గులాబ్ తుఫాన్ గుబులు పుట్టిస్తున్నది. తుఫాన్ ధాటికి రెండోరోజూ మంగళవారం అక్కడక్కడ చిరుజల్లులతో వర్షం పడింది. కాగా, ఈ తుఫాన్ రైతులకు అపార నష్టాన్ని మిగిల్చింది. సంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 99,865 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. పత్తి, కంది, సోయాబీన్ పంటలు నీట మునిగాయి. మంజీర నది ఉధృతంగా ప్రవహిస్తుండగా, సింగూరు ప్రాజెక్టు ఐదు, మంజీర రిజర్వాయర్ ఆరు గేట్లను ఎత్తి, దిగువకు 60వేల క్యూసెక్కుల వరద వదిలారు. సంగారెడ్డి జిల్లాలో 260 చెరువులు, కుంటలు అలుగు పారుతున్నాయి. 200 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. నారింజ ప్రాజెక్టు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో కర్ణాటక-తెలంగాణ మధ్య రాకపోకలు నిలిచాయి. మెదక్ జిల్లాలోని వనదుర్గా ప్రాజెక్టు, పోచారం, రాయిన్పల్లి ప్రాజెక్టులతో పాటు చెక్డ్యాంలు పొంగిపొర్లుతున్నాయి. ఈ జిల్లాలో 1430 ఎకరాల్లో వరి, 150 ఎకరాల్లో పత్తి పంటలు నీట మునగగా, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఏడుపాయలలో మంజీర నది ఉధృతి కొనసాగుతుండగా, వనదుర్గాభవానీ మాత ఆలయం జలదిగ్బంధంలో చిక్కుకుంది. ఆలయం వద్ద మెదక్ ఎమ్మెల్యే మంజీర నదికి హారతి ఇచ్చి ప్రత్యేక పూజలు చేశారు. గంగమ్మకు సారె సమర్పించారు. సిద్దిపేట జిల్లాలో 3.66 సెం.మీ. వర్షపాతం నమోదైంది.
సంగారెడ్డి, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ) : గులాబ్ తుఫాన్ రైతులకు నష్టా న్ని మిగిల్చింది. రెండు రోజులుగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురువగా, మంగళవారం అక్కడక్కడ చిరుజల్లులతో వర్షం పడింది. వర్షాలతో అన్నదాతలకు నష్టం వాటిల్లింది. సంగారెడ్డి జిల్లాలో 99,865 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. 200కుపైగా ఇండ్లు పాక్షికంగా కూలాయి. పలు ప్రాంతాల్లో రహదారులు దెబ్బతిన్నాయి. రహదారులకు ఎంత మేర నష్టం వాటిల్లిందోనని పంచాయతీరాజ్, ఆర్అండ్బీ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. భారీ వర్షాలతో మునుపెన్నడూ లేనివిధంగా మంజీర నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. సింగూరు ప్రాజెక్టులోకి పెద్ద ఎత్తున వరద వచ్చి చేరుతున్నది. దీంతో ఇరిగేషన్ అధికారులు ప్రాజెక్టు ఐదుగేట్లు ఎత్తివేసి దిగువకు 60వేల క్యూసెక్కుల వరదనీటిని వదులుతున్నారు. సింగూరు ప్రాజెక్టు ఎగువన కర్ణాటకలో ఉన్న ధనేగావ్ ప్రాజెక్టు గేట్లు ఎత్తి, 80వేల క్యూసెక్కుల వరద వదిలారు. అవి బుధవారం ఉదయం వరకు సింగూరుకు చేరుకునే అవకాశం ఉంది. సింగూరు వద్ద వరద ఉధృతిని అధికారులు ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ దిగువకు నీళ్లు వదులుతున్నారు. ఉధృతిని బట్టి మరో రెండు గేట్లు ఎత్తేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. సింగూరు పరీవాహక ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇరిగేషన్ అధికారులు హెచ్చరించారు. సంగారెడ్డి మండలం కల్పగూరులోని మంజీరా రిజర్వాయర్ నుంచి ఆరుగేట్లు ఎత్తి దిగువకు 60వేల క్యూసెక్కుల వరద నీటిని వదులుతున్నారు. నల్లవాగు ప్రాజెక్టు, నారింజ ప్రాజెక్టులు నీటితో నిండి ఉధృతంగాపారుతున్నాయి. మంజీరలో వరదనీరు వచ్చి చేరుతుండటంతో నదిపై నిర్మించిన సింగూరు ప్రాజెక్టు, మంజీర రిజర్వాయర్ గేట్లు ఎత్తి, దిగువన ఉన్న నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వరదనీరు వదులుతున్నారు. వర్షాలతో జిల్లాలోని 260 చెరువులు పూర్తిగా నిండి అలుగుపారుతున్నాయి. నారింజ ప్రాజెక్టు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో కర్ణాటక-తెలంగాణ మధ్య రాకపోకలు నిలిచాయి. నారాయణఖేడ్, అందోలు, సంగారెడ్డి, పటాన్చెరు, జహీరాబాద్ నియోజకవర్గాల్లో 200కుపైగా ఇండ్లు పాక్షికంగా కూలాయి.
99,865 ఎకరాల్లో పంటనష్టం
వర్షాలతో జిల్లాలోని 17 మండలాల్లో 99,865 ఎకరాల మేర పంటనష్టం జరిగింది. సిర్గాపూర్, జహీరాబాద్, మొగుడంపల్లి, న్యాల్కల్, ఝరాసంగం, కోహీర్, రాయికోడ్, మునిపల్లి, వట్పల్లి, సంగారెడ్డి, కంది, కొండాపూర్, సదాశివపట, కంగ్టి, నారాయణఖేడ్, న్యాల్కల్ మండలాల్లోని 45771 మంది రైతులకు చెందిన పంట దెబ్బతింది. మంజీర నది బ్యాక్వాటర్ కారణంగా నారాయణఖేడ్, జహీరాబాద్ నియోజకవర్గాల్లోని పత్తి, మొక్కజొన్న పంట నీటమునిగింది. 71235 ఎకరాల పత్తి, 7169 ఎకరాల కంది, 956 ఎకరాల పెసర, 12,241 ఎకరాల సోయాబీన్, 1082 ఎకరాల మినుము, 6746 ఎకరాల మొక్కజొన్న, 7 ఎకరాల జొన్న, 4 ఎకరాల్లో వరి, 5 ఎకరాల చెరుకు పంట దెబ్బతిన్నది. అలాగే, 419 ఎకరాల్లో ఇతర పంటలకు నష్టవాటిల్లింది. పంటనష్టం మరింత పెరగవచ్చని వ్యవసాయశాఖ అంటున్నది.
అలుగుపారుతున్న చెరువులు
సంగారెడ్డి జిల్లాలో మొత్తం 3140 చెరువులుండగా, వీటిలో 832 చెరువుల మంగళవారం అలుగుపారాయి. కొండాపూర్ మండలం మల్కాపూచ్ చెరువు, అందోలులోని పెద్దచెరువు, అన్నసాగర్ చెరువులు నిండి మత్తడి దుంకుతున్నాయి. సంగారెడ్డి ఇరిగేషన్ సర్కిల్ పరిధిలో 176, జహీరాబాద్ సర్కిల్లో 43, నారాయణఖేడ్లో 353, దౌల్తాబాద్ సర్కిల్లో 260 చెరువులు అలుగుపారుతున్నాయి. జిల్లాలోని 1163 చెరువులు పూర్తిగా నిండాయి. సంగారెడ్డి ఇరిగేషన్ సర్కిల్ పరిధిలో 748, జహీరాబాద్లో 145, నారాయణఖేడ్లో 22, దౌల్తాబాద్లో 248 చెరువులు పూర్తిగా నిండి నీటితో కళకళలాడుతున్నాయి. పటాన్చెరు నియోజకవర్గంలోని పలు చెరువులు నిండాయి. అమీన్పూర్, లక్డారం, చిట్కుల్లోని చెరువులు పూర్తిగా నిండి అలుగుపారుతున్నాయి.
తెలంగాణ-కర్ణాటక మధ్య నిలిచిన రాకపోకలు
భారీ వర్షాలతో కర్ణాటక-తెలంగాణ మధ్య రాకపోకలు నిలిచాయి. సోమవారం కురిసిన భారీ వర్షాలతో జహీరాబాద్ మండలం బూచినెల్లి శివారులోని నారింజవాగు ప్రాజెక్టు గేటుపై నుంచి నీళ్లు ప్రవహిస్తున్నాయి. కర్ణాటక-తెలంగాణ మధ్య రాకపోకల కోసం నిర్మించిన బ్రిడ్జి మునిగింది. దీంతో కర్ణాటక-తెలంగాణ మధ్య వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అత్యవసరంగా తెలంగాణకు రావాలనుకునే వారు 30కిలో మీటర్లు అదనంగా ప్రయాణించి, బీదర్ మీదుగా జహీరాబాద్కు చేరుకుంటున్నారు. కంగ్టి మండలం నాగూర్(కే) శివారులోని అంతర్రాష్ట్ర సరిహద్దులో ప్రజల రాకపోకలు నిలిచాయి. కర్ణాటక నుంచి తెలంగాణలో ప్రవేశించేందుకు నాగూరు(కే)-కర్ణాటకలోని సుంకనాల్ మధ్య ఉన్న రహదారి పూర్తిగా మునిగిపోయింది. కల్హేర్ నుంచి పిట్లం వెళ్లే దారి సైతం నీటమునిగింది.
ఉధృతంగా ప్రవహిస్తున్న మంజీరానది
హత్నూర/ కొల్చారం, సెప్టెంబర్ 28: మండల పరిధిలోని పలు గ్రామాల గుండా మంజీరానది ఉధృతంగా ప్రవహిస్తున్నది. భారీ వర్షాలు కురుస్తుండటంతో కొన్యాల-చౌటకూర్ మట్టిరోడ్డు పూర్తిగా బురదమయంగా మారింది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొల్చారం మండల పరిధిలోని వనదుర్గా ప్రాజెక్టుకు ఎగువ నుంచి వస్తున్న వరద పోటెత్తడంతో నిండుగా ప్రవహిస్తున్నది. దీంతో పోతంశెట్పల్లి నుంచి ఏడుపాయల వెళ్లే బ్రిడ్జిల వద్ద నీటిమట్టం పెరిగింది. ఈ బ్రిడ్జి వద్ద మంజీరా ప్రవాహాన్ని తహసీల్దార్ చంద్రశేఖర్రావు, ఎస్సై శ్రీనివాస్గౌడ్ పరిశీలించారు. నీటి మట్టం పెరుగుతుండటంతో రాకపోకలు నిలిపివేసి, ఏడుపాయలకు వెళ్లే భక్తులను పాపన్నపేట మండలం నాగసాన్పల్లి వైపు మళ్లించారు. వారివెంట గిర్దావర్ శ్రీహరి, పొలీసు సిబ్బంది రాజు, జయానంద్ తదితరులు ఉన్నారు.
అత్యధికంగా కంగ్టిలో 12 సెం.మీ
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలో అత్యధికంగా 12.1 సెం.మీ, అత్యల్పంగా సదాశివపేటలో 1.9 సెం.మీ. వర్షపాతం నమోదైంది. సంగారెడ్డి జిల్లాలో ఐదు మండలాల్లో 60 శాతానికి పైగా వర్షపాతం నమోదు కాగా, 13 మండలాల్లో 20 నుంచి 59 శాతం వర్షం పడింది. తొమ్మిది మండలాల్లో మాత్రం సాధారణ వర్షపాతం నమోదైంది. సిర్గాపూర్లో 6.7, నారాయణఖేడ్లో 6.6, రామచంద్రాపురంలో 5.9, పటాన్చెరులో 5.2, కల్హేర్లో 5.5 సెం.మీ. వర్షం కురిసింది. జిన్నారం, న్యాల్కల్ , రాయికోడ్ మండలాల్లో 5సెం.మీ. చొప్పున పడింది. మొగుడంపల్లి, ఝరాసంగం, మునిపల్లి, సంగారెడ్డి, గుమ్మడిదల, కంది, అమీన్పూర్ మండలాల్లో 4 నుంచి 4.9 సెం.మీటర్ల చొప్పన వర్షపాతం నమోదైంది. జహీరాబాద్, కోహీర్, వట్పల్లి, హత్నూర మండలాల్లో 3 సెం.మీ. వర్షం కురిసింది.
సిద్దిపేటలో 3.66 సెం.మీ
సిద్దిపేట, సెప్టెంబర్ 28 : సిద్దిపేట జిల్లాలో మంగళవారం 3.66 సెం. మీ. వర్షం కురిసింది. అత్యధికంగా దుబ్బాక మండలంలో 7.20 సెం. మీ., అత్యల్పంగా మద్దూరులో 1.26సెం.మీ. వర్షపాతం నమో దైంది. వర్గల్లో 4.86 సెం.మీ., సిద్దిపేట రూరలో ్ల4.90 సెం.మీ., చిన్నకో డూర్లో 4.29, బెజ్జంకిలో 6.76, కోహెడలో 4.93, హుస్నా బాద్లో 5.86, సిద్దిపేట అర్బన్లో 3.68, అక్కన్నపేటలో 2.72, నంగునూ ర్లో 2.24, తొగుటలో 3.34, మిరుదొడ్డిలో 5.97, దౌల్తాబాద్లో 3.82, రాయపోల్లో 2.79, ములుగులో 3.98, మార్కుక్ 2.48, జగదేవ్పూర్ 2.24, గజ్వేల్లో 3.68, కొండపాకలో 2.13, కొము రవెల్లిలో 2.15, చేర్యాలలో 1.45, ధూళిమిట్టలో 1.30, నారాయ ణరావుపేటలో 3.70 సెం.మీ. వర్షం పడినట్లు అధికారులు తెలిపారు.
మెదక్ జిల్లాలో 62.38 మి.మీ
మెదక్ జిల్లాలో సోమవారం రాత్రి వరకు 62.38 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. తూప్రాన్ మండలంలో అత్యధికంగా 115.8 మి.మీటర్లు, నిజాంపేట మండలంలో 83.3 మి.మీటర్లు, మాసాయిపేట మండలంలో 80.3 మి.మీ వర్షపాతం నమోదు కాగా, చేగుంటలో 78.3, మనోహరాబాద్లో 73.7, టేక్మాల్లో 73.6 మి.మీ, నార్సింగి మండలంలో 71.0 మి.మీ, పెద్దశంకరంపేటలో 50.8 మి.మీ, అల్లాదుర్గంలో 58.4 మి.మీ రామాయంపేటలో 54.0 మి.మీ, నర్సాపూర్లో 59.5 మి.మీ, శివ్వంపేటలో 55.6 మి.మీ, కొల్చారంలో 52.0 మి.మీ, మెదక్లో 55.1 మి.మీ, చిన్నశంకరంపేటలో 59.2 మి.మీ, హవేళీఘణాపూర్లో 60.4 మి.మీ, పాపన్నపేటలో 64.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.