జాతీయ పారిశ్రామిక ఉత్పత్తి మండలి(నిమ్జ్) ఏర్పాటు కానుండడంతో జహీరాబాద్ ప్రాంతం పారిశ్రామికంగా పరుగులు తీయనుంది. కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దున ఉన్న ఈ ప్రాంతంలో రోడ్ కనెక్టివిటీ పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తున్నది. జహీరాబాద్-బీదర్- దెగ్లూర్ వరకు రహదారిని నాలుగు లేన్లుగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషిచేస్తున్నది. మూడు రాష్ర్టాల్లో కలిపి 100 కి.మీ విస్తరించి ఉన్న ఈ రోడ్డును జాతీయ రహదారిగా మార్చేందుకు కేంద్రం అంగీకరించింది. ఈ రోడ్డను ఎన్హెచ్-44, 65లతో అనుసంధానం చేసేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. తద్వారా నిమ్జ్లో ఉత్పత్తి చేసే వస్తువులు, వాహనాలను దేశంలోని వివిధ ప్రాంతాలకు సులభంగా రవాణా చేయవచ్చు.
జహీరాబాద్, సెప్టెంబర్ 14: తెలంగాణ, కర్ణాటక, మహారాష్ర్టాల మధ్య ఉన్న జహీరాబాద్, బీదర్, దెగ్లూర్ రోడ్డును జాతీయ రహదారిగా తక్షణం నోటిఫై చేయాలని సీఎం కేసీఆర్ ఇటీవల ఢిల్లీ పర్యటనలో కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోరారు. జహీరాబాద్ నుంచి కర్ణాటక సరిహద్దు వరకు 25 కి.మీ రోడ్డు మార్గాన్ని జాతీయ రహదారిగా అభివృద్ధి చేయాలన్నారు. జహీరాబాద్-బీదర్ రోడ్డును జాతీయ రహదారిగా గుర్తించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తుండడంతో ఈప్రాంత ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముంబై-విజయవాడ జాతీయ రహదారి-65 ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం జహీరాబాద్, బీదర్, దెగ్లూర్ రోడ్డును జాతీయ రహదారిగా అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు పంపించింది. జహీరాబాద్ నుంచి బీదర్ 25 కిలోమీటర్ల దూరం ఉంటుంది. జాతీయ రహదారిగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాయి. ఈ రోడ్డు గుండా నిత్యం వేల సంఖ్యలో వాహనాలు రాకపోకలు సాగిస్తాయి. దీంతో ప్రయాణికులకు, వాహనదారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు నిధులు మంజూరు చేస్తున్నది. జాతీయ రహదారిని నాలుగు లేన్లుగా నిర్మించేందుకు భూ సేకరణకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నది. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ర్టలకు బీదర్ రోడ్డును అనుసంధానం చేయనున్నారు. 65వ జాతీయ రహదారికి కలుపుతూ మహారాష్ట్రలోని దెగ్లూర్ వరకు జాతీయ రహదారి విస్తరించాలని కేంద్ర ప్రభుత్వానికి ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.
ప్రమాదాల నివారణకు చర్యలు..
ఎలాంటి మలుపులు లేకుండా జాతీయ రహదారి నిర్మించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తున్నది. జాతీయ రహదారిపై ప్రమాదాలు నివారించేందుకు నూతనంగా నిర్మించే రోడ్డుకు ఎలాంటి మలుపులు లేకుండా చూసేందుకు భూసేకరణ చేయాలని ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. జాతీయ రహదారి విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర అనుమతి కోసం ప్రయత్నాలు చేయడంపై ఈ ప్రాంత ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.