జిల్లాలో 394 కొనుగోలు కేంద్రాల ఏర్పాటు
యాసంగిలో 2.80 లక్షల ఎకరాల్లో వరి సాగు
6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం
రైతులకు ఇబ్బందులు రాకుండా చూడాలి
ప్రతి మండల అధికారి 4 కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షించాలి
కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి
సిద్దిపేట అర్బన్, మార్చి 31: యాసంగిలో ధాన్యం కొనుగోలుకు జిల్లాలో 394 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ వెంకట్రామ్రెడ్డి అధికారులను ఆదేశించారు. యాసంగి ధాన్యం కొనుగోళ్లపై బుధవారం సిద్దిపేట పట్టణం విపంచి కళానిలయంలో అదనపు కలెక్టర్ పద్మాకర్తో పాటు జిల్లా వ్యవసాయ, మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో యాసంగిలో 2.80 లక్షల ఎకరాల్లో 1. 43 లక్షల రైతులు వరి పండించారని, దాదాపు 6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందన్నారు.
ధాన్యం కొనుగోలుకు జిల్లావ్యాప్తంగా 394 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఏప్రిల్ రెండో వారం నుంచి ధాన్యం వచ్చే అవకాశం ఉందని, ధాన్యం వచ్చే వారం ముందే కొనుగోలు కేంద్రాలను తెరవాలన్నారు. ప్రతి మండలంలో కొనుగోళ్లు సజావుగా జరిగేలా చూసేందుకు మండలానికి ప్రత్యేకాధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, మండల వ్యవసాయ అధికారులు ఒక్కొక్కరికీ 4 ధాన్యం కొనుగోలు కేంద్రాల చొప్పున బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు. చెక్ మెమో ప్రకారం అవసరమైన అన్ని పరికరాలు, మౌలిక సదుపాయాలు ఉన్నాయో లేదో తనిఖీ చేయాలన్నారు. కొత్త కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు ఉండేలా చూసుకోవాలన్నారు. వచ్చే నాలుగు రోజుల్లో మండల అధికారులు కొనుగోలు కేంద్రాలను సందర్శించి ఇబ్బందులను గుర్తించి, వాటికి పరిష్కారాలను సూచించాలన్నారు.
వడ్లు ఎండబోసి తాలు లేకుండా 17శాతం తేమకు మించకుండా ధాన్యాన్ని తీసుకురావాలని, తద్వారా మద్దతు ధర లభిస్తుందని రైతులకు వివరించాలన్నారు. భారమైనా ధాన్యం గ్రామాల్లోనే కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని, కొనుగోళ్లు సజావుగా జరిగేలా యంత్రాంగం శ్రద్ధవహించాలన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలను రైతులకు వివరించాలన్నారు. ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలించేందుకు వాహనాలు సిద్ధం చేయాలని సూచించారు. ట్రక్ షీట్ జారీ విషయంలో, సరిహద్దు జిల్లాలు, రాష్ర్టాల నుంచి జిల్లాలోకి రాకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. గన్నీ బ్యాగులను ముందస్తుగా సిద్ధం చేసుకోవాలని, గన్నీ బ్యాగుల కొరత తలెత్తకుండా ఆర్డీవోలకు బాధ్యతలు అప్పగించామని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో ఆర్డీవో జయచంద్రారెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి శ్రవణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడ చుడండి
45 ఏళ్లు దాటిన వారికి రేపటినుంచి కొవిడ్ వ్యాక్సినేషన్