బండి సంజయ్కు ఎమ్మెల్యే రసమయి డిమాండ్
బెజ్జంకి, సెప్టెంబర్ 25: బెజ్జంకి మండలానికి నిధులు ఇవ్వని కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండలంలో అడుగుపెట్టే అర్హత ఉందా అని రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మన్, మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ సవాల్ విసిరారు. శనివారం మండ ల కేంద్రంలో రూ.40 లక్షలతో నిర్మించే సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడు తూ.. ఎంపీ నిధులతో మండలంలో చేసేంది ఏమిటో చెప్పాలన్నారు. ఎమ్మెల్యేగా మండలంలో ఇంత అభివృద్ధి పనులు చేస్తున్నా, ప్రజలపై అంత ప్రేమ ఉంటే మండలానికి రూ.200 కోట్లు తీసుకురావాల్సిన బాధ్యత బండిపైన లేదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ నాయకులు బూతులు మాట్లాడుతున్నారని, అభివృద్ధి, ఇచ్చిన హామీలపై ప్రశ్నిస్తే జవాబు చెబుతామని, అసభ్యకరంగా మాట్లాడితే నాలుకలు కోస్తామని హెచ్చరించారు. ప్రతిపక్ష పార్టీ నాయకులు అభివృద్ధికి సహకరించాలే తప్ప, అసత్య ప్రచారాలు చేస్తే సహించేదిలేదన్నారు.స్టేడియంలో పూర్తి స్థాయిలో మరమ్మతు చేయాలనే ఆలోచనతో రూ.2 కోట్లు, బెజ్జంకి శ్రీలక్ష్మీనరసింహాస్వామి ఆలయ నిర్మాణానికి రూ.2 కోట్లు కేటాయించామని వివరించారు. ఆదర్శ మండలంగా తీర్చిదిద్దేందుకు నిధులు కేటాయించిన ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్రావుకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పార్టీ మండలాధ్యక్షుడిగా ఎన్నికైన మహిపాల్రెడ్డి, ఇతర కమిటీల సభ్యులను ఎమ్మెల్యే సన్మానించారు. యూత్ అధ్యక్షుడిగా బిగుళ్ల మోహన్, బీసీ సెల్ అధ్యక్షుడిగా చెప్యాల సంతోష్, మహిళా విభాగం అధ్యక్షురాలిగా తిరుమల, విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా మహేశ్, మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా బాబుమియాను ఎమ్మెల్యే రసమయి ప్రకటించారు. ఎంపీపీ లింగాల నిర్మల, జడ్పీటీసీ కనగండ్ల కవిత, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మహిపాల్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజయ్య, వైస్ చైర్మన్ లక్ష్మారెడ్డి, పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.