సంగారెడ్డి జిల్లాలో త్వరలో గోదారమ్మ పరుగులు పెట్టనున్నది. జిల్లాకు గోదావరి జలాలు తరలించాలన్న సీఎం కేసీఆర్ ఆకాంక్ష నెరవేరనున్నది. గురువారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ పథకాలకు ఆమోదం లభించింది. వీటికి సింగూరు ప్రాజెక్టు నుంచి 20 టీఎంసీల జలాలను కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. సంగారెడ్డి, జహీరాబాద్, అందోలు నియోజకవర్గాల్లోని 2.19 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే సంగమేశ్వర ఎత్తిపోతలకు రూ.2,653 కోట్లు కేటాయించగా, నారాయణఖేడ్, అందోలు నియోజకవర్గాల్లోని 1.65 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే బసవేశ్వర పథకానికి రూ.1,774 కోట్ల నిధులను కేటాయించింది. సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించిన ఈ పథకాలు త్వరలో కార్యరూపం దాల్చనుండగా, వీటి ద్వారా 3.84 లక్షల ఎకరాలకు సాగు నీరందనున్నది. ప్రస్తుతం సర్వే పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఎత్తిపోతలకు సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్)లు సిద్ధమవుతున్నాయి. అవి త్వరలోనే ప్రభుత్వానికి అందనున్నాయి. ప్రభుత్వ నిర్ణయంపై జిల్లావ్యాప్తంగా రైతులు, టీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ శుక్రవారం సంబురాలు నిర్వహించుకున్నారు.
సంగారెడ్డి, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ) : సంగారెడ్డి జిల్లాలో గోదావరి జలాలు త్వరలో పరుగులు పెట్టనున్నాయి. ఈ ప్రాంతానికి గోదావరి జలాలు తరలించాలన్న సీఎం కేసీఆర్ ఆకాంక్ష నెరవేరనున్నది. సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించిన సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలు త్వరలో కార్యరూపం దాల్చనున్నాయి. రెండు ఎత్తిపోతలకు సీఎం కేసీఆర్ గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో పాటు జలాలు, నిధులు కేటాయించారు. గురువారం జరిగిన సమావేశంలో సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రెండు ఎత్తిపోతల పథకాలకు సింగూరు నుంచి 20 టీఎంసీల జలాలను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. సంగారెడ్డి, జహీరాబాద్, అందోలు నియోజకవర్గాల్లోని 2.19 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే సంగమేశ్వర ఎత్తిపోతల పథకానికి రూ.2,653 కోట్ల నిధులు కేటాయించింది. నారాయణఖేడ్ అందోలు నియోజకవర్గాల్లో 1.65 లక్షల ఎకరాలకు సాగునీరందించే బసవేశ్వర ఎత్తిపోతల పథకానికి రూ.1,774 కోట్లను కేటాయించింది. రెండు పథకాలకు కలిపి రూ.4427 కోట్ల నిధులను ఖర్చు చేసేందుకు సాగునీటి శాఖకు పరిపాలన అనుమతులు ఇస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో సంగారెడ్డి జిల్లాలో సాగు స్వరూపం మారిపోనున్నది. జిల్లాలోని 3.84 లక్షల ఎకరాలకు సాగునీరంది రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు నిండనున్నాయి.
జిల్లా అంతటా సంబురాలు
సీఎం కేసీఆర్ సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు నిధులు, జలాలు కేటాయించడంతో సంగారెడ్డి జిల్లాలోని రైతులు శుక్రవారం సంబురాలు నిర్వహించుకున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ శ్రేణులు సైతం సంబురాల్లో పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ ఫ్లెక్సీలకు పాలతో అభిషేకం చేశారు. సీఎం కేసీఆర్ జిల్లాలో రెండు ఎత్తిపోతలు ఏర్పాటు చేస్తుండడంతో జిల్లా వ్యవసాయరంగ ముఖచిత్రం మారనుందని, రైతులు జీవితాల్లో వెలుగులు నిండుతాయని, జిల్లా అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతుందని అందోలు ఎమ్మెల్యే క్రాంతికిరణ్, నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావు, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆనందం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతలకు నిధులు కేటాయించడంతో వారంతా కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం నారాయణఖేడ్లో ఎమ్మెల్యే భూపాల్రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ శ్రేణులు సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. పెద్ద ఎత్తున పటాకులు కాల్చి ఆనందాన్ని వ్యక్తం చేశారు. రాయికోడ్, మునిపల్లి మండల కేంద్రాల్లో సైతం టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలతో క్షీరాభిసేకం చేశారు. పలుచోట్ల రైతులు సైతం వేడుకలు నిర్వహించారు. ఈ రెండు ఎత్తిపోతలు పూర్తయితే జహీరాబాద్, సంగారెడ్డి, అందోలు, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరగనున్నది. వ్యవసాయ, అనుబంధ రంగాలు అభివృద్ధి చెంది మరింత మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశాలు ఉన్నాయి.
వేగంగా సిద్ధమవుతున్న సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)
సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతలకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) సిద్ధమవుతున్నది. ఆర్థిక మంత్రి హరీశ్రావు ఎప్పటికప్పుడు ఇరిగేషన్ అధికారులు, సర్వే ఏజెన్సీలతో డీపీఆర్ తయారీపై మాట్లాడుతూ సూచనలు చేస్తున్నారు. సంగమేశ్వర ఎత్తిపోతలకు సంబంధించిన క్షేత్రస్థాయి సర్వే పూర్తయ్యింది. సర్వే ఏజెన్సీ ప్రస్తుతం డీపీఆర్ను సిద్ధం చేస్తున్నది. నెలాఖరు వరకు డీపీఆర్ ప్రభుత్వానికి సమర్పిస్తామని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. బసవేశ్వర ఎత్తిపోతల పథకానికి సంబంధించి డీపీఆర్ తయారీ ప్రక్రియ కొనసాగుతున్నది. నెలాఖరు వరకు బసవేశ్వర ఎత్తిపోతల డీపీఆర్ ప్రభుత్వానికి అందజేయనున్నారు. వచ్చేనెల డీపీఆర్లకు ప్రభుత్వం ఆమోదం తెలిపే అవకాశం ఉంది. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పనులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేసే అవకాశం ఉంది. దసరాలోపు శంకుస్థాపన కార్యక్రమం ఉండవచ్చని సమాచారం.
సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటాం:ఎమ్మెల్యే క్రాంతి కిరణ్
అందోల్, సెప్టెంబర్ 17 : సంగమేశ్వర ఎత్తిపోతల ద్వారా అందోల్, సంగారెడ్డి, జహీరాబాద్ నియోజకవర్గాలకు సాగునీరు అందనుందని ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ చెప్పారు. శుక్రవారం జోగిపేటలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. బసవేశ్వర ఎత్తిపోతల ద్వారా అందోల్, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లోని రైతులకు సాగునీరు అందనున్నదని అన్నారు. సింగూరు జలాలు అందుబాటులో ఉన్నా వాడుకోలేని దుస్థితి ఉండేదన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి కేసీఆర్ కృషితో ఆ సమస్యకు విముక్తి లభించిందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటానని తెలిపారు. ఆయన విజన్తో అందోల్నియోజకవర్గంలో రెండు లక్షలకు పైగా ఎకరాలకు సాగునీరు అందనుందన్నారు. అందోల్,
నారాయణఖేడ్, జహీరాబాద్, సంగారెడ్డి నియోజకవర్గాల్లో రైతులు సంబురాలు జరుపుకొంటున్నారని తెలిపారు.
ఎత్తిపోతల నిర్మాణం దిశగా వేగంగా అడుగులు
నీళ్లు, నిధుల కేటాయింపుతో సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాల నిర్మాణం దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి గోదావరి జలాలను సింగూరు ప్రాజెక్టులోకి తీసుకు వస్తున్నారు. అక్కడి నుంచి సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల ద్వారా జలాలను ఎత్తిపోసి సంగారెడ్డి, అందోలు, జహీరాబాద్, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లోని 3.84 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం నీళ్లు, నిధులు కేటాయించింది.
సంగమేశ్వర ఎత్తిపోతల పథకం ద్వారా జహీరాబాద్, అందోలు, సంగారెడ్డి నియోజకవర్గాల్లోని 11 మండలాలకు చెందిన 231 గ్రామాలకు సాగునీరు అందనున్నది. సంగమేశ్వర ఎత్తిపోతల పథకానికి సింగూరు జలాశయం కుడివైపు 12 టీఎంసీల నీటిని ఎత్తిపోయనున్నారు. సంగమేశ్వర ఎత్తిపోతల పథకం నిర్మాణానికి ప్రభుత్వం రూ.2,653 కోట్ల నిధులు కేటాయించింది. బసవేశ్వర ఎత్తిపోతల పథకం ద్వారా అందోలు, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లోని 1.65 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. ఇందుకోసం సింగూరు జలాశయం ఎడమ వైపు నుంచి 8 టీఎంసీల జలాలను ఎత్తిపోయనున్నారు. బోరంచ వద్ద నీటి ఎత్తిపోతలను ప్రారంభించి అందోలు నియోజకవర్గలోని వట్పల్లి మండలం వరకు సాగునీరు ఇవ్వనున్నారు. రెండు నియోజకవర్గాల్లోని 8 మండలాల్లోని 166 గ్రామాలకు చెందిన 1.65 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు. బసవేశ్వర ఎత్తిపోతల పథకం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.1774 కోట్లను కేటాయించింది. ఈ రెండు ఎత్తిపోతల పథకాలను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేసి సాగునీరు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతున్నది. ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకోవడంపై ప్రజాప్రతినిధులు, రైతులు, అన్నివర్గాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నిరంతరంగా సాగునీళ్లు
ఇక నుంచి నిరంతరంగా రైతాంగానికి సాగునీళ్లు అందనున్నాయి. ముచ్చటగా మూడు పంటలు సాగు చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎత్తిపోతలకు నిధులు కేటాయించడం సంతోషకరం. గురువారం కేబినెట్లో సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలపై చర్చించి ఏకగ్రీవంగా తీర్మానం చేసి ఆమోదించడం గొప్పవిషయం. పం టలు వేసేందుకు వర్షాలకోసం ఆకాశం వైపు ఎదురు చూసే రోజులు ఇక ఉండవు. సంగమేశ్వరతో జహీరాబాద్, అందోల్, సంగారెడ్డి నియోజకవర్గాల్లో 2.19 ఎకరాలకు సాగునీళ్లు అందనున్నాయి. సంగారెడ్డి నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో 50 గ్రామాలకు సాగునీళ్లు రానున్నాయి. ఇందులో సదాశివపేట మండలంలో 27 గ్రామాలు, కొండాపూర్లో 13 గ్రామాలు, కందిలో 4 గ్రామాలు, సంగారెడ్డి మండలంలో ఆరు గ్రామాలకు సాగునీళ్లు పరవళ్లు తొక్కనున్నాయి. దీంతో దశాబ్దాల కాలంగా రైతులు ఎదురు చూస్తున్న సాగునీటి గోసతీరనున్నది. – చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే
సీఎం కేసీఆర్తోనే రైతుల అభివృద్ధి టీఆర్ఎస్నాయకులు
సాయికుమార్, అల్లం నవాజ్రెడ్డి
మునిపల్లి, సెప్టెంబర్ 17 : సీఎం కేసీఆర్తోనే రాష్ట్రంలోని రైతులు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నారని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సాయికుమార్, అల్లం నవాజ్రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన మునిపల్లిలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల పాలిట సీఎం కేసీఆర్ దేవుడన్నారు. సంగమేశ్వర ఎత్తిపోతల పథకానికి ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇవ్వడం సంతోషకరమన్నారు. రాష్ట్రంలో రైతుల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత టీఆర్ఎస్ పార్టీకే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల సర్పంచ్లు రమేశ్, వీరన్నాపాటిల్, విశ్వనాథంపాటిల్, ఎంపీటీసీ రాజశేఖర్, మాజీ ఎంపీపీ చం ద్రయ్య, నాయకులు, వెంకట్రాములు, నారాయణ, భాస్కర్, నర్సింహులు, గరిబొద్దీన్, మల్లేశం, మౌలానా, నవీన్, పరశురాం, మోహన్ పాల్గొన్నారు.
సంగమేశ్వర తో ప్రతి ఎకరాకు సాగునీరు
జహీరాబాద్, సెప్టెంబర్ 17 : సంగమేశ్వర ఎత్తిపోతల పథకంతో ప్రతి ఎకరాకు సాగు నీరు అందించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు తెలిపారు. శుక్రవారం జహీరాబాద్ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఆయన సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేసి మాట్లాడారు. కాళేశ్వరం నీటితో సింగూరు ప్రాజెక్టు నింపి జహీరాబాద్ నియోజకవర్గంలో 1.20 లక్షల ఎకరాల కు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నదన్నారు. సంగమేశ్వర ఎత్తిపోతల పథకం పనులు చేసేందుకు సర్వే చేస్తున్నారన్నారు. మంత్రి మండలిలో సంగమేశ్వర ఎత్తిపోతల పథకాన్ని ఆమోదించడంతో పనులు వేగంగా జరిగే ఆవకాశం ఉందన్నారు. జహీరాబాద్ నియోజకవర్గ ప్రజలు సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.
బసవేశ్వర ఎత్తిపోతలతో ‘ఖేడ్’ కష్టాలు దూరం
నారాయణఖేడ్, సెప్టెంబర్ 17: నారాయణఖేడ్ నియోజకవర్గంలో 1.41 లక్షల ఎకరాలకు సాగు నీరందించే బసవేశ్వర ఎత్తిపోతల పథకం పూర్తయితే నియోజకవర్గ ప్రజల కష్టాలు శాశ్వతంగా దూరమైనట్లేనని ఎమ్మె ల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. బసవేశ్వర ఎత్తిపోతల పథకాన్ని మంత్రి మండలిలో ఆమోదించటాన్ని హర్షిస్తూ శుక్రవారం నారాయణఖేడ్లోని రాజీవ్చౌక్ వద్ద సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి ఆయన క్షీరాభిషేకం చేసి, పటాకులు కాల్చి సంబురాలు చేసుకు న్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… నారాయణఖేడ్ మండలంలోని కొన్ని గ్రామాలతో పాటు కంగ్టి, మనూరు, నాగల్గిద్ద మండలాల్లో సాగునీటి వనరులు లేని కారణంగా వర్షాధార పంటలపై ఆధారపడి వ్యవసాయం చేసేవారన్నారు. వర్షాలు అనుకూలించని సందర్భాల్లో ఆర్థిక ఇబ్బందులతో ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే దుస్థితి ఉన్నప్పటికీ సమైక్య రాష్ట్రంలోని పాలకులు ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. రూ.1774 కోట్లతో బసవేశ్వర ఎత్తిపోతల పథకం నిర్మాణానికి చర్యలు చేపట్టడంతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు కింద 19ఏ ప్యాకేజీ ద్వారా మరో 35 వేల ఎకరాలకు ( నల్లవాగు ప్రాజెక్టు నిత్యం నిండుకుండలా ఉండే విధంగా)సింగూరు నీటిని నల్లవాగుకు తరలించేందుకు మరో రూ.100 కోట్లతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గ ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని బసవేశ్వర ఎత్తిపోతల పథకం నిర్మాణానికి వేగవంతమైన చర్యలు తీసుకుంటున్న సీఎం కేసీఆర్, సహకరిస్తున్న మంత్రి హరీశ్రావుకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉంటే పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీరుపై ఎమ్మెల్యే మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సం క్షేమం విషయంలో ప్రభుత్వానికి సూచనలు చేయడం మాని నిత్యం విమర్శలు చేస్తే ప్రజ లే తగినబుద్ధి చెబుతారని హెచ్చరించారు.
రాయికోడ్లో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం
రాయికోడ్, సెప్టెంబర్ 17: ముఖ్యమంత్రి కేసీఆర్ అందోల్ నియోజకవ్గంలో బసవేశ్వర్, సంగమేశ్వర ఎత్తిపోతల పథకాలకు పరిపాలన అనుమతులు ఇవ్వడంపై నాయకులు హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం రాయికోడ్లోని ఎంపీపీ కార్యాలయం ఆవరణలో స్థానిక ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ఆదేశాల మేరకు సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మండల కో-ఆప్షన్ సభ్యుడు అబెదాలీ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బస్వరాజుపాటిల్, ఆత్మ కమిటీ చైర్మన్ విఠల్, సింగితం, ఎంపీటీసీ నిరంజన్, సర్పంచ్ ప్రవీణ్కుమార్, నాయకులు అశోక్, శంకర్, మారుతి, చంద్రశేఖర్, సంగమేశ్వర్, మల్లేశం, నాగేశ్ తదితరులు పాల్గొన్నారు.
బీడు భూములు సస్యశ్యామలం
సంగమేశ్వర ఎత్తిపోతలతో జహీరాబాద్ నియోజకవర్గంలోని బీడు భూములు సస్యశ్యామలం కానున్నాయి. సీఎం కేసీఆర్ వ్యవసాయ రంగానికి సాగునీటి కోసం సంగమేశ్వర ఎత్తిపోతల పథకానికి రూపకల్పన చేశారు. సంగమేశ్వర ఎత్తిపోతల పథకానికి పరిపాలన అనుమతులు రావడంతో ఇక పనులు వేగంగా జరిగే ఆవకాశం ఉంది. నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఎకరాకు సాగు నీరు అందించే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేస్తున్నారు. నియోజకవర్గ రైతులు ఎల్లప్పుడూ సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటారు.
-ఎమ్మెల్యే మాణిక్రావు ,
జహీరాబాద్ బసవేశ్వర ఎత్తిపోతలతో
బసవేశ్వర ఎత్తిపోతల పథకం పూర్తయితే నారాయణఖేడ్ నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుంది. నియోజకవర్గంలోని అన్ని మండలాలకు సాగునీరందించే గొప్ప ప్రాజెక్టు ఇది. ముఖ్యంగా నారాయణఖేడ్ మండలంలోని కొన్ని గ్రామాలతో పాటు కంగ్టి, మనూరు, నాగల్గిద్ద మండలాల్లో చెరువులు, కుంటలు లేక అక్కడి రైతులు వర్షాధార పంటలు పండిస్తున్నారు. బసవేశ్వర ఎత్తిపోతల పథకం ద్వారా ఎనిమిది టీఎంసీల నీటితో 1.75 లక్షల ఎకరాలకు సాగునీరందే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం రూ.1774 కోట్ల అంచనా వ్యయాన్ని ప్రతిపాదిస్తూ అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులను వీలైనంత త్వరగా ప్రారంభించాలనే సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఉన్నతాధికారులు నిర్విరామంగా కృషి చేస్తున్నారు. బసవేశ్వర ఎత్తిపోతల పథకాన్ని మంత్రి మండలిలో ఆమోదించడం ఆనందంగా ఉంది. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్రావు సహా మంత్రి మండలి సభ్యులకు నియోజకవర్గప్రజల పక్షాన కృతజ్ఞతలు.
-మహారెడ్డి భూపాల్రెడ్డి, నారాయణఖేడ్ ఎమ్మెల్యే