కొండాపూర్ : గత చరిత్రతో పాటు నాటి సంస్కృతి, సంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు అందజేసేలా ఆద్య కళా ప్రదర్శన ఆకట్టుకుంటుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పూర్వ సలహాదారు బీవీ పాపారావు అన్నారు. శుక్రవారం ఆయన మాదాపూర్లోని చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ, చిత్రమయి స్టేట్ ఆర్ట్ గ్యాలరీల సంయుక్త నిర్వహణలో కొనసాగుతున్న ఆద్య కళా ప్రదర్శనను సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆద్య కళా ప్రదర్శనలో ఆది వాసీలు, గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలతో పాటు సంగీత వాయిద్యాలు, వారి చరిత్రకు నిలువుటద్దంలా అనేక పరికరాలు, వస్తువులు, దేవతా మూర్తుల విగ్రహాలు ఆకట్టుకుంటున్నాయన్నారు. భవిష్యత్తు తరాలకు పూర్వ వైభవాలను తెలియజేసేలా ఉన్నాయన్నారు.
ప్రదర్శనలో ఉంచిన వస్తువులను పదికాలల పాటు భద్రపరిచేందుకు ప్రత్యేక మ్యూజియం ఏర్పాటు చేయడం అవసరం అన్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్ డాక్టర్ కే లక్ష్మీ, ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు.