ఉద్యమ పార్టీగా అవతరించి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన టీఆర్ఎస్ ఎన్నో విజయాలను సొంతం చేసుకున్నది. అనేక ఆటుపోట్లను ఎదుర్కొని తిరుగులేని శక్తిగా ఎదిగింది. ఇంటి పార్టీగా తెలంగాణ ప్రజల గుండెల్లో నిలిచిపోయింది. స్వరాష్ట్రంలో వరుసగా రెండు పర్యాయాలు అధికారంలోకి వచ్చి అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నది. అనేక అంశాల్లో దేశానికి ఆదర్శంగా నిలిచింది. ఉమ్మడి మెదక్ జిల్లా టీఆర్ఎస్కు కంచుకోటలా మారింది. ఆది నుంచి జిల్లా ప్రజలు ఉద్యమ పార్టీని ఆదరించారు. అన్ని ఎన్నికల్లోనూ అక్కున చేర్చుకున్నారు. జిల్లా ముద్దుబిడ్డ, సీఎం కేసీఆర్కు మెతుకు సీమ ప్రజలంతా అండగా ఉంటున్నారు. కాగా, టీఆర్ఎస్ పార్టీ ఇరవై ఏండ్ల పండుగను కనీవినీ ఎరుగని రీతిలో నిర్వహించేందుకు అధిష్టానం సన్నాహాలు చేస్తున్నది. నవంబర్లో వరంగల్లో ‘విజయ గర్జన’ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు జిల్లాల నుంచి పెద్దఎత్తున జనాన్ని సమీకరించడం, పార్టీ శ్రేణులు భారీగా తరలి వచ్చేందుకు నియోజకవర్గాల వారీగా టీఆర్ఎస్ నేతలతో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తెలంగాణ భవన్లో సమావేశాలు నిర్వహిస్తున్నారు. సోమవారం ఉమ్మడి మెదక్ జిల్లాలోని దుబ్బాక, సంగారెడ్డి నియోజకవర్గాల ప్రజాప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులతో సన్నాహక సమావేశం ఏర్పాటు చేసి దిశానిర్దేశం చేశారు. కేటీఆర్ ఆదేశాలతో జిల్లానేతలు ఇప్పటి నుంచే పక్కా ప్రణాళికతో ఏర్పాట్లు చేస్తున్నారు.
సిద్దిపేట, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ఇరవై ఏండ్ల పండుగను కనివినీ ఎరగని రీతిలో నిర్వహించేలా సన్నాహాలు చేస్తున్నది. తెలంగాణ ప్రజల ఆకాంక్షను నిజం చేసి అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేనివిధంగా పథకాలను ప్రవేశపెట్టి, ప్రతి కుటుంబం చిరునవ్వులతో ఉండేలా అద్భుత పాలనను సీఎం కేసీఆర్ అందిస్తున్నారు. మన రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలు యావత్తు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. ప్రతి ఒక్కరూ చిరునవ్వు, సుఖసంతోషాలతో జీవించేలా చేస్తూ, వారి గుండెల్లో నిలుస్తున్న నాయకుడు సీఎం కేసీఆర్. నవంబర్లో వరంగల్ నిర్వహించే ‘విజయ గర్జన’ విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ప్రతి రోజూ నియోజకవర్గాల వారీగా తెలంగాణ భవన్లో పార్టీ సన్నాహాక సమావేశాలు జరుగుతున్నాయి. సోమవారం ఉమ్మడి జిల్లాలోని దుబ్బాక, సంగారెడ్డి నియోజకవర్గాల సమీక్షా సమావేశాలు జరిగాయి. ఈ సమావేశాలకు ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డితో పాటు జిల్లా పరిషత్ చైర్మన్లు, నియోజకవర్గంలోని ఎంపీపీలు, జడ్పీటీసీలు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు, మండలాధ్యక్షులు, ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు. ఒక్కో నియోజకవర్గం నుంచి సుమారు నలభై నుంచి యాభై మంది పాల్గొన్నారు. మిగతా నియోజకవర్గాల పార్టీ సమావేశాల నిర్వాహణకు తేదీలను ఖరారు చేశారు. ఆయా తేదీల్లో స్థానిక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఇతర ముఖ్యనేతలు హాజరు కానున్నారు.
గ్రామ, మండల స్థాయి సమావేశాలు..
వచ్చే నెలలో వరంగల్ నిర్వహించే ‘విజయ గర్జన’ సభను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల సమావేశాల్లో దిశానిర్దేశం చేస్తున్నారు. పార్టీ అధ్యక్షుడు సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపును పార్టీ శ్రేణులంతా పనిచేయాలని పిలుపునిస్తున్నారు. తెలంగాణ భవన్లో నియోజకవర్గ సమావేశాలు అయిపోగానే ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల నేతృత్వంలో స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు గ్రామ, మండల సమావేశాలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధ్దం చేసుకున్నారు. గ్రామాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి పార్టీ నాయకులు దిశానిర్దేశం చేస్తారు. ఒక్కో గ్రామం నుంచి ఎంత మంది సభకు రానున్నారు. వారికి వాహనాలు ఎలా సమకూర్చుకోవడం ఇలా ప్రతి అంశం స్థానిక నాయకులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. ప్రతి నియోజకవర్గం నుంచి 20 వేల నుంచి 30వేల మంది వరకు సభకు వెళ్లేలా సిద్ధమవుతున్నారు. వరంగల్కు దగ్గరగా ఉన్న నియోజకవర్గాల నుంచి ఆ సంఖ్య మరింతగా ఎక్కువగా ఉండనున్నది. గ్రామాలు, పట్టణాల్లో జరుగుతున్న అభివృద్ధిని వివరించాలని మంత్రి కేటీఆర్ పార్టీ శ్రేణులకు సూచిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ చేపట్టిన పథకాలను ప్రజలలోకి బలంగా తీసుకుపోయేవిధంగా శ్రేణులు కృషి చేయనున్నారు. అందుకు అనుగుణంగా విజయ గర్జన సభకు ప్రజలను సమీకరించేలా పార్టీ నాయకులు ఇప్పటి నుంచే పక్కాగా ప్రణాళిక సిద్ధ్దం చేసుకుంటున్నారు.
సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలు టీఆర్ఎస్కు కంచుకోటలు. సీఎం కేసీఆర్ సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మంత్రి హరీశ్రావు సిద్దిపేట నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. గత సార్వత్రిక ఎన్నికల్లో సంగారెడ్డి మినహా అన్ని అసెంబ్లీ స్థానాలను టీఆర్ఎస్ కైవసం చేసుకున్నది. రెండు పార్లమెంట్ స్థానాలకు గానూ రెండింటినీ కైవసం చేసుకొని ప్రతిపక్ష పార్టీల డిపాజిట్లను గల్లంతు చేసింది. జిల్లా పరిషత్లతోపాటు, ఎంపీపీ, జడ్పీటీసీలు, స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. ఉమ్మడి జిల్లాలో తిరుగులేని పార్టీగా టీఆర్ఎస్ ఎదిగింది. తెలంగాణ ఉద్యమం ప్రారంభం నుంచి టీఆర్ఎస్ పార్టీ అన్ని ఎన్నికల్లో విజయభేరి మోగిస్తున్నది. సిద్దిపేట జిల్లా ముద్దు బిడ్డ కేసీఆర్ ఈ రాష్ర్టానికి సీఎం కావడంతో మెతుకు సీమ ప్రజలు ఆయన వెంటే ఉంటున్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రభుత్వ పథకాలను అమలు చేస్తూ అన్నివర్గాల ప్రజలకు అందిస్తున్నారు. దీంతో అన్నివర్గాల ప్రజలు సంతోషంగా ఉంటున్నారు. నవంబర్లో వరంగల్లో నిర్వహించ తలపెట్టిన ‘విజయ గర్జన’ను విజయవంతం చేయడానికి పార్టీ శ్రేణులు సమాయత్తమవుతున్నారు. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇప్పటికే దుబ్బాక, సంగారెడ్డి నియోజకవర్గాల సమావేశాలు జరుగగా ఈనెల 20న మెదక్ నియోజకవర్గం, ఈనెల 23న అందోల్, నర్సాపూర్, జహీరాబాద్, నారాయణ్ఖేడ్, పటాన్చెరు నియోజకవర్గాల సమావేశాలు జరుగనున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. మంత్రి హరీశ్రావు హుజూరాబాద్ ఎన్నికల ప్రచారంలో ఉన్న నేపథ్యంలో ఎన్నికల అనంతరం సిద్దిపేట, గజ్వేల్ సమావేశాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. హుస్నాబాద్ నియోజకవర్గ సమావేశం కూడా ఎన్నికల అనంతరమే ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. జనగామ నియోజకవర్గ సమావేశం ఈ నెల 22న ఉంటుందని పార్టీ ముఖ్యనాయకులు తెలిపారు. ఈ నియోజకవర్గాల సమావేశాల్లో పార్టీ నాయకులకు మంత్రి కేటీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టేలా పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూనే విజయ గర్జన సభకు పెద్దఎత్తున తరలివచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఏఊరికి ఆఊరి నాయకులు కథనాయకులు కావాలి. ఎక్కడికక్కడ స్థానికంగా వాహనాలను సమకూర్చుకొని ప్రతి కార్యకర్త మీటింగ్కు వచ్చేలా గ్రామ, మండల స్థాయిలో సన్నాహాక సమావేశాలు నిర్వహించుకోవాలని పార్టీ ముఖ్యనాయకులకు, ప్రజాప్రతినిధులకు సూచిస్తున్నారు. విజయ గర్జన సభకు ప్రతి గ్రామం నుంచి పార్టీ కమిటీలు, అనుబంధ కమిటీలు, పార్టీ అభిమానులు, పెద్దఎత్తున తరలివచ్చేలా చూడాలని చెబుతున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికీ ఏదో ఒక రూపంలో అందాయి. వారందరికీ విజయగర్జన సభ గురించి వివరించి వారందరూ సభకు తరలివచ్చేలా స్థానిక నాయకులు చొరవ చూపనున్నారు. పార్టీ ముఖ్యనాయకుల నుంచి కార్యకర్తల వరకు అందరూ ఒకే బస్సులో తరలివెళ్లనున్నారు. ముందస్తుగానే ఎక్కడికక్కడ బస్సులను, ఇతర వాహనాలను బుక్ చేసుకుంటున్నారు. ఈనెల 25న జరిగే పార్టీ ప్లీనరీ సమావేశానికి అనుమతి ఉన్న వారు హాజరు కానున్నారు. పరిమిత సంఖ్యలో జరుగుతున్న నేపథ్యంలో జిల్లా నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు ఇతర ముఖ్యనాయకులు హాజరుకానున్నారు.