వీరగల్లుల విగ్రహాలు.. శాతవాహనుల కాలం నాటి కుండపెంకులు.. మట్టిపూసలు, పాలరాయిగోళి, ఇటుకలు.. మధ్య రాతియుగం నాటి రాతి పనిముట్లు .. చాళక్యుల నాటి శిల్పాలు.. శిల్పకళ.. కాకతీయశైలిగా బృహత్ శిలాయుగం సమాధులు.. నాటి మానవులు ఉపయోగించిన పనిముట్లు.. క్రీ.పూ. 2500 ఏండ్ల నాటి పుల్లూరు సమాధుల్లోని అవశేషాలు.. ఇవన్నీ సిద్దిపేట జిల్లా ఘనచరిత్రను తెలుపుతున్నాయి. ఆ నాడు ఓ వెలుగు వెలిగిన నాటి చారిత్రక కట్టడాలు సజీవంగా ఉండి, ఈ ప్రాంత ఘనచరిత్రను చాటి చెబుతున్నాయి. చారిత్రక ఆనవాళ్లకు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. వెయ్యేండ్ల క్రితం నాటి మానవ ఆవాసాలు ఇక్కడ బయటపడ్డాయి. తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు ఇటీవల జిల్లాలో విస్తృతంగా పర్యటించగా, పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆ విశేషాలు ఈ వారం ‘సండే స్పెషల్’లో చూద్దాం..
సిద్దిపేట, సెప్టెంబర్ 18 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): జిల్లాలోని ఆయా ప్రాంతాల్లో కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులైన వేముగంటి మురళీకృష్ణ, వేముగంటి రఘునందన్, అహోబిలం కరుణాకర్, సామలేటి మహేశ్, మామిండ్లబాయి లక్ష్మారెడ్డి, చంటి పర్యటించారు.మూడు సంవత్సరాల కిందట ప్రభుత్వ అనుమతితో పురావస్తుశాఖ ఆధ్వర్యంలో నంగునూరు మండలం నర్మెట, పాలమాకుల గ్రామాల్లో చేపట్టిన బృహత్ శిలాయుగం సమాధుల తవ్వకాల్లో నాటి మానవులు ఉపయోగించిన పరికరాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. ఈ తవ్వకాల్లో ప్రాచీన నాగరికత వెలుగులోకి వచ్చింది.
సిద్దులున్న ప్రాంతం కనుక సిద్దులపేట
సిద్దులున్న ప్రాంతం కనుక సిద్దులపేటగా అటు నుంచి సిద్దిపేటగా పేరు వచ్చిందని ఓ పౌరాణిక గాథలో ఉందని ప్రసిద్ధి. అయితే సిద్దిపేటలో పురాతన పేట పారుపల్లి వీధి. ఈ వీధి ప్రాంతంలో మాతంగి వాగు పారేది. ఆ వాగు ఒడ్డునే పురాతన భోగేశ్వరాలయం ఉంది. ఈ ఆలయం వద్ద అమ్మదేవతల శిల్పాలు దొరికాయని, ఇప్పుడు కొత్తగా మాతంగి ఒడ్డున, సిద్దిపేట పట్టణానికి ఉత్తరంలో మామిండ్ల బాయి దగ్గర గల పాటిగడ్డ మీద కొత్త చారిత్రక ఆధారాలు లభించాయి. శాతవాహనుల కాలం నాటి కుండపెంకులు, మట్టిపూసలు, పాలరాయిగోళి, ఇటుకలు, మధ్యరాతియుగం నా టి రాతి పనిముట్లు ఉన్నట్లు గుర్తించారు. జిల్లా కేంద్రమైన సిద్దిపేటకు పేరు ఎలా వచ్చిందని సాహిత్యంలో ఎక్కడా పెద్దగా ప్రస్తావన లేదు. అయితే పట్టణంలో కనిపించే చార్కమాన్ మధ్య ఏర్పడ్డది నేటి కొత్త పట్టణం. అయితే నిజాం సైన్యంలోని సిద్దిఖ్లు ఇక్కడ ఏర్పర్చుకున్న శిబిరమే సిద్దిపేటగా మారిందన్నది ఒక కథగా చెబుతారు.
మంగోల్లో ప్రాచీన శిల్పాలు
కొండపాక మండలంలోని మంగోల్లో చారిత్రక వస్తు, విశేషాలను గుర్తించారు. మొగల్ పాలకుల వల్ల మంగోల్ గ్రామానికి ఆ పేరు వచ్చింది. ఒకప్పుడు సిద్దిపేట ప్రాంతం దట్టమైన అడవులు, గుట్టలతో నిండిన ప్రాంతమని.. అయితే నిజాం వీటిని అభివృద్ధి చేసేందుకు ఫర్మానాలు ఇచ్చాడని తెలుస్తోంది. ప్రాచీన, చారిత్రక మంగోల్ గ్రామంలోని కోటలో పెద్ద పెద్ద రాతికట్టడాలు, డంగు సున్నంతో పూసిన ఎత్తైన గోడలు, రెండు వైపులా కాపాలాదారులు ఉండే గదులతో గడి ప్రవేశ ద్వారం, బారాబంది కొరకు ఏర్పాట్లు ఉన్నాయి.
గ్రామంలో మరిన్ని చారిత్రక ఆనవాళ్లు
మంగోల్లోని శివాలయం గర్భగుడి ముందు గజ్జెల పట్టెడలతో, మెడలో మువ్వల గొలుసులతో ఉన్న నంది ఉన్నదని.. అది చాళుక్యుల కాలం నాటిది. గర్భగుడిలో వేది భద్రపీఠం మీద శివలింగం ప్రతిష్ఠితమై ఉంది. లింగపీఠం చతురస్రాకారంలో ఉండగా దీన్ని కాకతీయశైలిగా గుర్తించారు. ఈ లింగం వెనుక భాగంలో భక్తహనుమాండ్ల విగ్రహం ఉంది. ఈ గుడిలో 17,18వ శతాబ్దాల నాటి సూర్యుడి విగ్రహం, బౌద్ధంలో కనిపించే నాగముచుళిందను పోలిన నాగశిల్పం ఉంది. గ్రామంలో 6 తలలు మాత్రమే కనిపిస్తున్న మందపు రాతి ఫలకం మట్టిలో కూరుకుని ఉంది. అయితే గ్రామస్తులు మాత్రం 7 తలలు ఉంటాయని, ఇది ఎక్కడా లేని సప్తమాతృకల తలలు మాత్రమే చెక్కిన మొదటి శిల్పమంటున్నారు. గ్రామంలో ఇస్లామిక్ శైలిలో నిర్మించిన ముస్లిం సమాధులు, 10వ శతాబ్దం నాటి యుద్ధ సంరంభంలో నిల్చొని ఉన్న అందమైన పెద్ద వీరగల్లు విగ్రహం మంగోల్లో కనిపించింది. మంగోల్లోని చిన్నగుట్టపై హజ్రత్ షాదుల్లా రహమతుల్లా అలీ దర్గా, రాతిగుండ్లకు చెక్కి ఉన్న రెండు శిల్పాలు ఉన్నాయి. అందులో ఒకటి చతుర్భుజుడైన బైరవుడిది కాగా, రెండోది రక్తపాత్ర ఉన్న దేవతామూర్తిది.
అందెలో అతిపురాతన ఆధారాలు
మిరుదొడ్డి మండలం అందెలో అతి పురాతనమైన చారిత్రక ఆధారాలు దొరికాయి. గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు ఎదురుగా చిన్న గుడి ఉందని, ఆ గుడిలో సహజశిలనే లింగంగా పూజిస్తున్నారు. గర్భగుడిలో కాకతీయుల కాలం నాటి పానపట్టం లేని చిన్న శివలింగం(సమలింగం) ఉంది. గుడి బయట అందె వాగులో దొరికిన వినాయక శిల్పాలు, నందులు ఉన్నాయి. రాష్ట్ర కూటుల కాలంనాటి 4 అడుగుల వినాయక శిల్పాలు, చాళుక్యుల కాలం నాటి నంది, గుడి ముందర మూడు నాగశిల్పాలు ఉన్నాయి. గుడి ఎదురుగా ఉన్న ఊర చెరువులో మిషన్ కాకతీయ పనుల్లో బయటపడ్డ శిల్పాలను అక్కడే వదిలేశారని, వాటిలో మూడు వీరగల్లు విగ్రహాలు ఉన్నాయని కొత్త తెలంగాణ చరిత్ర బృందం తెలిపింది. గ్రామంలోని పోచమ్మ గుడి వద్ద మరో రెండు వీరగల్లు విగ్రహాలు నిలిపి ఉన్నాయి. చెరువులో దొరికిన వీరగల్లు విగ్రహంలో ఒకదానిపై మూడు వైపులా శాసనం ఉందని, అది తెలుగు లిపిలో ఉన్నది. ఇందులో కుడి పక్కన పలిమప ప్లవం(గ) వత్స… డి.. త్న…తూ….. అని, ఎడమ వైపున శ్రీమత్ పల్లినడికురు(లో) రా(జు) తోడంజ(చ్చి)న దీపాల మల్లో(జు)(అంకెలు) పొదికొని సురలోకానకుంజ (ని)… అని, కింది వైపున దీనిలేదన్న వారికి దోసము… అని రాసి ఉన్నట్లు బృందం సభ్యులు గుర్తించారు. శాసన లిపిని బట్టి కాకతీయానంతరం 14వ శతాబ్దం నాటి యోధుడేమో అనిపిస్తుంది. అందె గ్రామంలోని బయటి చెరువు వద్ద 5 వీరగల్లు విగ్రహాలు గుర్తించారు. అందులో మొదటి రెండు విగ్రహాలు రెండు అంతస్తుల వీరగల్లులు కాగా… అతిభంగ భంగిమలో నిల్చొని, అర్ధ పద్మాసనంలో కూర్చొని ఉన్నట్లుగా కనిపిస్తున్నాయి. మూడో వీరగల్లులో తల భాగం విరిగి ఉంది. ఇది మూల బంధాసనంలో కూర్చున్న స్త్రీ వీరగల్లుగా గుర్తించారు. ఇది ఆత్మాహుతికి సిద్ధపడిన స్మారక వీర శిలగా గుర్తించారు. నాలుగు, ఐదు వీరగల్లులు కూడా రెండంతస్తుల్లో ఉన్నాయి.
నర్మెట, పాలమాకులలో బృహత్ శిలాయుగం సమాధులు
నంగునూరు మండలం నర్మెట, పాలమాకుల గ్రామాల్లో చేపట్టిన బృహత్ శిలా యుగం సమాధుల తవ్వకాల్లో నాటి మానవులు ఉపయోగించిన పరికరాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. ఈ తవ్వకాల్లో ప్రాచీన నాగరికత వెలుగులోకి వచ్చింది. సిద్దిపేట పట్టణం చుట్టూ 20 కిలో మీటర్ల పరిధిలో బృహత్ శిలాయుగం సమాధులు ఉన్నట్లు గుర్తించారు. ప్రధానంగా సిద్దిపేట మండలం పుల్లూరు, నారాయణరావుపేట, పొన్నాల, నంగునూరు మండలం రాజగోపాల్పేట, నర్మెట, పాలమాకుల, బద్దిపడగ, నంగునూరు, గట్లమల్యాల, చిన్నకోడూరు మండలం రామునిపట్ల గ్రామా ల్లో బృహత్ శిలాయుగం సమాధులు ఉన్నాయని ఇదివరకే గుర్తించి కొన్నిచోట్ల ప్రభుత్వ అనుమతితో మూడేండ్ల కిందట తవ్వకాలు చేపట్టారు. ఈ తవ్వకాల్లో లభించిన ఆనవాళ్లను సీసీఎండీ శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో డీఎన్ఏ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో పుల్లూరు సమాధుల్లోని అవశేషాలు క్రీ॥పూ 2500 సంవత్సరాల నాటివని తేలాయి. నర్మెటలో తవ్వకాలు చేపట్టి సుమారు 36 సమాధుల వరకు గుర్తించారు. సమాధి పై ఉంచబడిన మూతరాయి (క్యాప్స్టోన్) ఇది మానవ ఆకృతి రూపంలో ఉంది. పురావస్తుశాఖ ఆధ్వర్యంలోని తవ్వకాల్లో ఇంత పెద్దక్యాప్స్టోన్ బయటపడటం ఇక్కడే మొదటి సారని అధికార వర్గాలు తెలిపాయి. క్యాప్స్టోన్ యొక్క పొడవు 6.70 సె.మీ. వెడల్పు 4 మీ. మందం 65 సె.మీ ఉంది. ఈ సమాధి వద్దనే మెన్హీర్ (స్మారక శిల), దీని పొడవు 2.90 సె.మీ, వెడల్పు 0.95 సె.మీ ఉంటుంది. వీటిలో మృణ్మయ పాత్రలు, ఎముకలు, ఇనుప పనిము ట్లు, జంతువుల ఎముకలు లభ్యమయ్యాయి. నర్మెటలోని స్మారక శిల (మెన్హీర్) వద్ద జరిపిన తవ్వకాల్లో అనేక పనిముట్లు లభ్యమయ్యాయి. వాటిలో ఎరుపు రంగు కలిగిన మృణ్మయ పాత్రలు, ఎరుపు, నలుపు మిశ్రమం కలిగిన మృణ్మయ పాత్రలు, ధాన్యం నిల్వ చేసుకోవటానికి పెద్ద పెద్ద ఎరుపు రంగు కలిగిన కుండలు లభ్యమయ్యాయి. ఆ కాలంలో జంతువులను వేటాడటానికి ఉపయోగించిన ఇనుప పనిముట్లు(కత్తి, ఉలి, బరిశె, శంఖు, రింగుస్టాండ్, కుంపటి మొదలైనవి) బయటపడ్డాయి. ఎముకలతో తయారు చేసిన అలంకరణ సామగ్రి బయటపడింది. అస్థికలు, జంతువుల యొక్క దంతాలు తవ్వకాల్లో లభ్యమయ్యాయి. నర్మెట, పాలమాకులలో కప్మాక్స్ను గుర్తించారు. కప్మాక్స్ ద్వారా ఆనాటి మానవులు నక్షత్ర రాశు లు, రుతువులు, సీజన్ తెలుసుకున్నట్లు అర్థమవుతుంది. బృహత్ శిలాయుగం సమాధులపై స్థానిక ప్రజలకు అవగాహన లేక వాటిని రాకాశి గూళ్లు, కుచ్చరాళ్లు, దెయ్యాల గూళ్లు అని వారి సంభాషణల్లో పిలుస్తున్నారు.
కోహెడలో వెలుగులోకి వీరగల్లు విగ్రహం
కోహెడలో వీరగల్లు విగ్రహాన్ని గుర్తించారు. ఈ వీరగల్లు విగ్రహం ఒక యుద్ధ దృశ్యంగా ఉంది. ఒక వీరుడు యుద్ధం లో పలువురితో పోరాడి, అందరినీ చంపేస్తున్న దృశ్యం కనిపిస్తుంది. యుద్ధంలో పాల్గొనే గుర్రానికి కవచం కప్పడంతో పాటు జీను, కళ్లెం, ఇతర రాచహోదా అలంకరణలు ఈ విగ్రహంలో ఉన్నాయి. ఇంత గొప్పగా శిల్పి వీరుడి పోరాట యుద్ధదృశ్యం శిల్పంగా మలచడం చాలా గొప్ప విషయం. ఈ విగ్రహాన్ని పరిశీలిస్తే వీరగల్లులోని వీరుడి ఆహార్యం తలమీది సిగకొప్పు కాకతీయ రాజ్య నిదర్శనాలుగా చెప్పవచ్చు.
తంగళ్లపల్ల్లిలో ప్రాచీన సమాధుల ఆనవాళ్లు
కోహెడ మండలం తంగళ్లపల్లికి తూర్పున ఉన్న పాటిగడ్డమీద పెదరాతయుగం నాటి సమాధుల ఆనవాళ్లు గుర్తించారు. సమాధుల ఆవరణలో స్మారకశిలలు ఉన్నాయని, ఇందులో ఒక నిలువురాయి ఉంది. దీన్ని ఫ్రెంచ్ భాషలో మెన్హర్ అని పిలుస్తారు. ఈ నిలువురాయి మూడు నిలువుల ఎత్తు అనగా 18 నుంచి 20 అడుగుల ఎత్తు ఉండగా, పుల్లూ రు, నర్మెటలలోని మెగాలిథిక్ సమాధులవద్ద కనిపించిన మెన్హర్లు కన్నా ఎత్తైనది. ఈ మెన్హర్లు ఉన్న చోటికి కొద్ది దూరం లో ఒక రాతిగుండుకు రాతికళకు చెందిన నిలువెత్తు గీకుడుబొమ్మ(పెట్రోైగ్లెఫ్) త్రిశూలం రూపంలో కనిపిస్తుంది. ఈ త్రిశూలపు గుర్తులను ఇంగ్లిష్లో ట్రైడెంట్స్ అంటారు. ఇవి కూడా పెదరాతియుగం నాటి రాతికళలో భాగమైన పురామానవుడి చిత్రకళగా అభిప్రాయపడ్డా రు. ఈ రాతిచిత్రకళ గీకుడుబొమ్మలు, చెక్కుడు బొమ్మలు, రాతి చిత్రాలు అని మూడు విధాలుగా ఉంటా యి. ఈ రాతికళ అతి ప్రాచీనమైనది. చిర్రగోనె ఆటలో చేసే చిత్తుడుగుంట ఆకారంలో అక్కడ ఉన్న పరుపురాతి బం డలమీద గ్రూవ్స్ ఉన్నాయి.
అసలు ఎవరీ వీరగల్లు ?
రాజుల చారిత్రక సౌధాలకు రాళ్లెత్తిన కూలీలు, ఊరూరా రక్షణ బాధ్యతలు తీసుకున్న వీరులు ఈ వీరగల్లు. గ్రామాలను దొంగల నుంచి, స్త్రీలను, పిల్లలను అపహరించేవాళ్ల నుంచి, అడవి జంతువులు, అడవి పందులు, పులులు, ఏనుగుల నుంచి, శత్రు రాజ్యాల వారు రాజ్య పొలిమేరలను ఆక్రమించకుండా నిరంతరం రక్షించినవారే ఈ వీరులు. దాదాపు అన్ని గ్రామాల పొలిమేర్లలో, పాటిగడ్డలమీద, దేవాలయాల వద్ద కనిపిస్తాయి వీరగల్లులు. వీరుల యాదిలో వేసినవే వీరగల్లుల విగ్రహాలు. క్రీ.పూ 18వ శతాబ్దం వరకు అనేక శైలులు, రూపాల్లో వీరగల్లులు ఉన్నాయి. వీరగల్లుల విగ్రహాలు 30 నుంచి 40 రకాలుగా కనిపిస్తాయి. వేర్వేరు కాలాల్లో వేర్వేరు చరిత్రలకు వాహకాలు ఈ వీరగల్లులు. కొన్ని గ్రామాల్లో వీరగల్లులను హనుమంతులుగా , వీరభద్రులుగా భావించి గుడులు, గోపురాలు నిర్మించడం ఒక విచిత్రమని చరిత్రకారుల భావన.
సిద్దిపేటలో వీరగల్లు విగ్రహాలు
సిద్దిపేట పట్టణం పారుపల్లివీధిలో గల భోగేశ్వరాలయం వద్ద వీరగల్లుల విగ్రహాలు గుర్తించారు. అయితే ఈ విగ్రహాల్లో ఆత్మాహుతి వీరుల శిలలు ఉన్నాయని, భోగేశ్వరాలయం వద్ద నాలుగు రాతి స్తంభాల నడుమ భూమిలోపలికి పాతి ఉన్న వీరుడి శిల్పం కనిపిస్తుంది. వీరుడి కోసం గుడి కట్టిన అరుదైన శిల సిద్దిపేటలో కనిపించడం విశేషం. ఇక్కడ యుద్ధం చేసి మరణించిన వీరులతో పాటు ఆత్మాహుతి శిలలు ఉన్నాయి. ఊరు.. ఊరులోని పిల్లలు, స్త్రీలు, పశువులు, సంపదను కాపాడటానికి ప్రాణాలకు తెగించి ఈ యుద్ధవీరులు పోరాడేవారు. అలా పోరులో అమరులైన వీరుల పేరిట గ్రామస్తులు, పాలకులు నిలిపిన స్మారక శిలలే ఈ వీరగల్లు విగ్రహాలు. 10,11 శతాబ్దాల నాటి ఆహార్యంతో ఆవీరుడి శిల ఉందని, మెడలో రత్నాలు పొదిగిన హారాలు, తల మీద రాచ హోదా తెలిపే ఛత్రం(గొడుగు) ఉన్నాయని, పెద్ద కండ్లు, తిప్పిన మీసాలు, దీర్ఘచతురస్రాకారపు ముఖంతో వీరుడి విగ్రహం కనిపిస్తుంది. తలపై సిగ కుడివైపునకు కట్టినట్లుగా ఉంది. రెట్టల మీద దండ కడియాలు, ఎదురొమ్ము మీద గుచ్చుకుంటున్న బాకును ఎడమ చేతిన పట్టుకొని ఉంటూ ఆత్మాహుతి చేసుకుంటున్నట్లు కనిపిస్తుంది. భర్త మరణిస్తే తాము కూడా ప్రాణత్యాగం చేసిన స్త్రీల పేరిట వేసిన సతీశిలలు ఇక్కడ గుర్తించారు.
అర్ధస్వస్తికాసనంలో సరస్వతీమాత
ఆలయానికి ఉత్తర వాయువ్య దిశలో ఉన్న సరస్వతీ శిల్పం నాలుగు చేతులతో ఉంది. వెనుక చేతుల్లో అక్షరమాల, పుస్తకం, ముందు చేతుల్లో వాయిస్తున్న వీణ కనిపిస్తుంది.దేవత తలమీద స్తూపాకార కిరీటం ధరించి ఉన్నట్లుగా శిల్పం ఉంది. ఈ శిల్పం 17, 18 శతాబ్దాలకు చెందిన శైలిలో ఉన్నట్లు చరిత్రకారులు గుర్తించారు. అంతకుముందు రావురూకులలో ఉన్న సరస్వతీ విగ్రహం భగ్నం కావడం, దాని స్థానంలో కొత్త విగ్రహం ప్రతిష్ఠించినట్లు ఆనవాళ్లు ఉన్నాయి.
విశేషమైన వీరగల్లు..
ఈ ఆలయంలో ఉన్న అన్ని శిల్పాల కంటే విశేషమైన విగ్రహం వీరగల్లు విగ్రహం. ఈ విగ్రహశిల 3 అంతస్తుల్లో వివిధ శిల్పాలతో ఉంది. కింది అంతస్తులో పాగా చుట్టి, కుడి వైపు కట్టిన పెద్దసిగతో మెడలో హారం, చెవులకు కుండలాలు, దండ కడియాలు, ముంజేతి కడియాలు, కాళ్ల కడియాలతో, వీర కాసె, నడికట్టుకట్టి, నడుముకు కత్తి ఒరతో, కుడి భుజం మీద నుంచి అమ్ములపొదికి కట్టిన పట్టితో, కుడి చేతిలో కత్తి, ఎడమ చేతిలో విల్లుతో కనిపిస్తున్న వీరగల్లు ఒక ఎక్కటి. ఎక్కటి అంటే నేటి కాలంలో ఒక కమాండో. ఆయుధ ప్రయోగాలు తెలిసి, ఒంటరిగా పోరాడే యోధుడని అర్థం. మూడు అంతస్తుల శిల్పంలో కింది భాగంలో ఉన్న అంతస్తులో పోరాడుతున్న యోధుడు ఉన్నట్లు కనిపిస్తుంది. రెండో అంతస్తులో దేవకన్య అనగా అఫ్సరసల భుజాల మీద చేతులు వేసి, దివికి పోతున్న వీరుడి వలె ఉండగా, మూడో అంతస్తులో శివసాన్నిధ్యం పొందిన వీరుడు కనిపిస్తున్నట్లుగా విగ్రహశిల కనిపిస్తుంది.
లభ్యమవుతున్న పురాతన వస్తువులు
ఇపుడు ఉన్న గ్రామ పరిధి కాకుండా ప్రాచీనమైన పాత రావురూకుల గ్రామాన్ని పాటిమీద అని పిలిచేవారు. పాటిమీద, పాటిగడ్డ అని పిలువబడే ఈ ప్రాంతంలో పాత దేవాలయ శిథిలాలు, దేవతల శిల్పాలు, మధ్యయుగం నాటి పాతకుండ పెంకులు లభిస్తున్నాయి.
రావురూకులలో పురాతన సరస్వతీ క్షేత్రం
సిద్దిపేట జిల్లా కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న రావురూకులలో వెలిసిన ఈ సరస్వతీ ఆలయం చాలా పురాతనమైనది. ఈ ఆలయంలో ఉత్తర వాయువ్య దిశలో సరస్వతీ ఆలయం, ఈశాన్య దిశలో శివాలయం ఉంది. నైరుతిలో వేంకటేశ్వర ఆలయం ఉంది. మధ్యలో క్షేత్ర పాలకుడి వలె హనుమంతుడి విగ్రహాలు దర్శనమిస్తాయి. గుండ్రని పానపట్టంతో శివలింగం, గజ్జెలపట్టెడతో అలంకరించబడిన చిన్న నందిశిల్పం ఉన్నాయి. ఈ శిల్పాలు చాళక్యుల శిల్పశైలికి చెందినవిగా ప్రసిద్ధి. ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్న మరో శిల్పం కాకతీయ శైలిలో ఉన్న చాముండి దేవతకు పురుషరూపం చాముండేశ్వరుడి విగ్ర హం. కొత్తగా చేర్చిన వినాయక శిల్పం కూడా ఈ ఆలయంలో ఉంది. ఆలయ ప్రాంగణంలో ఆదిత్యుడి విగ్రహం ఆకర్షణీయంగా ఉన్న వీరగల్లు విగ్రహాలు కూడా దర్శనమిస్తాయి. అనంతర కాలంలో ఈ ఆలయంలో నవ గ్రహాలను కూడా ప్రతిష్ఠించారు.