మెదక్, సెప్టెంబర్ 18 : 2022 జనవరిలో ఓటరు తుది జాబితా ప్రకటించే నాటికి ఎలాంటి తప్పిదాలు లేకుండా జాబితాను సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్గోయల్ కలెక్టర్లకు సూచించారు. శనివారం హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓటరు జాబితాలో ఎలాంటి తప్పులు లేకుండా సవరణ, మార్పులు, చేర్పులు చేపట్టి ఈ నెల 30లోగా పరిష్కరించాలని సూచించారు. నవంబర్ నాటికి డ్రాఫ్ట్ పబ్లికేషన్ జారీ చేసేముందు చనిపోయిన, నకిలీ ఓటర్ల పేర్లు తొలిగించాలన్నారు. పోలింగ్ కేంద్రాలను రేషనైలేజేషన్ చేస్తూ ఒక పోలింగ్ కేంద్రం ఏర్పాటుకు గుర్తించాలన్నారు. స్విప్ కార్యక్రమంలో భాగంగా గ్రామస్థాయి వరకు ఓటరు నమోదుపై ప్రజలకు అవగాహన కల్పించాలని కలెక్టర్లకు సూచించారు. ఓటరు ఎపిక్ కార్డులకు సంబంధించి 1636 మంది దరఖాస్తు చేసుకోగా, 949మంది కార్డులను డౌన్ లోడ్ చేసుకున్నారని కలెక్టర్ హరీశ్ తెలిపారు. ఈవీఎం, వీవీ ప్యాట్లను భద్రపర్చడానికి ఏర్పాటు చేసిన గోదాములో అదనంగా ఒక హాల్ నిర్మించడానికి రూ.53లక్షలతో పంపిన ప్రతిపాదనలు మంజూరు చేయాలని కలెక్టర్ కోరారు.
విద్యార్థులకు అవగాహన కల్పించాలి
17,18 ఏండ్ల వయస్సు కలిగి ఉన్నత పాఠశాలలు, కళాశాలలో చదువుతున్న విద్యార్థులు ఓటరుగా పేరు నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలని కలెక్టర్ హరీశ్ అధికారులకు సూచించారు. ప్రతిఓటరు ఓటువేసేలా అవగాహన కల్పించాలని స్విప్ నోడల్ అధికారి రాజిరెడ్డికి సూచించారు. ఎన్నికల సంఘం బూత్స్థాయి అధికారులకు ఉపయుక్తంగా రూపొందించిన మొబైల్ గరుడ యాప్పై త్వరలో బూత్స్థాయి అధికారులకు శిక్షణ ఇస్తామని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా గోడపత్రిక పుస్తకాలను ఆవిష్కరించారు. వీడి యో కాన్ఫరెన్స్లో అదనపు కలెక్టర్ రమేశ్, ఆర్డీవో సాయి రాం, స్విప్ నోడల్ అధికారి రాజిరెడ్డి పాల్గొన్నారు.
పెండింగ్ దరఖాస్తులను పరిష్కరించాలి
సంగారెడ్డి కలెక్టరేట్, సెప్టెంబర్ 18 : ఓటరు జాబితాలోని లాజికల్ ఎర్రర్స్, ఫామ్ 6, 6ఏ, 7, 8, 8ఏ పెండింగ్ దరఖాస్తులను ఈ నెల 30లోగా పరిష్కరించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ సూచించారు. శనివారం హైదరాబాద్ నుంచి నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ఈ రోల్ మేనేజ్మెంట్, డ్రాఫ్ట్ పబ్లికేషన్, రేషనలైజేషన్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్, స్వీఫ్ యాక్టివిటీస్ తదితర అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా శశాంక్ గోయల్ మాట్లాడుతూ నాన్ ఫొటో ఓటర్ల జాబితాను సవరించాలన్నారు. ఒక పోలింగ్ కేంద్రంలో 1500కు పైగా ఓటర్లు ఉంటే అదనంగా కొత్త పోలింగ్ కేంద్రాలను గుర్తించాలన్నారు.
ఓటరు జాబితాను సరిచేసుకోవాలి
జిల్లాలోని ఆర్డీవోలు, సంబంధిత సిబ్బందితో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించిన సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు జిల్లాలో చేపట్టాల్సిన చర్యలను వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ డివిజనల్ అధికారులు, సంబంధిత సిబ్బందికి పలు సూచనలు చేశారు. సమావేశంలో ఆర్డీవోలు నగేశ్, రమేశ్బాబు, అధికారులు వెంకటేశ్, పాషా, తహసీల్దార్లు పాల్గొనారు.