సిద్దిపేట అర్బన్, సెప్టెంబర్ 15 : గ్రామాలు పచ్చదనంతో పాటు ఎంతో పరిశుభ్రంగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వ డ్రింకింగ్ వాటర్,శానిటేషన్ శాఖ డిప్యూ టీ సెక్రటరీ రాజీవ్ జవహరి అన్నారు. బుధవారం సిద్దిపేట రూరల్ మండల పరిధిలోని పెద్దలింగారెడ్డి, రాఘవాపూర్, ఇర్కోడు గ్రామాల్లో ఫీల్డ్ విజిట్లో భాగంగా ఆయన పర్యటించారు. ఇందులో భాగంగా ముందుగా పెద్దలింగారెడ్డిలో పల్లె ప్రకృతి వనం, బాలవికాస వాటర్ ప్లాంట్, ప్రభుత్వ పాఠశాల, డంపింగ్ షెడ్డు తదితర వాటిని పరిశీలించారు. అనంతరం రాఘవాపూర్లోని ప్రభుత్వ పాఠశాల, డంపింగ్ షెడ్డు, శ్మశాన వాటిక, ఇర్కోడు గ్రామంలోని పశువుల హాస్టల్, డంపింగ్ షెడ్డును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను పర్యటించిన గ్రామాల్లో పచ్చదనం బాగుందని, మొక్కలను చాలా బాగా పెంచారని అభినందించారు. గ్రామాలన్నీ ఎంతో పరిశుభ్రంగా ఉన్నాయన్నారు. గ్రామాల్లో తడి, పొడి చెత్త వేరు చేసి సేకరించి డంపింగ్ యార్డుకు తరలించి, దాని ద్వారా ఎరువులు తయారు చేసి మొక్కలకు వేయడం నిజంగా అభినందనీయమన్నారు. అంతకుముందు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా రాజీవ్ జవహరి పెద్దలింగారెడ్డి గ్రామంలో శ్రమదానం చేయడంతో పాటు రాఘవాపూర్లో ఆయన మొక్కలు నాటారు. కార్యక్రమంలో స్వచ్ఛ భారత్ మిషన్ కన్సల్టెంట్ అనిషా డే, సాలిడ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ శ్రావ్యరెడ్డి, స్వచ్ఛ భారత్ మిషన్ డైరెక్టర్ సురేశ్బాబు, డీఆర్డీవో గోపాల్రావు, ఎంపీడీవో సమ్మిరెడ్డి, ఎంపీవో అరవింద్, సర్పంచులు తౌటి ఉదయశ్రీ తిరుపతి, రమేశ్, పంచాయతీ కార్యదర్శులు సంధ్య, యాదగిరి, జీవన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.