ఆ దంపతులకు నలుగురు సంతానం. కానీ, అంతకంటే ఎక్కువ సంతానం వారి ఇంట్లో పెంచుకునే చెట్లు.. ఆ తల్లిదండ్రులకు పిల్లలు దూరంలో ఉన్నా బాధపడరు. కానీ, వారు పెంచుకునే చెట్లను విడిచి మాత్రం దూరంగా ఉండలేరు. నిత్యజీవితంలో ఎక్కువ సమయం ఈ దంపతులు వాటితోనే గడుపుతారు. ఇంటికి అవసరమయ్యే కాయగూరలు, పండ్లు, పూలు, నీడనిచ్చే చెట్లను వారు తోడునీడగా పెంచుకుంటున్నారు. వృద్ధ్దాప్యంలోనూ చెట్లను రక్షిస్తూ, వాటిని కన్నబిడ్డల్లా సాకుతున్న ఈ దంపతులను అవి కూడా మా మంచిచెడ్డా చూసుకుంటాయని గర్వంగా చెబుతున్నారు. పట్టణంలోని వారి ఇంటిని వనంలా మార్చి ఆదర్శంగా నిలుస్తున్నారు.
హుస్నాబాద్ టౌన్, సెప్టెంబర్ 22 : ఆ ఇంటి ముందు అడుగుపెట్టగానే రెండువైపులా చల్లని గాలిని అందించే వేప చెట్లు.. ఆ పక్కన పూలచెట్లు.. ఆ ఇల్లు పలురకాల చెట్లతో వనాన్ని తలిపిస్తున్నది. వారు నివసించే ఇంటి స్థలం తప్పా మిగతా స్థలంలో అడుగుకో చెట్టు పలకరిస్తుంటుంది. హుస్నాబాద్ పట్టణంలోని టీచర్స్కాలనీకి చెందిన పిన్నింటి రాములు-సుశీల దంపతులు ఎనిమిదేండ్లుగా పలురకాల మొక్కలను పెంచుతున్నారు. పట్టణాలు కాంక్రీట్మయమవుతున్న నేటి తరుణంలో ఈ దంపతులు ప్రకృతి వనాన్ని సృష్టించి ఆదర్శంగా నిలుస్తున్నారు.
చెట్లనే ప్రేమిస్తూ.. స్పృశిస్తూ..
హుస్నాబాద్ సర్కారు దవాఖానలో డ్రైవర్గా పని చేసిన రాములు ఆరేండ్ల క్రితం ఉద్యోగ విరమణ పొందారు. చిన్నప్పటి నుంచే చెట్లపై మమకారం పెంచుకున్న రాములుకు, భార్య సుశీల సైతం ప్రకృతి ప్రేమికురాలు కావడంతో ఇంటిని వనంగా మార్చారు. నిత్యం చెట్ల మధ్యనే ఎక్కువ సేపు గడుపుతూ వాటి ఆలనాపాలనా చూస్తున్నారు. ప్రతి చెట్టునూ నిత్యం స్పృశిస్తూ వాటితో గడుపుతూ ఆనందాన్ని పొందుతున్నారు. ఏదైనా చెట్టు వాడిపోతుంటే వారి మనసంతా తల్లడిల్లిపోతుంది. దాన్ని బతికించి, తిరిగి జీవం పోసే దాకా మనసొప్పదు వారిది. ఇలా వాటిని ప్రేమిస్తూ.. లాలిస్తూ చెట్లే పిల్లలుగా ప్రకృతితో సహవాసం చేస్తున్నారు.
ఇంటి ఆవరణలో తీరొక్క మొక్కలు..
రాములు-సుశీల దంపతులకు చెందిన ఇంటిలోని రెండున్నర గుంటల స్థలంలో పలు రకాల కూరగాయల చెట్లను పెంచుతున్నారు. ప్రత్యేకంగా పందిరి వేసి దొండ, వంకాయ, చిక్కుడు, టమాట, తోటకూర, బబ్బెర తదితర పండిస్తున్నారు. మామిడి, సీతాఫలం, జామ తదితర పండ్లతో పాటు కనకంబరం, గులాబీ, గన్నేరు, మల్లె, మందార, చామంతి, సంపంగి, తంగెడు తదితర పూల చెట్లు వీరి ఆవరణలో కనిపిస్తాయి. ఇంటి ముందుతో పాటు ఇంటి ఆవరణలో సైతం నీడనిచ్చే వేపతో పాటు పలు రకాల చెట్లను పెంచుతున్నారు.
కూరగాయలు, పండ్లు ఉచితంగా పంపిణీ..
తమ ఇంట్లో పండే వివిధ రకాల కూరగాయలను ఇంటి అవసరాలకు వినియోగిం చుకోగా, మిగిలిన వాటిని పలువురికి ఉచితంగానే అందిస్తున్నారు ఈ దంపతులు. ఎవరు డబ్బులు ఇస్తామన్నా సౌమ్యంగా వద్దంటూనే, డబ్బులకు అమ్మమని చెబుతారు. పైగా హైదరాబాద్లో ఉండే పిల్లలకు సైతం అప్పుడప్పుడు పంపుతుంటారు. అడిగిన వారికి లేదనకుండా కూరగాయలు అందించి, ‘దేవుడు మాకిచ్చాడు.. మేము మికిస్తున్నాం’.. అంటూ ఆనందంగా చెబుతారు. విరివిగా కాసే సీతాఫలాలు సైతం తాము తినడంతో పాటు ఇతరులకు సైతం అందిస్తూ వారిలో ఆనందాన్ని చూసి గర్వపడుతున్నారు.
పిల్లల మాదిరిగా సాకుతున్నాం..
మా ఇంట్లో చెట్లే మాకు పిల్లలు. అవి లేకుంటే మేము ఉండలేం. ఆ చెట్లే మమ్మల్ని కరోనా నుంచి కాపాడాయి. మా చుట్టూ పక్కల వారికి కరోనా వచ్చినా, మాకు రాలేదంటే మా మొక్కలు, చెట్లే మమ్మల్ని కాపాడనయి అని నమ్ముతున్నం. ఈ చెట్లను ఇడిసి మేము ఏడికి పోము. చెట్లు ఇచ్చే పండు, ఫలం, పూలను సూత్తే మస్తు సంతోషంగా ఉంటది మాకు. మా మంచి చెడ్డను ఈ చెట్లే సూసుకుంటయని ఆనందంతో చెబుతున్నాం.
రాములు సుశీల దంపతులు, హుస్నాబాద్