సిద్దిపేట టౌన్, సెప్టెంబర్ 20 : నవరాత్రులు విశేష పూజలందుకున్న మట్టి గణపయ్య నవరాత్రోత్సవాలు సోమవారంతో ముగిశాయి. స్వామి వారి శోభాయాత్ర నయనానందనాన్ని పంచింది. మన సంస్కృతి, సాంప్రదాయాల మేళవింపుగా ఆసాంతం గణపయ్య శోభాయాత్ర కొనసాగింది.
హంస వాహనంపై ఊరేగిన గణపయ్య..
ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు నివాసంలో నెలకొల్పిన మట్టి వినాయకుడి మహాశోభాయాత్ర రథాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. హంస వాహనంగా పూలతో రూపొందించి స్వామి వారిని ప్రతిష్ఠించారు. సిద్దిపేట చరిత్రలోనే విశిష్టంగా రథాన్ని రూపొందించి స్వామిని ఊరేగించడం ఇదే మొదటి సారి. సిద్దిపేట పురవీధుల మీదుగా గణపయ్యను ఊరేగించారు. శోభాయాత్ర ఆసాంతం నేత్రపర్వం గా సాగింది. మన సంస్కృతి, సాంప్రదాయాలకు అద్దం పట్టే ఒగ్గు డోలు, చిందు యక్షగానం, లంబాడీ నృత్యాలు, బోనాలు, కోలాటం, తీన్మార్ నృత్యాలు ఇలా వెటికవే ప్రత్యేకంగా శోభాయాత్ర మరింత రెట్టింపు ఉత్సాహంతో జరిగేలా నిర్వహించారు. మట్టి గణపయ్య శోభాయాత్ర కోమటి చెరువు వరకు కోలాహాలంగా కొనసాగింది.
ఏర్పాట్లను పరిశీలించిన సంగారెడ్డి ఎస్పీ
సదాశివపేట, సెప్టెంబర్ 20: సదాశివపేట, సంగారెడ్డిలలో వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని పరిశీలించి, సదాశివపేటలో ఊబచెరువు వద్ద ఎస్పీ రమణకుమార్ పర్యవేక్షించారు. సంగారెడ్డిలోని మహబూబ్సాగర్లో నిమజ్జనం వద్దకు వెళ్లి వినాయక విగ్రహాలను క్రేన్ సాయంతో దగ్గరుండి నిమజ్జనం చేయించారు. సంగారెడ్డిలోని చాణక్యపురి కాలనీలో ఏర్పాటు చేసిన మట్టి గణపతిని మండపం వద్ద వైకుంఠపురం ప్రధానాచార్యులు వరదాచార్యులు నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో ఎస్పీ వెంట సంగారెడ్డి డీఎస్పీ బాలాజీ, సదాశివపేట సీఐ సంతోష్కుమార్, సంగారెడ్డి సీఐ రమేశ్, సదాశివపేట మున్సిపాలిటీ కమిషనర్ కృష్ణారెడ్డి, పేట వైస్ చైర్మన్ చింతాగోపాల్, పిల్లోడి విశ్వనాథం, కౌన్సిలర్లు శివకుమార్, రాజు, నాయకులు పాల్గొన్నారు.