సాధారణంగా ఎవరికైనా అడ్రస్ చెప్పాలంటే సమీపంలోని ల్యాండ్ మార్కును గుర్తు చేస్తారు. ఎంతో చారిత్రక నేపథ్యం గల సూర్యాపేట పట్టణంలో అలాంటి ల్యాండ్ మార్క్లు శరవేగంగా మారిపోతున్నాయి. పాతవి కనుమరుగై కొత్తవి చోటు సంపాదించుకుంటున్నాయి. గతంలో పలు భవనాలు, దవాఖానలు, థియేటర్ల పేరిట ల్యాండ్ మార్క్లు ఉండేవి. కానీ, రాష్ట్ర ఆవిర్భావం అనంతరం సూర్యాపేట పట్టణం అన్ని రంగాల్లో, నలు దిక్కులా మార్పు చెందుతూ కొత్త ల్యాండ్ మార్కులకు బీజం వేసింది.జమ్మిగడ్డ మొదలుకుని హైటెక్ బస్టాండు మీదుగా జనగామ రోడ్డు దాకా.. ఎస్వీ కళాశాల నుంచి పాత బస్టాండ్, పూల సెంటర్, పీఎస్సార్ సెంటర్ మీదుగా తిరిగి జమ్మిగడ్డ వరకు.. నడుమ మార్కెట్ చౌరస్తా, వాణిజ్యభవన్ సెంటర్, నల్లాల బావి, 60ఫీట్ల రోడ్డు, కుడకుడ రోడ్డు.. ఇవన్నీ చారిత్రక సూర్యాపేట పట్టణంలో పేరెన్నికగన్న ప్రాంతాలు. దశాబ్దాల తరబడి ఎంతో పేరున్నా సమైక్య పాలనలో జరిగిన అభివృద్ధి అంతంతే. రాష్ట్ర ఆవిర్భావం, జిల్లా ఏర్పాటుతోనే పేట ముఖచిత్రం మారిపోయింది. ఏడేండ్లలో పట్టణం నలు మూలలా చేపట్టిన ప్రగతి పనులు కేరాఫ్ అడ్రస్లుగా అవతరించాయి. పాత వాటి స్థానంలో కొత్తవి ఎన్నో భానుపురి కీర్తి కిరీటంలో నిలుస్తున్నాయి.
సద్దుల చెరువు మినీటాంక్బండ్గా
సద్దుల చెరువు అనే పేరు వినగానే సూర్యాపేట గుర్తుకు వస్తుందనడంలో సందేహం లేదు. ఎంతో చారిత్రక నేపథ్యం కలిగిన ఈ చెరువుకు టీఆర్ఎస్ పాలనలో మహర్దశ పట్టింది. హైదరాబాద్లోని ట్యాంకు బండ్ను తలపించేలా రూ.17 కోట్లతో సద్దుల చెరువు కట్ట రూపురేఖలు మారిపోయాయి.
వాణిజ్య భవన్గా అమరావతి బార్ సెంటర్..
సూర్యాపేట పట్టణంలో అమరావతి బార్ సెంటర్, శంకర్ విలాస్ సెంటర్ ప్రముఖ ల్యాండ్ మార్కులే. ఆ ప్రాంతంలో వాణిజ్య భవన్ పేరిట ఓ భారీ భవంతి నిర్మించడంతో వాణిజ్యభవన్ సెంటర్గా పేరొచ్చింది.
తెలంగాణ తల్లి విగ్రహం
సూర్యాపేటలో విజేత హోటల్ ప్రముఖ ల్యాండ్ మార్క్. పట్టణ ప్రజలు కుటుంబ సమేతంగా హోటల్కు వెళ్లేవారు. దూర ప్రాంతాల వారు ఎవరైనా మంచి హోటల్ కావాలని అడిగితే కూడా అడ్రస్ ఇచ్చేవారు. అలా ఎంతో పేరొందిన విజేత హోటల్ ప్రాంతం కాస్తా నేడు తెలంగాణ తల్లి సెంటర్గా మారుమోగుతున్నది. రాష్ట్ర ఉద్యమ సమయంలో తెలంగాణ తల్లి రూపం ఆవిష్కృతమైన వెంటనే నాటి ఉద్యమ నాయకుడు, నేటి మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేయించారు. ఈ విగ్రహం వేదికగా నాడు తెలంగాణ ఉద్యమం జోరందుకున్నది.
పాత మార్కెట్.. నేడు మోడల్ మార్కెట్
పట్టణ నడిబొడ్డున వ్యవసాయ మార్కెట్ను రైతుల అవసరాలకు అనుగుణంగా శివారుకు మార్చారు. ఈ ప్రాంతంలో మోడల్ మార్కెట్ నిర్మిస్తున్నారు. మిర్చియార్డులో నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ లాండ్ మార్క్గా మారిపోయింది. మరోవైపు కొత్త బస్టాండ్, ఖమ్మం క్రాస్రోడ్డు అడ్రస్లు సైతం జాతీయరహదారి విస్తరణలో భాగంగా మారిపోతున్నాయి.
కర్నల్ చౌరస్తా…
దాదాపు 60ఏండ్లుగా ముద్ర పడిన కోర్టు చౌరస్తా నేడు కర్నల్ సంతోష్ బాబు చౌరస్తాగా మారిపోయింది. భారత్-చైనా సరిహద్దులో వీరమరణం పొందిన సంతోష్బాబు కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం కొండంత అండగా నిలువడం తెలిసిందే. కేంద్రం మహా వీర చక్ర అవార్డును ప్రదానం చేయగా.. ఆయన విగ్రహాన్ని కోర్టు చౌరస్తాలో ఏర్పాటు చేయించి కర్నల్
సంతోష్ బాబు చౌరస్తాగా నామకరణం చేశారు.
ఉద్యమ దివిటీ బీఎన్కు ఓ లాండ్ మార్క్…
తెలంగాణ సాయుధ పోరాటంలో ఎందరికో స్ఫూర్తి నిచ్చి, నాయకత్వ బాధ్యతలు చేపట్టిన బీఎన్ రెడ్డి విగ్రహాన్ని జాతీయ రహదారి పక్కనే ఏర్పాటు చేశారు. 60 ఫీట్ల రోడ్డుకు సమీపంలో ఉండడంతో ఆ ప్రాంతాన్ని బీఎన్ చౌరస్తాగా స్థానికులు పిలుచుకుంటున్నారు.
సాయినగర్గా కస్తూరి బజార్
పాతబస్టాండు సమీపంలో కోర్డు, జైలు భవనాల పక్కగా భీమారం వైపు వెళ్లే రోడ్డు లో కస్తూరి బజార్ ఉండేది. అక్కడ సాయిబాబా ఆలయం నిర్మించడంతో సాయి నగర్గా వాడుకలోకి వచ్చింది. కస్తూరి బజార్ అనే పేరు దాదాపు వినిపించడం లేదు.
కృష్ణాటాకీస్ రోడ్డు.. ఎస్పీ ఆఫీస్ రోడ్డుగా..
సుమారు 70ఏండ్ల కిందట నిర్మించిన కృష్ణాటాకీస్ సూర్యాపేట పట్టణంలో ఎంతో పేరుగాంచింది. 15ఏండ్ల కిందటి వరకూ సినిమాలు ప్రదర్శించిన ఈ కృష్ణా టాకీస్ ల్యాండ్ మార్క్గా సుపరిచితం. పాత భవననం నేటికీ దర్శనమిస్తున్నా నేడు ఎస్పీ ఆఫీస్ రోడ్డుగా పిలుస్తున్నారు. జిల్లా ఏర్పాటు అనంతరం థియేటర్కు ఎగువన పోలీస్ కార్యాలయం ఏర్పాటు చేయడంతో రోడ్డు పేరు మారిపోయింది.
నాడు తాళ్లగడ్డ.. నేడు మెడికల్ కళాశాల
జనరల్ దవాఖాన, ఎస్వీ డిగ్రీ కళాశాల ప్రాంతం ఎక్కువగా తాటిచెట్లు ఉండడంతో తాళ్లగడ్డగా వాడుకలో ఉండేది. కాల క్రమంలో ఎస్వీ డిగ్రీ కళాశాలగా పేరొందగా ప్రస్తుతం మెడికల్ కళాశాల నిర్మిస్తున్నారు. రూ.450 కోట్లతో భారీ ఎత్తున భవనాల నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడిప్పుడే మెడికల్ కళాశాలను ఓ ల్యాండ్ మార్క్గా చెప్పుకొంటున్నారు.