జహీరాబాద్, సెప్టెంబర్ 19 : వానకాలం పంటల సాగు ముగిసింది. పెసర, మినుము, సోయా పంటలు కోతలు ముగింపునకు వచ్చాయి. అక్టోబర్లో యాసంగి పంటల సాగు చేసేందుకు అన్నదాతలు భూములు సిద్ధం చేస్తున్నారు. నెల రోజులు సమయం లేకపోవడంతో రైతులు వానకాలం పంటలు తీసుకోని యాసంగి పంటలు సాగు చేసేందుకు భూములు సిద్ధం చేస్తున్నారు. యాసంగిలో రైతులు శనగ, జొన్న, కుసుమతోపాటు వ్యవసాయ బావుల వద్ద ఆలుగడ్డ, గోధుమ, సాగు అధికంగా చేస్తారు. జహీరాబాద్ డివిజన్లోని కోహీర్, జహీరాబాద్, మొగుడంపల్లి, న్యాల్కల్, ఝరాసంగం మండలంలో రైతులు వ్యవసాయ బావులు, బోరుల వద్ద ఆలుగడ్డ అధికంగా సాగు చేస్తారు. రైతులు ఢిల్లీ, ఆగ్రా వెళ్లి విత్తనాలు తెచ్చుకుంటారు.
ఆరుతడి పంటలు సాగు వైపు రైతులు
యాసంగిలో రైతులు ఆరుతడి పంటలు సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. యాసంగిలో పంటల సాగు.. విత్తనాలు, ఎరువులు ఎంత అవసరమో ప్రణాళిక సిద్ధం చేశారు. రైతులకు అవసరమైన ఎరువులు, పురుగుల మం దులు, యంత్ర పరికరాలు, విత్తనాలు సరఫరా చేసేందుకు వ్యవసాయ శాఖ అధికారులు సన్నద్ధమవుతున్నారు. అక్టోబర్ మొదటి వారంలో సీజన్ ప్రారంభం కానుండటంతో అన్నదాతలు సమాయత్తమవుతున్నారు. సాగుకు అవసరమైన డీఏడీ, యూరియా, కాంప్లెక్స్ ఎరువులు అందుబాటులో ఉంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆరుతడి పంటలు సాగు చేసేందుకు రైతులు పెసరా, మినుము, సోయా పంటలు తీసుకోని దుక్కలు దున్ని సిద్ధం చేస్తున్నారు. గతేడాది కంటే యాసంగిలో ఆరుతడి పంటల సాగు పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
ఆలుగడ్డ సాగు కోసం దక్కులు దున్ని సిద్ధం..
జహీరాబాద్ డివిజన్లో యాసంగిలో రైతులు వ్యవసాయ బోరు, బావుల వద్ద అధికంగా ఆలుగడ్డ సాగు చేస్తారు. ఆలుగడ్డ సాగు చేసేందుకు విత్తనాల కోసం ఢిల్లీ, యూపీ రాష్ర్టాలకు రైతులు వెళ్లి విత్తనాలు కొనుగోలు చేస్తారు. పెద్ద రైతులు ఆలుగడ్డ విత్తనాలను కొనుగోలు చేసి లారీలో తీసుకొస్తారు. చిన్న రైతులు దళారుల వద్ద ఆలుగడ్డ విత్తనాలు కొనుగోలు చేసి సాగు చేస్తారు. అక్టోబర్ మొదటి వారంలో విత్తనాలు చేసేందుకు రైతులు దుక్కులు దున్ని సిద్ధం చేసుకుంటున్నారు. వానలు తగ్గిపోగానే విత్తనాలు వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.