్కై ఫౌండేషన్ అధ్యక్షుడు డాక్టర్ వై.సంజీవ్ కుమార్, సోమవారం కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జీ.కిషన్రెడ్డిని కలిసి కోరారు. ఈ మేరకు ఆయనకు వినతిపత్రం అందజేశారు. దేశపౌరులైన ప్పటికి వారి వద్ద ఎలాంటి ప్రభుత్వ గుర్తింపు కార్డులు లేకపోవడం వలన సంక్షేమ పథకాలు అందడం లేదని, కరోనా వ్యాక్సిన్ కూడా పొందలేకపోతున్నరని వారు అందులో పేర్కొన్నారు.