చినజీయర్స్వామి చేతులమీదుగా కార్యక్రమం
గోవింద నామస్మరణతో మార్మోగిన దుబ్బాక పట్టణం
మంత్రి హరీశ్రావు, ఎంపీ ప్రభాకర్రెడ్డి హాజరు
భారీగా తరలివచ్చిన భక్తులు
కనుల పండువగా సాగిన కల్యాణం
తాను చదువుకున్న ప్రాంతం కావడం, ఈ ప్రాంతంపై ప్రేమాభిమానాలు, సత్సబంధాలతో సీఎం కేసీఆర్ అత్యద్భుతంగా బాలాజీ దేవాలయం దుబ్బాకలో నిర్మించారని చినజీయర్ స్వామి అన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా దుబ్బాకలో బాలాజీ దేవాలయంలో నిర్వహించిన విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూజా కార్యక్రమాల్లో పాల్గొని, భక్తులనుద్దేశించి ప్రవచనాలు చేశారు. భగవంతుడి ముందు అందరూ సమానమేనని అన్నారు. కులమతాలు, పేద, ధనిక బేధాలను పక్కనబెట్టి సమానత్వం, సమతాభావంతో అందరూ మెలగాలని కోరారు. ఆలయ నిర్మాణంతో దుబ్బాక ప్రాంతం ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మతం పేరిట ఆధిపత్యానికి పాకులాడితే పతనం తప్పదన్నారు. త్వరలో శంషాబాద్లో నిర్వహించే రామానుజుల స్వామి వారి విగ్రహప్రతిష్ఠాపన కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.
దుబ్బాక ఇప్పుడు సస్యశ్యామలం : మంత్రి హరీశ్రావు
2009లో దుబ్బాకలో వేంకటేశ్వరాలయ నిర్మాణం చేపట్టిన సమయంలో ఈ ప్రాంతం కరువు కాటకాలు, ఆకలి కేకలు, వలసలు, ఆత్మహత్యలకు నిలయంగా ఉండేదని, ఇప్పుడు ఎక్కడ చూసినా పచ్చని పొలాలతో ఆకుపచ్చగా కనిపిస్తున్నదని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ.. దుబ్బాక ప్రాంతం అంటే సీఎం కేసీఆర్కు ఎంతో ఇష్టమన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి అన్ని విధాలుగా సీఎం కేసీఆర్ కృషిచేస్తున్నారన్నారు. దేవాలయ నిర్మాణానికి సీఎం కేసీఆర్ ప్రభుత్వ పరంగా రూ.4.25 కోట్లు మంజూరు చేశారని, ఆయన వ్యక్తిగతంగా మరో కోటి రూపాయలు అందజేశారని గుర్తుచేశారు. దేవుడి ఆశీస్సులతో తెలంగాణ అన్ని రంగాల్లో ప్రగతి పథంలో పయనిస్తుందన్నారు. దుబ్బాకకు ఎంతో భవిష్యత్ ఉందని, గోదారి జలాలతో దుబ్బాక సస్యశ్యామలంగా మారి అభివృద్ధి చెందుతోందన్నారు. రానున్న రోజుల్లో ఆధ్యాత్మికంగా కేంద్రంగా అభివృద్ధి చెందనున్నదని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో ట్రస్టు చైర్మన్ వడ్లకోండ శ్రీధర్, కార్యదర్శి రాజు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దుబ్బాకలో నిర్మించిన బాలాజీ దేవాయ స్థ్థపతి వల్లినాయిగమ్ను బంగారు కంకణంతో సన్మానించారు.
కనుల పండువగా కల్యాణోత్సవం
దుబ్బాక బాలాజీ దేవాలయంలో శుక్రవారం రాత్రి వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవం శ్రీమాన్ మంగళగిరి నవీన్ ఆచార్యుల ఆధ్వర్యంలో కనుల పండువగా జరిగింది. దుబ్బాక పట్టణ పద్మశాలీ కులసంఘం వారు పట్టువస్ర్తాలు, పుస్తె, మట్టెలు సమర్పించారు. పద్మశాలీ బాంధువుల ఆడపడుచు పద్మావతీ అమ్మవారికి పుస్తె మట్టెలు, వేంకటేశ్వరస్వామి వారికి పట్టు వస్ర్తాలను సమర్పించారు. ఏటా దుబ్బాకలో నిర్వహించే స్వామివారి కల్యాణోత్సవానికి పద్మశాలీ సంఘం నుంచి పుస్టె మట్టెలు, పట్టు వస్ర్తాలు సమర్పిస్తామని కుల సంఘం అధ్యక్షుడు జిందం గాలయ్య తెలిపారు. ఈ వేడుక చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.