తెలంగాణ ప్రభుత్వం రైతును రాజు చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నది. పెట్టుబడి సాయం నుంచి పంట కొనుగోలు కేంద్రాల ఏర్పాటు వరకు ప్రభుత్వమే చేపడుతూ రైతులకు బాసటగా నిలుస్తున్నది. ఇటీవల వానకాలం వడ్లను కొనమని కేంద్ర ప్రభుత్వం కొర్రీలు పెట్టినా.. సీఎం కేసీఆర్ రైతుల పక్షాన నిలుస్తూ రాష్ట్ర ప్రభుత్వమే వడ్లను కొనుగోలు చేస్తుందని ప్రకటిస్తూ కేంద్రాల ఏర్పాటుకు ఆదేశించారు. దీంతో రైతులకు ధీమా ఏర్పడింది. కాగా, యాసంగి సాగుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. ముందు జాగ్రత్తగా ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచుతున్నది. అధికారుల అంచనా ప్రకారం సంగారెడ్డి జిల్లాలో 1.42 లక్షల ఎకరాల్లో పంటల సాగుకానుండగా, ఆ మేరకు 32,199 టన్నుల ఎరువులు, అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచనున్నారు. వ్యవసాయశాఖ అధికారులు యాసంగి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు.
సంగారెడ్డి అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ) : వ్యవసాయశాఖ యాసంగి సన్నద్ధతపై దృష్టి పెట్టింది. రైతులు త్వరలోనే యాసంగి పంట సాగు ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా వ్యవసాయశాఖ రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులు సమకూర్చుటంపై దృష్టి సారించింది. రైతులకు అవసరమైన అన్నిరకాల ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. వ్యవసాయశాఖ అధికారులు సమాచారం మేరకు ఈనెల చివరి నుంచి యాసంగి సాగు ప్రారంభమవుతుంది. వానకాలం సీజన్లో పెసర, మినుము తదితర ఆరుతడి పంటలు వేసిన రైతులు పంట చేతికి రావటంతో యాసంగి సాగుకు సిద్ధం అవుతున్నారు. యాసంగిలో పంటలు వేసేందుకు రైతులు దుక్కులు దున్నటం ప్రారంభించారు. వ్యవసాయశాఖ అధికారుల సమాచారం మేరకు సంగారెడ్డి జిల్లాలో యాసంగి సీజన్(2021-22)లో 1,42,240 ఎకరాల్లో పంటలు సాగు అవుతాయని అంచనా వేశారు. కాలం కలిసొస్తే పంటల సాగు 2 లక్షల ఎకరాల వరకు చేరుకునే అవకాశం ఉంటుంది. కాగా, యాసంగి సీజన్లో రైతులు 69,690 ఎకరాల్లో వరి, 20,684 ఎకరాల్లో జొన్న, 34,644 ఎకరాల్లో శనగ, 1329 ఎకరాల్లో మొక్కజొన్న, 3316 ఎకరాల్లో వేరుశనగ, 2621 ఎకరాల్లో కుసుమ, 1875 ఎకరాల్లో పొద్దు తిరుగుడు పంటలు సాగు చేస్తారని అంచనా. వీటితోపాటు 1173 ఎకరాల్లో గోధుమ, 83 ఎకరాల్లో కంది, 518 ఎకరాల్లో నువ్వులు, 6390 ఎకరాల్లో ఇతర పంటలను రైతులు సాగు చేస్తారని వ్యవసాయశాఖ అంచనా వేస్తున్నది. యాసంగిలో రైతులు సాగు చేయనున్న శనగ, వేరుశనగ, పొద్దు తిరుగుడు, వరి తదితర విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. అలాగే పంటల సాగుకు రైతులకు అవసరమయ్యే ఎరువులను సిద్ధంగా ఉంచుతున్నారు.
రైతులకు అందుబాటులో విత్తనాలు, ఎరువులు..
యాసంగిలో రైతులకు అవసరమయ్యే విత్తనాలు, ఎరువులను వ్యవసాయశాఖ అధికారులు అందుబాటులో ఉంచుతున్నారు. యాసంగి సీజన్ 2021-22లో రైతులకు 32,199 టన్నుల ఎరువులు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేశారు. 13,560 టన్నుల యూరియా, 3580 టన్నుల డీఏపీ(డై అమ్మోనియం ఫాస్పేట్), 3147 టన్నుల ఎంవోపీ(పొటాష్), 10840 కాంప్లెక్స్ ఎరువులు, 1072 టన్నుల సింగిల్ సూపర్ పాస్పేట్ ఎరువులను వ్యవసాయశాఖ యాసంగిలో సమకూర్చనుంది. యాసంగిలో 37.51 క్వింటాళ్ల పొద్దు తిరుగుడు విత్తనాలు, 866 క్వింటాళ్ల శనగ, 10.38 క్వింటాళ్ల నువ్వులు, 827 క్వింటాళ్ల జొన్న, 104 క్వింటాళ్ల పొద్దు తిరుగుడు, 106 క్వింటాళ్ల మొక్కజొన్న, 17422 క్వింటాళ్ల వరి విత్తనాలు అవసరం అవుతాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది.