సూర్యాపేట, సెప్టెంబర్ 28 : సూర్యాపేట జిల్లాలో వరి సాధారణ సాగు విస్తీర్ణం 2లక్షల ఎకరాలు. ఈ వానకాలం రైతాంగం సాగు చేసింది 4.69ఎకరాలు. సీజన్ ప్రారంభంలో మంచి వానలు, కృష్ణా, గోదావరి పరవళ్లతో 2.69లక్షల ఎకరాలు అదనంగా సాగవడం విశేషం. గతేడాదితో పోల్చి చూసినా 69వేల ఎకరాలు ఎక్కువే. జిల్లా చరిత్రలో ఇదే రికార్డు. ఆ మేరకు పంట చేతికి వచ్చాక మార్కెట్లో రైతన్న మద్దతుగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం మొదటి పేజీ తరువాయి చేస్తున్నది. అక్టోబర్ రెండో వారం నుంచి వరి కోతలు మొదలుకానుండగా, కొనుగోళ్లకు అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. రైతుల కుటుంబ అవసరాలు, విత్తనాల వడ్లు, స్థానిక కోనుగోళ్లు పోనూ.. 5 లక్షల మెట్రిక్ టన్నులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వస్తుందన్న అంచనాతో 247 సెంట ర్ల ఏర్పాటుకు నిర్ణయించింది. అవసరాల మేరకు ఈ సంఖ్యను పెంచనున్నది.
పుష్కలంగా సాగునీరు..
కృష్ణా, గోదావరి, మూసీ జలాలకు తోడు జిల్లాలో ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురవడంతో సాగు విస్తీర్ణం భారీగా పెరిగింది. సూర్యాపేట జిల్లాలోని తుంగుతుర్తి, సూర్యాపేట, కోదాడ నియోజకవర్గాల్లో కాల్వల ద్వారా కాళేశ్వరం జలాలు, హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గంలో నాగార్జునసాగర్ ఎడమ కాల్వ ద్వారా కృష్ణా జలాలు, వీటికితోడు మూసీ నీరు కలువడంతో సూర్యాపేట జిల్లా రైతులు సాగు సంబురంలో ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా భారీగా సాగు విస్తీర్ణం పెరుగగా అందులో వరి రికార్డు స్థాయిలో పెరిగింది. వరి సాధారణంగా వానకాలంలో 2 లక్షల ఎకరాల్లో సాగవుతుండగా గతేడాది వానకాలం 4.01 లక్షల ఎకరాల్లో పండించారు. ఈ ఏడాది ఏకంగా 4.69 లక్షల ఎకరాలకు పెరిగింది. గతేడాది కంటే 69 వేల ఎకరాలు అధికం. సాధారణ సాగు కంటే 2.69 లక్షల ఎకరాలు ఎక్కువ. మరో 20 రోజుల్లో వరి కోతలు మొదలవుతుండడంతో జిల్లా అధికారులు ధాన్యం కొనుగోలుపై యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. వరి సాగు ఎంత వస్తుంది.. ఎన్నిక కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని లెక్కలు వేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 4.69 లక్షల ఎకరాల్లో వరి సాగు కాగా 11.22 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనాకు వచ్చారు. జిల్లాలో ఎక్కువగా సన్న రకాలు సాగు చేయడంతో వాటిని రైతులు కుటుంబ అవసరాలు, మిల్లులు, మార్కెట్కు అమ్మకాలు చేస్తుంటారు. మిగిలిన ధాన్యాన్ని ప్రభుత్వ కేంద్రాల్లో విక్రయించనున్నారు. ఈ ఏడాది 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని సర్కారు నిర్ణయించింది. వీటి కొనుగోలుకు 247 కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇందులో ఐకేపీ 122 కేంద్రాలు, పీఏసీఎస్ 125 కేంద్రాలు ఉన్నాయి. రైతుల అవసరాలకు అనుగుణంగా కొనుగోలు కేంద్రాలను పెంచనున్నారు. ధాన్యం కొనుగోలుకు 1.25 కోట్ల గన్నీ బ్యాగులు అవసరం ఉండగా ఇప్పటికి జిల్లాలో 35 లక్షల బ్యాగులు అందుబాటులో ఉన్నాయి. మిగిలినవి అసవరాలకు అనుగుణంగా తెప్పించనున్నారు.
రైతు చూపు కేంద్రాల వైపే..
రాష్ట్ర ప్రభుత్వం వరికి మద్దతు ధర కల్పించడంతోపాటు రైతుల వద్దనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుండడంతో రైతులు అక్కడే అమ్మడానికే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. గ్రేడ్-ఏ రకం ధాన్యానికి రూ.1,888, కామన్ రకం ధాన్యానికి రూ.1,868 మద్దతు ధర ఉంది. ఇక ఎలాంటి ఖర్చులు లేకుండా సొంత గ్రామంలోనే కొనుగోలు కేంద్రాలు ఉండడం, నగదు సైతం వెంటనే వస్తుండడంతో అక్కడే అమ్మకానికి సిద్ధమవుతున్నారు.
సిద్ధంగా ఉన్నాం
జిల్లా చరిత్రలో వరిసాగు ఈ స్థాయిలో పెరగడం ఇదే మొదటి సారి. రైతులు పండించిన ధాన్యం సేకరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే ప్రతిపాదనలు పంపించాం. 247 కేంద్రాల్లో సుమారు 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే కేంద్రాల ఏర్పాటు ప్రారంభిస్తాం.
-టి. వినయ్కృష్ణారెడ్డి, కలెక్టర్ సూర్యాపేట