కంది, సెప్టెంబర్ 18 : సాధించాలనే తపన ఉంటే ఏదైనా సులభమని మరోసారి తేల్చి చెప్పిం ది సంగారెడ్డి జిల్లాకు చెందిన విద్యార్థి.. మారుమూల గ్రామంలో చదివినా, చదువుపై ఆమెకు ఉన్న ఆసక్తి ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రశంసలు అందుకునే స్థాయికి చేర్చింది. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ప్రవేశ పరీక్ష 2021(డీఈఈ సెట్లో) సంగారెడ్డి జిల్లా కంది మండలం ఆరుట్లకు చెం దిన కుమ్మరి కావ్య మెరిసింది. శనివారం ఫలితాలు విడుదల కాగా, ఆమె రాష్ట్రస్థాయిలో రెండో స్థానం సాధించింది. దీంతో స్వగ్రామంలో ఆనంద వాతావరణం నెలకొంది.
మధ్యతరగతి కుటుంబం నుంచి..
సంగారెడ్డి జిల్లా కంది మండలం ఆరుట్ల గ్రామానికి చెందిన కుమ్మరి వెంకటేశం- మాధవి దంపతులది మధ్య తరగతి కుటుంబం. వెంకటేశం హత్నూర మండలం గుండ్ల మాచ్నూర్లోని అరబిందో ఫ్యాక్టరీలో పని చేస్తుండగా, మాధవి గృహణి. వీరికి కూతురు, ఇద్దరు కొడుకులున్నారు. పెద్ద కొడుకు అరవింద్ ప్రస్తుతం సంగారెడ్డిలో ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదువుతుండగా, రెండో కొడుకు మహేందర్ సంగారెడ్డిలోనే 9వ తరగతి చదువుతున్నాడు. కూతురు కావ్య సంగారెడ్డిలోని కృష్ణవేణి పాఠశాలలో పదో తరగతి వరకు చదివి, 9.5 జీపీఏ సాధించింది. ఆ తర్వాత సంగారెడ్డిలోని ఎస్వీ జూనియర్ కళాశాలలో ఇం టర్ (ఎంపీసీ)లో 968 మార్కులు సాధించి తన ప్రతిభను చాటుకున్నది. డీఈఈ సెట్ ప్రవేశ పరీక్షలో కావ్య రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు సా ధించి జిల్లాకే మంచి పేరు తెచ్చి పెట్టింది. దీంతో ఆమె చదువులో ఉన్న పట్టుదల, నైపుణ్యాన్ని స్థానిక గ్రామస్తులతో పాటు ఇతర ప్రజాప్రతినిధులు, అధ్యాపక బృం దం సభ్యులు అభినందనలతో ముంచెత్తుతున్నారు. ఈ సందర్భంగా కావ్యను ‘నమస్తే తెలంగాణ’ పలకరించగా, గతంలో ఎంసెట్ పరీక్ష రాశానని, ఆశించిన మార్కులు రాకపోవడంతో ప్రస్తు తం డీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నానని చెప్పింది. ఏదైనా ఒక మంచి రంగంలో ఉన్నత స్థాయిలో నిలవాలన్నదే తన అంతిమ లక్ష్యమని పేర్కొంది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఈ స్థాయికి ఎదిగానని గర్వంగా చెప్పింది. కావ్య ఎంట్రెన్స్ పరీక్షలో రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంకు సాధించడంతో ఆమె కుటుంబ సభ్యులు స్వగ్రామంలో సంబురాలు చేసుకున్నారు.