సంగారెడ్డి, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ) : సంగారెడ్డి జిల్లాలో సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాల పనులు త్వరలోనే ప్రారంభించి సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయించుకునే బాధ్యత మీదేనని సీఎం కేసీఆర్ మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యేలకు సూచించారు. ఆర్థిక మంత్రి హరీశ్రావు నేతృత్వంలో ఎమ్మెల్యే క్రాంతికిరణ్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు శాసనసభలో సీఎం కేసీఆర్ను శుక్రవారం కలిశారు. సంగారెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేసే సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతలకు పరిపాలనా అనుమతులు ఇవ్వడంపై మంత్రి హరీశ్రావు, ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్కు జిల్లా ప్రజలు, రైతుల పక్షాన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. సంగారెడ్డి జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో లక్షల ఎకరాలకు సాగునీరందించే బృహత్తర యజ్ఞంలో భాగస్వాములు అవుతున్నందుకు జిల్లా ఎమ్మెల్యేలను అభినందించారు. పనులు ప్రారంభించాక త్వరగా పూర్తయ్యేలా చూసుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలదే అని ముఖ్యమంత్రి సూచించారు. మంత్రి హరీశ్రావు అనుభవాన్ని వాడుకోవాలని, ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేసుకుంటూ, సమన్వయంతో పనులు పూర్తి చేసుకోవాలని ఎమ్మెల్యేలకు సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు క్రాంతికిరణ్, భూపాల్రెడ్డి, మాణిక్రావు సీఎం కేసీఆర్తో మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లా సాగునీటి విషయంలో తీవ్ర వివక్షకు గురైందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులపై మీకున్న ప్రేమ, దీర్ఘదృష్టి ఫలితంగా సంగారెడ్డి జిల్లా సస్యశ్యామలం కాబోతోందని తెలిపారు. నిధులు, జలాలు, పరిపాలనా అనుమతులు మంజూ రు చేసినందుకు వారు సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.