విద్యార్థులను ఆకట్టుకునే చిత్రాలు
సొంత డబ్బులతో పాఠశాలలో అందమైన చిత్రాలు గీయించిన ఉపాధ్యాయుడు చంద్రశేఖర్
కరోనా సమయంలో ఆన్లైన్ తరగతుల పర్యవేక్షణ
దౌల్తాబాద్, సెప్టెంబర్ 15: చిత్రం చూడగానే మనసులో ముద్రపడుతుంది. పుస్తకాలు చదివిన దానికంటే ఒక బొమ్మను చూస్తే ఇట్టే అర్థం చేసుకోవచ్చు. విద్యార్థులకు బోధన పెంపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బాల (బిల్డింగ్ ఆస్ లెర్నింగ్ ఎడ్) పథకాన్ని తీసుకొచ్చింది. పాఠ్య పుస్తకాల్లో ఉన్నవాటిని పాఠశాల గోడలపై బోధించాలన్న ఉద్దేశంతోనే చేపట్టిన కార్యక్రమానికి అనుగుణంగానే దౌల్తాబాద్ మండల పరిధిలోని గోవిందపూర్, మధిర గ్రామమైన పోసంపల్లి, గ్రామ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు చంద్రశేఖర్ ముందుకు వచ్చాడు. విద్యార్థులకు తన సొంత జీతం రూ.25వేలు ఖర్చుచేసి ఆకట్టుకునే చిత్రాలను తరగతి గదుల్లో గీయించాడు. ఆకట్టుకునే బొమ్మలతో ప్రభుత్వ పాఠశాల కార్పొరేట్ స్థాయిలో మారిపోయింది. ఇదేకాకుండా విద్యార్థులకు డ్యాన్స్ నేర్పించాలని సౌండ్బాక్స్లను కూడా పాఠశాలకు బహుమతిగా అందించాడు. ఇది చూసిన వారు ఇది ప్రభుత్వ పాఠశాలా..కార్పొరేట్ పాఠశాలా అంటూ అశ్చర్యపోతున్నారు.
విద్యార్థులను ఆకట్టుకునే పేర్లు, చిత్రాలు
పాఠశాలలో పారిశుధ్యంపై అవగాహన కల్పించే విధంగా బొమ్మలు గీయించాడు. బతుకమ్మ పండుగ సంబురాలు, పండ్లు, కూరగాయల చిత్రాలు, వాటి పేర్లను రాయించారు. పరిసరాల పరిజ్ఞానం పెంపొందించేందుకు సూక్తులు రాయడంతో విద్యార్థుల్లో మరింత ఉత్సాహం పెరిగింది. అంతేకాకుండా ప్రతి అంశాన్ని బొమ్మలరూపంలో తెలియజేసే విధంగా పాఠశాల ఆవరణంలో జంతువుల చిత్రాలు గీయించారు.
కరోనాసమయంలో ఇంటింటికీ…
కరోనా సమయంలో కూ డా ఉపాధ్యాయుడు చంద్రశేఖర్ నిత్యం విద్యార్థుల ఇండ్లకు వెళ్లి ఆన్లైన్ క్లాసులు వింటున్నారా లేదా అని పర్యవేక్షణ చేసేవాడు. టీవీ, సెల్ఫోన్ ద్వారా పాఠాలు వినాలని విద్యార్థులకు సూచించాడు.
ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దడమే లక్ష్యం
విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం. సమాజంలో ఉపాధ్యాయ వృత్తికి ఎంతో గౌరవం ఉంది. విద్యార్థులకు వినూత్నంగా విద్య అందించాలనే లక్ష్యంతో పాఠశాల గోడలు, తరగతి గదుల్లో చిత్రాలు, బొమ్మలను తీర్చిదిద్దాం. ఆహ్లాదకర వాతావరణం ఏర్పడే విధంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు అనిత ప్రోత్సాహంతో ముందుకు కొనసాగుతున్నాం.
-చంద్రశేఖర్, గోవిందపూర్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు