రాయపోల్ మండలంలోని ఎల్కల్ గ్రామం ప్రగతిదారుల్లో పయనిస్తున్నది. పచ్చదనాన్ని పంచుతూ ఆహ్లాదకర వాతావరణాన్ని సంతరించుకుంది. గ్రామ
వీధుల్లోని రహదారులు అద్దంలా మెరుస్తున్నాయి. కొత్తగా ఏర్పాటు చేసిన వీధి లైట్లు రాత్రివేళల్లో జిగేలుమంటున్నాయి. సర్కార్ లక్ష్యానికి అనుగుణంగా ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, అధికారులు ఉత్సాహంగా పనిచేసి ఆదర్శంగా, స్వచ్ఛతకు చిరునామాగా గ్రామాన్ని తీర్చిదిద్దారు.
ఎల్కల్ గ్రామంలో 4,500 మంది జనాభా, 525 ఇండ్లు, 1576 మంది ఓటర్లు ఉన్నారు. అభివృద్ధి, పరిశుభ్రత, పచ్చదనం కార్యక్రమాలు గ్రామ రూపురేఖలనే మార్చేశాయి. గ్రామ వీధుల్లో నిర్మించి సీసీరోడ్లు సాఫీ ప్రయాణానికి నాంది పలుకుతున్నాయి. వీధిలైట్లు పల్లెకు కొత్త శోభను తెచ్చాయి. చివరి మజిలీ ఇబ్బందులను తప్పించిన వైకుంఠధామం, డంపింగ్యార్డు, ప్రకృతి వనం ఇలా అన్నీ అందుబాటులోకి వచ్చాయి. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రజాప్రతినిధులు, అధికారులు ఎప్పటికప్పుడూ ప్రజా సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తుండడంతో ఎల్కల్ గ్రామం అభివృద్ధి బాటలో పరుగులు తీస్తూ.. పలు గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నది.
గ్రామంలో కొందరు గ్రామస్తులు, దాతల సహకారంతో స్థానికంగా బాలవికాస వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేశారు. ప్లాంట్ ఏర్పాటు కోసం ప్రత్యేకంగా భవనాన్ని నిర్మించారు. తాగునీరు వృథా పోకుండా ఏటీఎం తరహాలో ఇంటింటికీ కార్డులు ఇచ్చి రూ.5కే క్యాన్ నీటిని అందజేస్తున్నారు. దాతల సహకారానికి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
పల్లెప్రగతిలో భాగంగా రూ.2లక్షలతో డంపింగ్యార్డు, రూ. 8లక్షల 50వేలతో వైకుంఠధామం, రూ. లక్షతో పల్లెప్రకృతి వనం, మరో లక్ష వెచ్చించి హరితహారం నర్సరీ, రూ.లక్షా 50వేలతో ట్రాక్టర్, రూ.15లక్షలతో మురుగు కాల్వల నిర్మాణం, రూ.10లక్షలతో సీసీరోడ్లు, రూ.13లక్షలతో కొత్త పంచాయతీ భవనం రూ.2 లక్షలతో ఫార్మేషన్ రోడ్డు, పల్లెప్రగతిలో నాలుగు పాతబావుల పూడ్చివేతలు, రోడ్లకు ఇరువైపులా మొక్కల పెంపకం తదితర అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు గ్రామస్తులు, యువకులు ముందుకు వస్తున్నారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలను వినియోగించుకొని గ్రామాన్ని మరింత అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. ఇప్పటికే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పల్లెప్రగతితో మా గ్రామం రూపురేఖలే మారిపోయాయి. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ అభివృద్ధి పనులు చేపడుతున్నాం. సీఎం కేసీఆర్ రూపొందించిన ప్రత్యేక కార్యాచరణతో మా పల్లె ముఖచిత్రమే మారిపోయింది.
ప్రభుత్వ పథకాలతో గ్రామాభివృద్ధే లక్ష్యంగా పనులు చేస్తున్నాం. పల్లెప్రగతి పనులను చేయడంతో పాటు పారిశుధ్యం లోపించకుండా ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. హరితహారం మొక్కలకు నీటిని అందించడం, ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దడం, గ్రామంలో సేకరించిన చెత్తను ట్రాక్టర్ సహాయంతో డంపింగ్యార్డుకు తరలిస్తున్నాం. గ్రామాభివృద్ధి కోసం పంచాయతీ పాలక వర్గ సభ్యులు గ్రామాభివృద్ధికి కృషి చేస్తున్నారు. అందరం కలిసికట్టుగా పనిచేసి ప్రభుత్వ లక్ష్యాలను పూర్తి చేసుకున్నాం. ఇక ముందు కుడా సర్పంచ్, గ్రామస్తులు సహకారంతో గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతంగా చేపడుతాం.