స్వరాష్ట్రంలో ‘మెతుకుసీమ’ సాగు చిత్రం మారుతున్నది… కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో గోదావరి జలాలు ఉమ్మడి మెదక్ జిల్లాలో సందడి చేస్తున్నాయి. కాగా, గోదావరి జలాలు సంగారెడ్డి జిల్లాకు తరలించాలన్న సీఎం కేసీఆర్ సంకల్పం త్వరలో నెరవేరనున్నది. ఫలితంగా ఇక్కడి రైతుల దశాబ్దాల కల సాకారం కానున్నది. సంగారెడ్డి జిల్లాలో 5.55 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాల ద్వారా 3.84 లక్షల ఎకరాలకు, మల్లన్నసాగర్ కెనాల్ ద్వారా 1.32 లక్షల ఎకరాలకు, సంగారెడ్డి కెనాల్ ద్వారా 39వేల ఎకరాలకు కాళేశ్వరం జలాలు అందనున్నాయి. కాగా, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సింగూరు ప్రాజెక్టు ద్వారా 40వేల ఎకరాలు సాగునీరు అందజేస్తున్నది. నల్లవాగు ప్రాజెక్టు ద్వారా 6వేల ఎకరాలకు, మంజీరాపై చెక్డ్యామ్ల నిర్మాణంతో 7వేల ఎకరాలకు, నదిపై 15 లిఫ్టుల ద్వారా 11వేల ఎకరాలకు సాగునీరు అందజేస్తున్నారు. ఇదీ కాకుండా జిల్లాలోని 3140 చెరువుల ద్వారా 1,42,000 ఎకరాలకు ఆయకట్టు ఉంది. దీంతో మొత్తంగా సంగారెడ్డి జిల్లాలో 7,61,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందుతున్నది.
సంగారెడ్డి, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ) : సీఎం కేసీఆర్ స్వప్నం సంగారెడ్డి జిల్లా రైతులకు వరంగా మారనుంది. గోదావరి జలాలు జిల్లాకు తరలించాలన్న ముఖ్యమంత్రి సంకల్పం త్వరలో నెరవేరనుంది. ఫలితంగా జిల్లా రైతుల దశాబ్దాలకల సాకారం కానుంది. గోదావరి జలాల రాకతో జిల్లాలో 5.55 లక్షల ఎకరాలకు సాగునీరు అందనున్నది. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాల ద్వారా 3.84 లక్షల ఎకరాలకు సాగునీరు అందనున్నది. మల్లన్నసాగర్ కెనాల్ (ప్యాకేజీ 17,18,19, 19ఎ) ద్వారా జిల్లాలోని 1.32 లక్షల ఎకరాలకు సాగునీరు అందజేయనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఆయకట్టు కింద సంగారెడ్డి కెనాల్ ద్వారా సంగారెడ్డి, పటాన్చెరు నియోజకవర్గాల్లోని 39వేల ఎకరాలకు సాగునీరు అందనున్నది. గోదావరి జలాల తరలింపు ద్వారా సంగారెడ్డి జిల్లాలో అదనంగా 5.55 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనున్నది. జిల్లాలో ఇది వరకే ప్రభుత్వం సింగూరు ప్రాజెక్టు ద్వారా 40 వేల ఎకరాలు సాగునీరు అందజేస్తున్నది. నల్లవాగు ప్రాజెక్టు ద్వారా 6వేల ఎకరాలకు, మంజీరాపై చెక్డ్యామ్ల నిర్మాణంతో 7వేల ఎకరాలకు సాగునీరు అందుతున్నది. జిల్లాలోని మంజీరా నదిపై 15 లిఫ్టుల ద్వారా 11వేల ఎకరాలకు సాగునీరు అందజేస్తున్నారు. ఇది కాకుండా జిల్లాలోని 3140 చెరువుల ద్వారా 1,42,000 ఎకరాలకు ఆయకట్టు ఉంది. మొత్తంగా జిల్లాలో 7,61,000 ఎకరాలకు ఆయకట్టుకు సాగునీరు అందుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లాలోని సింగూరు ప్రాజెక్టు ద్వారా 40వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వడంలో అప్పటి ప్రభుత్వాలు విఫలమయ్యాయి. స్వరాష్ట్రంలో, సీఎం కేసీఆర్ పాలనలో సంగారెడ్డి జిల్లాలో సాగునీటిరంగంలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి.
సీఎం కేసీఆర్ దూరదృష్టి, రైతుల పక్షపాత వైఖరికారణంగా జిల్లాలోని 7.61లక్షల ఎకరాలు సాగునీరు అందనున్నది. వ్యవసాయం రంగంతోపాటు వ్యవసాయ అనుబంధ రంగాల ద్వారా ప్రజలకు మేలు చేకూరనుంది. ఫలితంగా జిల్లా అభివృద్ధి బాటలో మరింత ముందుకు సాగనుంది. సీఎం కేసీఆర్ సాగునీటి రంగానికి పెద్దపీట వేయడంతోపాటు జిల్లాకు గోదావరి జలాలను తరలించనుండటంతో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.
నాడు నిర్లక్ష్యం.. కేసీఆర్ పాలనలో సాగునీరు సాక్షాత్కారం..
ఉమ్మడి రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లాలోని సాగునీటి రంగం పూర్తిగా వివక్షకు గురైంది. జిల్లాలోని ఏకైక సాగునీటి ప్రాజెక్టు ద్వారా 40వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వాల్సి ఉండగా, ఉమ్మడి రాష్ట్రంలోని ప్రభుత్వాలు ఏనాడు సాగునీరు ఇవ్వకపోగా, సింగూరు ప్రాజెక్టులోని జలాలు పూర్తిగా హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం వినియోగించుకున్నారు. జిల్లా రైతాంగం సాగునీటి కోసం పోరాటాలు చేసినా అప్పటి ప్రభుత్వాలు రైతులను పట్టించుకోలేదు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో హరీశ్రావు జిల్లా నాయకులు పలు సందర్భాల్లో సింగూరు జలాల సాధన, మైనర్ ఇరిగేషన్కు నిధుల కోసం ఆందోళనలు చేపట్టారు. అయినా ఉమ్మడి రాష్ట్రంలోని ప్రభుత్వాలు కనికరం చూపలేదు. స్వరాష్ట్రంలోని సంగారెడ్డి జిల్లా రైతుల సాగునీటి కష్టాలు తీరుతాయని, ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో పలు సందర్భాల్లో సీఎం కేసీఆర్ చెప్పారు. స్వరాష్ట్రం సిద్ధ్దించిన వెంటనే సీఎం కేసీఆర్ మొదటగా సింగూరు ప్రాజెక్టు ద్వారా 40వేల ఎకరాలు సాగునీరు అందజేశారు. ఇందుకోసం సింగూరు ప్రాజెక్టుల కాల్వల పునరుద్ధరణకు నిధులు అందజేశారు. మంత్రి హరీశ్రావు ప్రత్యేక చొరవ తీసుకుని సింగూరు ప్రాజెక్టు ద్వారా అందోలునియోజకవర్గంలోని 40వేల ఎకరాలకు సాగునీరు అందేలా చూశారు. జిల్లాలోని నల్లవాగు ప్రాజెక్టు పునరుద్ధరణ చర్యలు తీసుకున్నారు. కాల్వల మరమ్మతులు చేపట్టారు. ఫలితంగా నల్లవాగు ప్రాజెక్టు నిండ 6వేల ఆయకట్టుకు సాగునీరు అం దుతుంది. సీఎం కేసీఆర్ మంజీరా నదిపై చెక్డ్యామ్లు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో మంజీరా ప్రాజెక్టు దిగవన చెక్డ్యామ్లు నిర్మించారు. చెక్డ్యామ్ల ద్వారా సంగారెడ్డి జిల్లాలోని 7వేల ఎకరాలకు సాగునీరు అందుతుంది. ఇది కాకుండా మిషన్కాకతీయ ద్వారా జిల్లాలోని 3140 చెరువులను పునరుద్ధరించి ఆయకట్టుకు సాగునీరు అందేలా చేశారు. మిషన్కాకతీయ ద్వారా చెరువుల పునరుజ్జీవం కల్పించడంతో జిల్లాలోని 1.42 లక్షల ఎకరాలు ఆయకట్టుకు సాగునీరు అందుతుంది. సీఎం కేసీఆర్ ప్రభుత్వ చర్యలతో జిల్లాలోని 2.06 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది.
గోదావరి జలాలతో 5.55 లక్షల ఎకరాలకు సాగునీరు..
సీఎం కేసీఆర్ మల్లన్నసాగర్ ద్వారా గోదావరి జలాలను తరలించి సింగూరు ప్రాజెక్టును నింపి రైతులకు సాగునీరు ఇవ్వాలని సీఎం కేసీఆర్ తలపెట్టారు. ఆ మేరకు మల్లన్నసాగర్ కెనాల్, సంగారెడ్డి కెనాల్కు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. దీంతో పాటు సింగూరు బ్యాక్ వాటర్ను ఎత్తిపోసి సంగారెడ్డి, అందోలు, నారాయణఖేడ్, జహీరాబాద్ నియోజకవర్గాల్లోని భూములు సాగునీరు అందించేందుకు సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు రూపకల్ప చేశారు. మల్లన్నసాగర్ కెనాల్ ప్యాకేజీ 17, 18, 19, 19 ఏ ద్వారా అందోలు, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లో 1.32 లక్షల ఎకరాలకు సాగునీరు అందజేయనున్నారు. ప్రస్తుతం 17, 18,19 ప్యాకేజీ పనులు చురుగ్గా సాగుతున్నాయి. ప్రధాన కాల్వల, టన్నెల్, పిల్ల కాల్వల పనులు సాగుతున్నాయి. 19ఏ ప్యాకేజీకి సంబంధించి పనులు ప్రారంభ మయ్యాయి. త్వరలోనే మల్లన్నసాగర్ కెనాల్ పనులు పూర్తి చేయనున్నారు. సంగారెడ్డి, పటాన్చెరు నియోజకవర్గాల్లో 39వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు సంగారెడ్డి కెనాల్కు శ్రీకారం చుట్టారు. మల్లన్నసాగర్ నుంచి సంగారెడ్డిలోని మహబూబ్సాగర్ చెరువు వరకు గోదావరి జలాలను తీసుకువచ్చి పటాన్చెరు, సంగారెడ్డి నియోజకవర్గాల్లోని 39వేల ఎకరాలకు గోదావరి జలాలను అందజేయనున్నారు. సింగూరు బ్యాక్వాటర్ నుంచి గోదావరి జలాలను ఎత్తిపోసి 3.84 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు సీఎం కేసీఆర్ సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు శ్రీకారం చుట్టారు. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకం పనులు కోసం రూ.4474 కోట్ల నిధులను కేటాయించింది. త్వరలోనే టెండర్లు ఆహ్వానించి నిర్మాణం పనులు చేపట్టనున్నారు.
సంగమేశ్వర ఎత్తిపోతల పథకం ద్వారా సింగూరు ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపోసి జహీరాబాద్, సంగారెడ్డి, అందోలు నియోజకవర్గాల్లోని 2.19 లక్షల ఎకరాలకు సాగునీరు అందజేయనున్నారు. బసవేశ్వర ఎత్తిపోతల పథకం ద్వారా నారాయణఖేడ్, అందోలు నియోజకవర్గాల్లోని 1.65 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వనున్నారు. రాబోయే రెండేళ్లలోపు సంగమేశ్వ, బసవేశ్వర ఎత్తిపోతల పథకం పనులు పూర్తి చేసే అవకాశం ఉంది. రెండు ఎత్తిపోతల పథకాలు పనులు పూర్తయితే సంగారెడ్డి, అందోలు, నారాయణఖేడ్, జహీరాబాద్ నియోజకవర్గాలు గోదావరి జలాలతో సస్యశ్యామలం కానున్నాయి. గోదావరి జలాలను సంగారెడ్డి తరలించి ఇక్కడ భూములను సస్యశ్యాలం చేయతలపెట్టిన రైతుబాంధవు సీఎం కేసీఆర్కు జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజలు, రైతులు ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నారు.