సమైక్య పాలనలో ఎద్దేడ్చిన ఎవుసం.. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలతో తిరిగి జవసత్వాలను నింపుకొన్నది. వరి సాగు, దిగుబడిలో రాష్ట్రంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా నంబర్ వన్గా నిలుస్తున్నది. ఈ నేపథ్యంలో మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలు వేసి రైతులు మరింత ఆర్థికంగా నిలుదొక్కుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తున్నది. ప్రతి సీజన్లోనూ ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం కొర్రీలు పెడుతున్న క్రమంలో రైతాంగాన్ని ఉద్యాన పంటల సాగువైపు ప్రోత్సహించేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నది. ఆ మేరకు ఆయిల్ పామ్, ఉసిరి, జామ, మామిడి, నిమ్మ, బొప్పాయి, డ్రాగన్ ఫ్రూట్ వంటి పంటలకు మూడేండ్లపాటు 40 నుంచి 50 శాతం వరకు రాయితీలనూ ప్రకటించింది. నిర్దేశిత లక్ష్యంలో భాగంగా సూర్యాపేట జిల్లాలో 250 హెక్టార్లు, నల్లగొండ జిల్లాలో 986 హెక్టార్లలో ఉద్యాన పంటల సాగును సాకారం చేసే దిశగా ఉద్యానశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. పొలాల గట్లపైన ఉసిరి వంటి మొక్కలు నాటుకునే అవకాశం కల్పిస్తున్నారు
సూర్యాపేట, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ) : ఉద్యాన పంటలకు ప్రభుత్వం 40 నుంచి 50 శాతం సబ్సిడీ ఇస్తుండడంతో జిల్లాలో రకరకాల పూలు, పండ్లు, తోటల సాగు అవకాశాలపై ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ నడుం బిగించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు రైతులకు ఆదాయాన్ని పెంచడంతో పాటు పర్యావరణాన్ని రక్షించే పంటల సాగు దిశగా దృష్టి సారించింది. భూములతో పాటు పొలం గట్లు, సరిహద్దు ప్రాంతాల్లో మొక్కలు నాటేలా ఆవగాహన కల్పిస్తున్నారు. మూడేండ్ల పాటు రాయితీలను అందిస్తుండడంతో ఎక్కువ మందితో సాగు చేయించేలా అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారు. పంటలను బట్టి హెక్టారు ఒక్కంటికి 40 నుంచి 50 శాతం సబ్సిడీని ప్రభుత్వం ఇస్తుంది. దీంతో ఆయిల్పామ్, ఉసిరి, జామ, మామిడి, నిమ్మ, బొప్పాయి, డ్రాగన్ ఫ్రూట్ పంటల సాగు పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో 986 హెక్టార్ల లక్ష్యం…
ఉద్యాన పంటల సాగుకు ప్రభుత్వం లక్ష్యం విధించింది. ఆ మేరకు సూర్యాపేట జిల్లాలో 250, నల్లగొండ జిల్లాలో 736హెక్టార్ల చొప్పున మొత్తం 986 హెక్టార్లలో ఉద్యాన పంటల సాగుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే అర్హులు, ఆసక్తి కలిగిన రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తూనే మరో పక్క ఔత్సాహిక రైతులను గుర్తిస్తున్నారు.
డ్రాగన్ ఫ్రూట్కు 96వేల రాయితీ..
ఉద్యాన పంటల్లో అత్యధికంగా ఆయిల్పామ్ సాగుకు 90శాతం సబ్సిడీ లభిస్తుండగా డ్రాగన్ ఫ్రూట్ సాగుకు హెక్టారుకు రూ.96వేలు (50శాతం) సబ్సిడీ అందిస్తున్నది. ఉసిరి హెక్టారుకు15 వేలు, జామ 17,600, నిమ్మ 9,600, మామిడి 9,840, బొప్పాయి 22,500, కూరగాయలు హెక్టారుకు రూ.20,000 సబ్సిడీ రైతులకు లభిస్తుంది.
భారీ రాయితీ… మంచి లాభాలు..
ఉద్యాన రైతులకు రాయితీలతోపాటు పంట లాభాలు కూడా ఉంటున్నాయి. ఇప్పటికే జిల్లాలో ఆయిల్పామ్, డ్రాగన్ ఫ్రూట్, బొప్పాయి, కూరగాయలు సాగు చేసిన రైతులు అధిక ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీని వినియోగించుకొని ఉద్యాన పంటలు సాగుకు రైతులు సిద్ధం కావాలి.
శ్రీధర్, జిల్లా ఉద్యానవన అధికారి, సూర్యాపేట