రామగిరి, సెప్టెంబర్ 15: జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. నల్లగొండకు చెందిన చల్లా విశ్వనాథ్ ఆలిండియా స్థాయిలో 26వ ర్యాంకు, నడిగూడేనికి చెందిన బుస్సా సాయి 36, నేరేడుచర్లకు చెందిన దొంతిరెడ్డి హన్వితారెడ్డి 116వ ర్యాంకులు సాధించారు.అధ్యాపకుల సూచనలు, తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఈ ర్యాంకులు వచ్చినట్లు విద్యార్థులు తెలిపారు.
రామగిరి, సెప్టెంబర్ 15 : జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో నల్లగొండకు చెందిన చల్లా విశ్వనాథ్ సత్తాచాటాడు. ఆల్ ఇండియా స్థాయిలో 26వ ర్యాంకు కైవసం చేసుకున్నాడు. విశ్వనాథ్ తండ్రి చల్లా వెంకటరమణ నల్లగొండలోని గౌతమి జూనియర్ కళాశాల డైరెక్టర్గా పని చేస్తున్నారు. తమ కుమారుడు ఆల్ ఇండియా ర్యాంకు సాధించడంపై తల్లిదండ్రులు, విద్యావేత్తలు హర్షం వ్యక్తం చేశారు.
నడిగూడెం విద్యార్థికి 36వ ర్యాంక్
నడిగూడెం : నడిగూడెం మండల కేంద్రానికి చెందిన బుస్సా సాయి జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఆల్ ఇండియా 36వ ర్యాంక్ సాధించాడు. ఈ సందర్భంగా సాయి మాట్లాడుతూ పట్టుదల, ప్రణాళికా బద్ధంగా చదివానని, తల్లిదండ్రులు ప్రోత్సాహం, అధ్యాపకుల సూచనలతో తాను ర్యాంక్ సాధించినట్లు తెలిపాడు. సాఫ్ట్వేర్ ఇంజినీర్గా సేవలందిస్తానని పేర్కొన్నాడు. ఈ సందర్భంగా సాయిని తల్లిదండ్రులు బుస్సా మహేశ్, సులోచన, గ్రామస్తులు అభినందించారు.
నేరేడుచర్ల విద్యార్థినికి 116వ ర్యాంక్
నేరేడుచర్ల : జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో నేరేడుచర్ల పట్టణానికి చెందిన దొంతిరెడ్డి హన్వితారెడ్డి ఆల్ ఇండియా స్థాయిలో 116వ ర్యాంక్ సాధించింది. పట్టణంలోని శ్రీవాణి పాఠశాలలో ప్రాథమిక విద్యనభ్యసించిన హన్వితారెడ్డి హైదరాబాద్లోని నారాయణ కళాశాలలో ఇంటర్ పూర్తి చేసింది. గతంలోనూ జేఈఈలో బాలికల విభాగంలో జాతీయ స్థాయిలో 3వ ర్యాంక్, ఎంసెట్ ఓపెన్ క్యాటగిరిలో 88వ ర్యాంక్ సాధించింది, విద్యార్థిని శ్రీవాణి పాఠశాల డైరెక్టర్ కొణతం సీతారాంరెడ్డి, నేరేడుచర్ల మాజీ సర్పంచ్ కొణతం సత్యనారాయణ రెడ్డి, నారాయణ సంస్థల ప్రతినిధులు అభినందించారు.