పాపను చంపడం నేరం
నాక్కూడా ఒక బిడ్డ ఉంది. చిన్న పాపను కిరాతకంగా చంపడం అన్యాయం.
చనిపోయిన పాపను అంతకుముందు నేను కూడా చాలాసార్లు చూశాను. వీధుల్లో ఆడుకుంటూ ఉండేది. రాజు ఇలా చేస్తాడని ఊహించ లేదు. మేం పేదవాళ్లం. ప్రభుత్వం మమ్మల్ని
ఆదుకోవాలి.
వాడు భూమ్మీద ఉన్నా లాభం లేదు
“వాడు భూమ్మీద ఉన్నా లాభం లేదు. నా బిడ్డ బతుకు ఆగం చేసిండు. రాఖీ పండక్కి మా ఇంటికొచ్చి, తాగి నా గొంతు పట్టి నేలకు కొట్టిండు. చచ్చేదాన్ని బతికిన. నా కొడుకులు కొడుతరేమోనని ఆ రాత్రే పరారైండు. చిన్నపిల్లను ఇట్ల చేస్తడనుకోలేదు. పోయినోడు పోయిండు. మేం బీదోళ్లం. నా బిడ్డకు న్యాయం చేయండి సారూ.”
రాజు అత్త, జలాల్పురం
ఆరేండ్ల చిన్నారిని అతిదారుణంగా కడతేర్చిన రాజు కథ ముగియడంపై జిల్లావ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. సైదాబాద్ లైంగిక దాడి ఘటనలో నిందితుడైన పల్లకొండ రాజుపై అన్ని వర్గాల ప్రజల నుంచి తీవ్ర నిరసనలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. అతడిని కఠినంగా శిక్షించాలని, ఉరి తీయాలని, ఎన్కౌంటర్ చేయాలని అనేక మంది డిమాండ్ చేశారు. కాగా, గురువారం తెల్లవారుజామున స్టేషన్ఘన్పూర్.. నష్కల్ రైల్వే ట్రాక్పై రాజు ఆత్మహత్య చేసుకున్నాడన్న వార్త దావానలంలా వ్యాపించింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చర్చ సాగింది. దేవుడే అతడికి సరైన శిక్ష వేశాడని అనేక మంది చర్చించుకోవడం వినిపించింది. చిన్నారి సొంతూరు నక్కలగండితండావాసులు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తంచేశారు. సోషల్ మీడియాలోనూ ఇలాంటి చర్చలు, పోస్టులే ఎక్కువగా కనిపించాయి.
సైదాబాద్ సింగరేణి లైంగికదాడి ఘటనలో మృతి చెందిన చిన్నారి ఆత్మకు శాంతి చేకూరాలని
నల్లగొండలో నివాళులర్పిస్తున్న పట్టణ ప్రజలు
అడ్డగూడూరు,సెప్టెంబర్ 16 : సైదాబాద్లో ఆరేండ్ల బాలికను అత్యాచారం చేసిన నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకొన్నాడు. వారం నుంచి తప్పించుకు తిరుగుతున్న రాజు గురువారం ఉదయం జనగాం జిల్లా స్టేషన్ఘన్పూర్ సమీపంలో నస్కల్ గ్రామం వద్ద కోణార్క్ ఎక్స్ప్రెస్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు వరంగల్ పోలీసులు ధ్రువీకరించారు. రాజు ఆత్మహత్య చేసుకున్నాడనే విషయాన్ని టీవీల్లో చూసి రాజు తల్లి వీరమ్మ, భార్య మౌనిక, అక్క అనిత కన్నీరు మున్నీరయ్యారు. ఈ సంఘటన జరిగిన సమయంలో తాము లేమని నిందితుడి భార్య మౌనిక తెలిపింది. తాను పుట్టింట్లో ఉన్నానని, తన అత్త పనికి వెళ్లిందని పేర్కొంది. మృతదేహాన్ని దహనం చేసేందుకు కూడా తమ దగ్గర డబ్బులు లేవని, ప్రభుత్వం ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. సైదాబాద్ పోలీసులు అడ్డగూడూరుకు చేరుకొని నిందితుడు రాజు కుటుంబ సభ్యులతో మాట్లాడి వరంగల్ ఎంజీఎం దవాఖానకు తరలించారు.
రాజు మరణంతో..
మునుగోడు/చందంపేట : రాజు మరణ వార్తతో గురువారం మునుగోడు మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో యువకులు పటాకులు కాల్చి సంబురాలు చేశారు. పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టడంతో నిందితుడు భయాందోళనతో ఆత్మహత్యకు పాల్పడినట్లు పలువురు అభిప్రాయపడ్డారు. చందంపేట మండలం నక్కలగండితండావాసులు మాట్లాడుతూ రాజుకు దేవుడు తగిన శిక్ష విధించాడని పేర్కొన్నారు. చిన్నారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.
చిన్నారికి నివాళి..
రామగిరి : బైండ్ల భవనీయ సంఘం ఆధ్వర్యంలో చిన్నారికి నివాళుల్పరించారు. గడియారం సెంటర్ వరకు కొవ్వొత్తులతో ప్రదర్శనగా వచ్చి అమరవీరుల స్థూపం వద్ద శ్రద్ధాంజలి ఘటించారు. దేశపాక అశోక్, జడ వీరబాబు, పరమేశం, కందుకూరి శ్రీకాంత్, చిన్నపాక సుధాకర్ పాల్గొన్నారు.
దేవుడు తగిన శిక్ష విధించాడు
హైదరాబాద్లోని సింగరేణి కాలనీ ఘటనలో నిందితుడు రాజుకు దేవుడు సరైన శిక్ష వేశాడు. అభం, శుభం తెలియని చిన్నారిని చిదిమేసిన మృగాడికి తగిన శాస్తి జరిగింది. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడం సంతోషంగా ఉంది. ఇలాంటి మానవ మృగం బతికి ఉన్నా సమాజానికి సిగ్గుచేటు. బాలిక కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి.
-అర్జున్సింగ్, సర్పంచ్, నక్కలగండితండా
పాపం పండింది
చిన్నారిపై లైంగికదాడి చేసి హత్యకు పాల్పడిన నిందితుడు రాజు పాపం పండింది. కూలి చేసుకునే కుటుంబానికి చెందిన బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడికి దేవుడు సరైన శిక్షే వేశాడు. ఇలాంటి మానవ మృగాలకు సమాజంలో చోటు ఉండకూడదు.
-కేతావత్ హేమూనాయక్, నక్కలగండి తండా