గణేశ్ నిమజ్జనం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కోలాహలంగా సాగింది. నవరాత్రులు పూజలందుకున్న వినాయకుడికి ఆదివారం పూజలు చేసి సంస్కృతి, సంప్రయాదాలు ఉట్టిపడే విధంగా శోభాయాత్ర నిర్వహించారు. వాడవాడల నుంచి తరలిన గణనాథుల ఎదుట కోలాటాలు, డప్పులు, భజనలతోపాటు ఆటపాటలు, డీజేలతో పిల్లలు, యువత నృత్యాలు చేశారు. గ్రామాలు, పట్టణాల్లో దారిపొడవునా సాగిన శోభాయాత్రకు ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. భువనగిరిలో ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణారెడ్డి, ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి, ఆయా మండలాల్లో ప్రజాప్రతినిధులు పాల్గొని పూజలు చేశారు. ఉదయం నుంచి రాత్రి వరకు శోభాయాత్ర సాగగా జిల్లా అంతటా ఆధ్యాతిక శోభ ఉట్టిపడింది. గణనాథులను గంగమ్మ ఒడిలో వదిలి సెలవిక అంటూ వీడ్కోలు పలికారు. ప్రత్యేకంగా అలంకరించిన వాహనాలపై వినాయకుడి తీరొక్క విగ్రహాలు.. ఎదురుగా డీజే పాటలు, కోలాటాలు, డప్పుల దరువులు, రంగులు చల్లుకుంటూ యువత నృత్యాలు.. దిక్కులు మార్మోగేలా ‘గణేశ్ మహారాజ్కీ జై.. గణపతి బప్పా మోరియా’ నినాదాలు.. వెరసి గణేశ్ నిమజ్జన శోభాయాత్ర ఆదివారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ధూంధాంగా కదిలింది. మధ్యాహ్నానికే మొదలైన ఉత్సవం అన్ని వీధుల్లోనూ నయనానందకరంగా సాగింది. నవ రాత్రులు పూజలందుకున్న లంబోదరుడు.. అశేష భక్త జనం తరలిరాగా ‘ఇక వెళ్లొస్తా’నంటూ గంగమ్మ ఒడిచేరడంతో ప్రశాంతంగా ముగిసింది.