సంగారెడ్డి కలెక్టరేట్, సెప్టెంబర్20 : ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ఆయా శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సంగారెడ్డి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావు కోరారు. సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి అర్జీదారులు తరలివచ్చారు. ఆయా అర్జీలను జిల్లా అదనపు కలెక్టర్లు రాజర్షీ షా, వీరారెడ్డిలతో కలిసి కలెక్టర్ స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. సంబంధిత శాఖల అధికారులు అర్జీదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. ధరణి భూ సమస్యలు, పింఛన్లు రైతుబీమా, ఉద్యోగాలు కల్పించాలని, ఆర్థిక సహాయం అందజేయాలని కోరుతూ ప్రజలు తమ అర్జీలను అందజేశారు. వివిధ సమస్యలపై మొత్తం 53 అర్జీలు అందాయి. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
వరం విక్రయ కేంద్రాన్ని ప్రారంభం..
రైతు ఉత్పత్తుల కోసం వరం విక్రయ కేంద్రాన్ని సోమవారం కలెక్టరేట్ ఆవరణలో కలెక్టర్ హనుమంతరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జిల్లాలోని వరం రైతు ఉత్పత్తిదారుల పరస్పర సహకార సంఘాన్ని రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలపాలని ఆకాంక్షించారు. రైతులు తాము పండించిన ధాన్యాన్ని నేరుగా అమ్ముకునేందుకు ప్రజలు ఎక్కువగా రద్దీగా ఉండే ప్రాంతాల్లో స్టాళ్లను ఏర్పాటు చేయడం హర్షనీయమన్నారు. మంత్రి హరీశ్రావు కంది పప్పు మిల్లును వరం కోసం మంజూరు చేశారని కలెక్టర్ తెలిపారు. అందుకు కావాల్సిన స్థలం కూడా కేటాయించామన్నారు. ఇకపై ప్రతి సోమవారం కలెక్టరేట్ ఆవరణలో వరం ఉత్పత్తుల విక్రయ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వీరారెడ్డి, వ్యవసాయ శాఖ అధికారి నర్సింహారావు, సహాయ సంచాలకురాలు హరిత, చైర్మన్ వీరారెడ్డి, ప్రధాన బోర్డు సభ్యులు ఆనంద్, నరేశ్, వ్యవసాయ శాఖ ఆత్మ, వరం సిబ్బంది పాల్గొన్నారు.
‘సింగూరు’కు అనుమతించొద్దు..
మునిపల్లి, సెప్టెంబర్ 20 : సింగూరు ప్రాజెక్టుపైకి పర్యాటకులకు అనుమతించొద్దని సంబంధిత అధికారులకు కలెక్టర్ హనుమంతరావు సూచించారు. సోమవారం మండలంలోని బుసారెడ్డిపల్లి శివారులోని సింగూరు ప్రాజెక్టును కలెక్టర్ కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సింగూరు ప్రాజెక్టులో నీరు ఎక్కువగా ఉండడంతో పర్యాటకులకు అనుమతులు ఇవ్వొద్దన్నారు. బుసారెడ్డిపల్లిలో గల మిషన్ భగీరథ పంపుహౌస్ను కలెక్టర్ సందర్శించారు.