సిద్దిపేట టౌన్, సెప్టెంబర్ 15 : ఏడుకొండల వెంకన్నస్వామి సేవ చేసే అవకాశం కోట్లలో కొందరికి మాత్రమే వస్తుంది. అలాంటి సేవాభాగ్యం సిద్దిపేటకు చెందిన సామాజిక, ఆధ్యాత్మిక సేవాపరుడు మురంశెట్టి రాములుకు రెండోసారి దక్కింది. సమాజ సేవకు నిరంతరం పరితపించే సైనికుడు.. అన్నదాతల ఆకలి సేవాతత్పరుడు, ఆధ్యాత్మిక, ధార్మిక సేవల్లో తనదైన ముద్ర వేశాడు. పర్యావరణ ప్రేమికుడు, గోసంరక్షకుడు సేవ అయిన, దాతృత్వమైన దైవ సంకల్పంగా భావించి అంకుఠిత దీక్షతో చేపట్టే నిరంతర సాధకుడు మురంశెట్టి రాములు. అలాంటి సేవాతత్పరునికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండోసారి టీటీడీ బోర్డు మెంబర్గా నియమించింది. సిద్దిపేట పట్టణానికి చెందిన మురంశెట్టి రాములు పది మందిలో తనదైన ప్రత్యేకతను చూపుతూ సేవకు పరితపించే మానవతామూర్తి. వృతిరీత్యా వ్యాపారం చేస్తూ వివిధ సేవా కార్యక్రమాల్లో ప్రత్యేకతను చాటారు. టీటీడీ బోర్డు మెంబర్గా రాములు రెండోసారి నియామకం కావడంపై జిల్లా వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
సమాజ సేవలో మురంశెట్టి..
రూపాయికి రొట్టె, రూపాయికి పప్పు, సం చార చలివేంద్రాలు, జనం దగ్గరికి జలం, మీకు చెత్త మాకు కొత్త, వైద్యసేవలు, పిల్లల్లో చైతన్యం, చదువుకో బతుకు మార్చుకో, వేసవి కాలంలో అన్నదాతల ఆకలి తీర్చే అంబలి పంపిణీ, పశువుల అంగట్లో రైతులకు అన్నప్రసాద వితరణ, ఆధ్యాత్మిక, ధార్మిక సేవా కార్యక్రమాల్లో తనదైన ముద్ర, గోసంరక్షణకు గోశాల, గోవులకు సీమంతాలు, పుట్టిన లేగదూడలకు బారసాల, నామకరణ మహోత్సవం ఇలా అన్నింటిలో తన ప్రత్యేకతను చాటుతూ ఆదర్శవంతమైన సేవా కార్యక్రమాలతో ముందుకెళ్తున్నారు.
ఆధ్యాత్మిక, ధార్మిక సేవల్లోనూ ప్రత్యేకత..
ముందు నుంచి మురంశెట్టి రాములు ఆధ్యాత్మిక, ధార్మిక సేవా కార్యక్రమాల్లో తనదైన ముద్ర వేశారు. సిద్దిపేటలో మొట్టమొదటి సా రిగా వినాయక ఆలయాన్ని నిర్మించారు. గణేశ్ సేవా సమితిని ప్రారంభించి రాష్ట్రంలోని ఆలయాలకు తనవంతు సహాయ సహకారాలు అం దించారు. కాణిపాక ఆలయ పాలకవర్గ సభ్యులు గాను పనిచేశారు. పర్యావరణానికి కీడు చేసే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను నెలకొల్పవద్దని పిలుపునిచ్చి ప్రచారం చేశారు. సొంత ఖర్చులతో మట్టి వినాయకులు తయారు చేసి ప్రజలకు పంపిణీ చేశారు. మట్టి వినాయకుల కంటే మరింత మేలు చేసే గోమయ గణపతులను తయారు చేసిన రాష్ట్రంలోనే మొదటి వ్యక్తిగా ఆయన నిలిచారు. పర్యావరణ పరిరక్షణకు మొక్కలను నాటారు.
సీఎం కేసీఆర్తో గొప్ప అనుబంధం..
సిద్దిపేట ఉద్యమ బిడ్డ, సీఎం కేసీఆర్తో మురంశెట్టి రాములుకు ప్రత్యేక అనుబంధం ఉంది. సీఎం కేసీఆర్ సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పటి నుంచి ఆయన వెంటే ఉన్నారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత రెండు దఫాలు ఎన్నికల ప్రచారంలో రాములు పాల్గొన్నారు. ప్రచార రథాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసి సంచార చలివేంద్రాలను, అంబలి, అన్నదానాన్ని విస్తృతంగా చేపట్టారు. సీఎం కేసీఆర్తోనే బంగారు తెలంగాణ సాధ్యమనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు. సంక్షేమ పథకాలు వివరిస్తూ తనదైన ముద్రతో ప్రచారంలో పాల్గొన్నారు. సిద్దిపేట మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గాను, వైశ్య సంక్షేమ సమితి గౌరవ అధ్యక్షుడిగా, ఎస్ఆర్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు గాను, లారీ ఓనర్స్, ఆయిల్ మిల్లర్స్, గోల్డెన్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడి గాను పనిచేశారు. అరుణాచలేశ్వర ఆర్యవైశ్య నిత్యాన్నదాన ట్రస్టు గణపతి దీక్ష సెంట్రల్ కమిటీ ఉపాధ్యక్షులు గాను, గణేశ్ సేవా సమితి శాశ్వత గౌరవ అధ్యక్షులు కొనసాగుతున్నారు. ఇలా ఆయన ఆధ్యాత్మిక, ధార్మిక సేవకు గుర్తింపుగానే టీటీడీ బోర్డు మెంబర్గా రెండోసారి అవకాశం లభించింది.
సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు
టీటీడీ బోర్డు మెంబర్గా రెండోసారి నియామకం కావడం జీవితంలో మర్చిపోలేని రోజు. ఏడు కొండలస్వామి సేవలో తరిస్తా. స్వామికి సేవ చేసే అరుదైన అవకాశాన్ని కల్పించిన సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు. దైవ సంకల్పాన్ని అంకుటిత దీక్షతో చేపట్టి ఆధ్యాత్మిక, ధార్మిక సేవల్లో ముద్ర వేస్తా.