సంగారెడ్డి కలెక్టరేట్, సెప్టెంబర్ 12 : వైద్య డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు సంబంధించిన నీట్ ఆదివారం జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలో ప్రశాంతంగా జరిగింది. మొత్తం 1868 మంది విద్యార్థులకు గానూ 1810 మంది విద్యార్థులు పరీక్ష రాయగా, 58 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. దీంతో 96.89 హాజరు శాతం నమోదైంది. సంగారెడ్డి పట్టణంలో మొత్తం 6 పరీక్షా కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా, ఆయా కేంద్రాలకు 1868 మంది విద్యార్థులను కేటాయించారు. అత్యధికంగా సెయింట్ పీటర్స్ హైస్కూల్లో 480 మంది విద్యార్థులను కేటాయించగా, 468 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. 12 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. సెయింట్ ఆంథోనీస్ డిగ్రీ కళాశాలలో 360 మంది విద్యార్థులకు గానూ 353 మంది విద్యార్థులు హాజరు కాగా, ఏడుగురు విద్యార్థులు గైర్హాజరయ్యారు. విద్యానగర్ సెయింట్ ఆంథోనీస్ పాఠశాలలో 300 మంది విద్యార్థులకు గానూ 293 మంది విద్యార్థులు పరీక్ష రాయగా, ఏడుగురు గైర్హాజరు అయ్యారు. ఎస్వీ జూనియర్ కళాశాల కేంద్రంలో 300 మందికి గానూ 291 మంది విద్యార్థులు హాజరయ్యారు. 9 మంది విద్యార్థులు గైర్హాజయ్యారు. పయనీర్స్ హై స్కూల్ కేంద్రంలో 240 మందికి 230 మంది విద్యార్థులు హాజరు కాగా, 10 మంది హాజరు కాలేదు. రిషీ ఉన్నత పాఠశాల కేంద్రంలో 188 మంది విద్యార్థులకు 175 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. 13 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మొ త్తం 1809 మంది విద్యార్థులు పరీక్ష రాయగా, 58 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటలకు వరకు పరీక్ష నిర్వహించగా, మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత విద్యార్థులకు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి లేదన్న సూచన మేరకు విద్యార్థులు సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. దూర ప్రాంతాల నుంచి పరీక్ష రాసేందుకు వచ్చిన విద్యార్థులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఉదయం 11 గంటల నుంచే పరీక్షా కేంద్రాలకు చేరుకోవడంతో ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్ష నిర్వహించారు. ముఖ్యంగా కరోనా నిబంధనలు పాటించేలా చర్య లు తీసుకున్నారు. జిల్లా కేంద్రానికి ప్రధాన రూట్లలో ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపింది. ఇదిలా ఉండగా, నీట్ పరీక్ష తొలిసారిగా సంగారెడ్డి జిల్లాలో నిర్వహించారు. ఈ ఏడాదికి సంగారెడ్డి జిల్లాకు మెడికల్ కాళాశాల మంజూరు కావడం, నీట్ పరీక్ష స్థానికంగా నిర్వహించడంతో వైద్య విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.